తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్. తెలంగాణలో మరో దిగ్గజ కంపెనీతో పాటు పలు కంపెనీలు కొలువుదీరనున్నాయి. ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జపాన్ పర్యటనలో ఉన్నారు. అక్కడ పలు దిగ్గజ కంపెనీల ప్రతినిధులతో రాష్ట్ర బృందం సమావేశమైంది. ఈ క్రమంలోనే సీఎం రేవంత్.. వివిధ రంగాల్లో పెట్టుబడులకు అనుకూలతను వివరించి.. తెలంగాణలో పెట్టుబడులకు ఆహ్వానించారు. తెలంగాణలో లైఫ్ సైన్సెస్, జీసీసీ, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని.. అలాగే ఈవీ, టెక్స్టైల్స్, ఏఐ డేటా సెంటర్లు, లాజిస్టిక్స్లో పెట్టుబడులు పెట్టాలని కోరారు.
ఈ క్రమంలోనే రేవంత్ బృందం ఫ్యూచర్ సిటీ, మూసీ పునరుజ్జీవనం తదితర ప్రచార వీడియోలను ప్రదర్శించింది. ఈ పర్యటనలో రేవంత్ బృందం పలు భారీ పెట్టుబడులను సాధించింది. ముఖ్యంగా ఏఐ డేటా సెంటర్ క్లస్టర్ను రూ.10,500 కోట్లతో ఎన్టీటీ డేటా, నెయిసా సంస్థలు సంయుక్తంగా ఈ డేటా సెంటర్ క్లస్టర్ను ఏర్పాటు చేయనున్నాయి. అలాగే రూ.562 కోట్లతో రుద్రారంలో మరో పరిశ్రమ ఏర్పాటుకు తోషిబా సంస్థతో ఒప్పందం జరిగింది. త్రైపాక్షిక ఒప్పందాలతో పాటు తోషిబా అనుబంధ సంస్థ టీటీడీఐ ప్రతినిధులు రేవంత్ సమక్షంలో ఎంవోయూపై సంతకాలు చేశారు. విద్యుత్ సరఫరా, పంపిణీ రంగంలో పెట్టుబడులు తెలంగాణకు రానున్నాయి.