YS Jagan :
షర్మిలను దూరం పెట్టింది అందుకేనన్న జగన్
ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు, తన సోదరి వైఎస్ షర్మిలపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
షర్మిలను, దివంగత వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీతను తన పార్టీలో చేర్చుకుంటే అది కుటుంబ పార్టీ, కుటుంబ రాజకీయం అయ్యేదని జగన్ అన్నారు.
అలా కాకూడదనే వారిని దూరం పెట్టినట్లు తెలిపారు. ఇటీవల ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పైగా, షర్మిలకు డిపాజిట్లు కూడా దక్కవనే బాధ తనకు ఉందన్నారు.
అయితే దురదృష్టం కొద్దీ ఆమె వెళ్లిపోయారని, అయినా ఆమెను ఇప్పటికీ మిస్ అవుతూనే ఉన్నానని చెప్పారు.
ఆమె వెళ్లిపోయినా.. ప్రేమలు ఎక్కడికి పోతాయని ప్రశ్నించారు. కారణాలేవైనా ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం అన్నాచెల్లెలి యుద్ధం నడుస్తున్న విషయం తెలిసిందే.
ఎప్పుడూ లేని విధంగా వైఎస్ఆర్ కుటుంబం రెండుగా విడిపోయి 2024 ఎన్నికల్లో తలపడుతోంది.
సీఎం జగన్, కడప సిట్టింగ్ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఓ వైపు.. జగన్ చెల్లెళ్లు వైఎస్ షర్మిల, సునీత మరోవైపు నిలబడి తలబడుతున్నారు. ఈ నేపథ్యంలో రెండు వర్గాల మధ్య మాటలు కూడా తూటాల లెక్కన పేలుతున్నాయి.
తన చెల్లెలు షర్మిల పచ్చ చీర కట్టుకుని ప్రత్యర్థుల ఇళ్లకు వెళ్లి వారితో చేతులు కలిపిందంటూ వైఎస్ జగన్.. షర్మిలను ఉద్దేశించి నేరుగా విమర్శలు చేస్తున్నారు.
అయితే బాబాయి వివేకాను చంపిన హంతకులకు జగన్ టికెట్ ఇచ్చారంటూ షర్మిల ఆరోపిస్తున్నారు, అలాగే వైఎస్ అవినాష్ రెడ్డి మీదకు పోటీకి కూడా దిగారు షర్మిల.
ఈ క్రమంలోనే జగన్ తాజా వ్యాఖ్యలు చేశారు. ఇక ప్రధానిగా రాహుల్ గాంధీ కంటే నరేంద్ర మోదీయే ఉత్తమమని వైఎస్ జగన్ అభిప్రాయపడ్డారు.
మైనారిటీలు వంటి కొన్ని అంశాలను మినహాయిస్తే రాహుల్ గాంధీ కంటే నరేంద్ర మోదీయే ప్రధాని పదవికి సరైన వ్యక్తి అని చెప్పారు. రాహుల్ గాంధీ అందరి కంటే గొప్పవారని ఎప్పటికీ చెప్పలేనని వైఎస్ జగన్ అన్నారు.
Also Read This Article :పంజాబి సినిమాకి రచయితగా జనార్ధన మహర్షి