తెలంగాణ నుంచి విడిపోయిన తర్వాత ఏపీలో ఒక ఐదేళ్లు ఒక పరిపాలన.. మరో ఐదేళ్లు మరో పరిపాలన.. మళ్లీ అది కాదని ఐదు సంవత్సరాలు మరో పరిపాలన. చూస్తుండగానే 12 ఏళ్లు కరిగిపోయాయి. ఈ 12 ఏళ్లలో ఏపీ ఎంత అభివృద్ధి సాధించిందంటే.. శూన్యమనే చెప్పాలి. ప్రభుత్వాలైతే మారాయి కానీ ప్రజల తలరాత మాత్రం మారలేదు. దీనిని అదనుగా చేసుకుని హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ గణనీయంగా పెరిగిపోయింది. ఇది ఎవరూ అవునన్నా.. కాదన్నా వాస్తవం. ప్రస్తుతం మళ్లీ అమరావతి పునర్నిర్మాణాన్ని కూటమి ప్రభుత్వం చేపట్టింది. ఇది నిజంగానే సాధ్యమవుతుందా? లేకుంటే నీటి మీద రాతలేనా? అభివృద్ధి జరిగితే ఓకే.. లేదంటే ప్రజలు చాలా ఇబ్బంది పడతారు. వారికి భవిష్యత్ కూడా ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. ఇదంతా దృష్టిలో పెట్టుకుని చూస్తే ప్రస్తుత ఏపీ పాలన తమను ఓట్లేసి గెలిపించిన ప్రజలకు ఎలాంటి సుఖసంతోషాలను ఇస్తుంది? అనేది పక్కనపెడితే ప్రస్తుతం అమరావతి పున: నిర్మాణం మాత్రం కొందరికి మోదాన్ని.. కొందరి ఖేదాన్ని అందిస్తోంది. ఇది ఎందుకు? అంటే ట్యాగ్ తెలుగు అందిస్తున్న ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.
మీ రాజధాని ఏది?
అమరావతి పునర్మిర్మాణాన్ని ఏపీ ప్రభుత్వం చేపట్టడమేది హర్షణీయమే. గత ప్రభుత్వ హయాంలో ‘మీ రాజధాని ఏది?’ అంటే ఆంధ్రులు చెప్పుకోలేని పరిస్థితి. విశాఖను రాజధాని చేస్తామంటూ గత ప్రభుత్వం ప్రకటించడం.. అంతలోనే అవాంతరం రావడం.. ఓ సినిమాలో ‘వధువు వస్తున్నది’ అంటారు. కొన్ని సార్లు అన్నా కూడా వధువు తప్ప వేరెవరో వస్తుంటారు. అయితే చివరకు సినిమాలో వధువు అయితే వచ్చింది కానీ గత ప్రభుత్వం ఉన్నంత కాలం విశాఖ రాజధానిగా అయితే మారలేదు. మూడు రాజధానులు ప్రకటించి అట్టర్ ఫ్లాప్ అయ్యింది వైసీపీ ప్రభుత్వం. అయితే విశాఖను పరిపాలనా రాజధానిగా చేస్తామంటూ అక్కడ ఒక ఇంద్ర భవనం లాంటి ఇంటిని కూడా వైసీపీ అధినేత జగన్ రుషికొండను తొలిచి మరీ నిర్మించుకున్నారు. ఈసారి కూడా గెలిచి ఉంటే విశాఖ రాజధాని అయ్యుండేదేమో కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.
ఆధునిక మహానగర నిర్మాణం..
కొన్నేళ్లపాటు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉన్న అమరావతి పున:నిర్మాణానికి తిరిగి నడుం బిగించింది. ఈ క్రమంలోనే ఇవాళ (శుక్రవారం) అమరావతిలో శంకుస్థాపన నిర్వహించనున్నారు. దీనికి ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. చాలా మంచి కార్యక్రమమే. ఒక ఆధునిక మహానగర నిర్మాణం అనేది ఓ అద్భుత ఘట్టమే. ఆంధ్రులు గర్వంగా చెప్పుకునేలా ఒక రాజధాని నిర్మాణం పున: ప్రారంభం కాబోతున్న రోజిది. దీంతో సంపద సృష్టి, ఉద్యోగాలు, ఉపాధి కల్పన జరగవచ్చు. ఒక విజన్ కలిగిన నాయకుడి చేతిలో సగర్వంగా ఆంధ్ర రాజధాని రూపుదిద్దుకోవడానికి అడుగులు పడుతున్నాయి. ఇక పెండింగ్ అంటూ ఏమీ ఉండదని ప్రభుత్వ దూకుడు చూస్తుంటే తెలుస్తోంది. అన్ని పనులూ ఏకకాలంలో చేపట్టేలా రూ.77,250 కోట్లతో అంచనాలు.. రూ.49,000 కోట్ల పనులకు టెండర్లు.. ప్రపంచ బ్యాంకు నుంచి రూ.15 వేల కోట్ల ఆర్థిక సాయం వచ్చేలా చేసుకోవడం.. ఇలా చకచకా పనులన్నీ పూర్తయ్యాయి. మరి అంతా బాగానే ఉంది కదా.. వచ్చిన చిక్కేంటి అంటారా? రియల్ ఎస్టేట్..
కొన్న వారి పరిస్థితేంటి?
ఆంధ్రాలో రియల్ ఎస్టేట్ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. దీనికి కారణం.. మనం పైన చెప్పుకున్నట్టుగా ప్రభుత్వాలు మారడం. ప్రస్తుతం అమరావతి వైపున ఉన్న వారికి ల్యాండ్ బీభత్సంగా రేటు పెరుగుతుంది. అటు విశాఖలో నేలకు ఒరిగింది. వాస్తవానికి వైసీపీ ప్రభుత్వ హయాంలో అనూహ్యంగా విశాఖలో భూముల రేట్లు పెరిగాయి. కొందరు ఆనందంగా భూములను అమ్మేసుకుని కోట్లు గడించారు. అమ్మేసిన వారు ఓకే.. కొన్న వారి పరిస్థితి? తిరిగి ఆ రేటుకు భూముల ధరలు పెరగాలంటే ఎంత కాలం పడుతుంది? వాస్తవానికి ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువుదీరడంతోనే అమరావతిలో భూములకు రెక్కలు రాగా.. విశాఖలో ఢమాల్ అన్నాయి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి ఇది దారుణమైన దెబ్బ. అందుకే అన్నది.. కొందరికి మోదం.. కొందరికి ఖేదమని..
ప్రజావాణి చీదిరాల