ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ ఇటీవలి కాలంలో హిట్స్ మీద హిట్స్తో దూసుకెళుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఆయన 111వ చిత్రం సైతం ఫిక్స్ అయిపోయింది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సినిమా తెరకెక్కనుంది. ‘వీరసింహారెడ్డి’ తర్వాత వీళ్లిద్దరి కాంబోలో రూపొందనున్న రెండో చిత్రం ఇదే కావడం గమనార్హం. వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీశ్ కిలారు ఈ సినిమాను నిర్మించనున్నారు. ఈ నెల 10న బాలయ్య పుట్టినరోజును పురస్కరించుకుని ఆదివారం ఈ ప్రాజెక్ట్ను అధికారికంగా ప్రకటించారు.
ఈ సందర్భంగా దర్శకుడు గోపీచంద్ మలినేని ఎక్స్ వేదికగా ఒక పోస్ట్ పెట్టారు. ‘‘ఈసారి మా గర్జన మరింత గట్టిగా ఉండనుంది. బాలకృష్ణతో కలిసి మరోసారి పని చేస్తున్నందుకు ఎంతో ఆనందంగా ఉంది. ఇది చరిత్రలో నిలిచిపోయే సినిమా అవుతుంది’’ అని పేర్కొన్నారు. చిత్ర నిర్మాణ సంస్థ సైతం చరిత్రను.. భారీ యాక్షన్ను ముడిపెట్టి ఓ వినూత్నమైన ఎపిక్ స్టోరీతో దీన్ని రూపొందించనున్నామని వెల్లడించారు. ఇందులో బాలయ్య మునుపెన్నడూ చూడని విధంగా శక్తిమంతమైన పాత్రలో కనిపించనున్నారని.. ప్రస్తుతం స్క్రిప్ట్, ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ ఎండింగ్కు వచ్చాయని చిత్ర నిర్మాణ సంస్థ తెలిపింది. సినిమాకు సంబంధించిన ఇతర నటీనటుల వివరాలను త్వరలోనే ప్రకటించనున్నారు.