శ్రీ విష్ణు, కేతిక శర్మ, ఇవానా ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘సింగిల్’. కార్తీక్ రాజు దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో వెన్నెల కిషోర్ ముఖ్య పాత్ర పోషించారు. గీతా ఆర్ట్స్ మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో కళ్యా ఫిల్మ్స్తో కలిసి చిత్రాన్ని విద్యా కొప్పినీడి, భాను ప్రతాప, రియాజ్ చౌదరి నిర్మించారు. ఈ చిత్రం మే 9న విడుదలై తొలి షోతోనే మంచి హిట్ టాక్తో నడుస్తోంది. ఈ సందర్భంగా వెన్నెల కిషోర్ విలేకరుల సమావేశంలో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ‘‘సింగిల్’ చిత్రంలో నేను సెకండ్ హీరో అనడం చూస్తుంటే.. మనం చికెన్ బిర్యాని తిన్నప్పుడు అప్పుడప్పుడు లివర్ పీస్ వచ్చి బిర్యానీకి మరింత టేస్ట్ను తీసుకొచ్చిన ఫీలింగ్ కలుగుతుంది. ఇందులో నా క్యారెక్టర్ కూడా అలాంటిదే(నవ్వుతూ).
ఈ సినిమాలో హీరో స్నేహితుడిగా నన్నే ఎంచుకోవడానికి ఓ కారణం ఉంది. శ్రీ విష్ణు గారు చాలా స్పాంటీనియస్గా డైలాగ్స్ని ఇంప్రవైజ్ చేసేస్తారు. అలాంటి సమయంలో అంతే స్పాంటేనియస్గా రియాక్షన్ ఇచ్చే యాక్టర్ ఉండాలి. కాబట్టి నేనైతే బెటర్ అని డైరెక్టర్ రాజుగారు భావించి ముందుగానే నన్ను ఫిక్స్ అయ్యారు. భాను, నందు ఈ కథ చెప్పినప్పుడు ఎంత ఎంజాయ్ చేశానో.. అదే ఎంటర్టైన్మెంట్ స్క్రీన్ మీద కూడా వచ్చింది. వాస్తవానికి నా సినిమాను నేను స్క్రీన్పై చూసుకోలేను కానీ ఈ సినిమాను ఆడియన్స్తో కలిసి చూడటం చాలా సంతోషంగా అనిపించింది. కామెడీ పాత్రలని ఎంచుకునేంత వెర్సటాలిటీ ప్రస్తుతమైతే లేదు.
ముందు రైటర్స్ని మనం చేస్తే కొత్త కొత్త కామెడీ పాత్రలు వస్తాయి. ఒక ప్రపంచంలోకి ఎంటరై అక్కడ అలరించే పాత్రలు చేయడం నాకు ఇష్టం. హీరోగా చేయమంటూ కథలు వస్తున్నాయి గాని మళ్లీ లవ్ స్టోరీ, పాటలు అంటున్నారు. అవి అంతగా సూట్ కావు. బ్రహ్మానందం గారు తన వారసుడిగా నన్ను ఏదో సరదాగా ప్రకటించారు. నాకు కొంత బూస్టప్ ఇవ్వడానికి చెప్పారంతే. నా ఫేవరెట్ క్యారెక్టర్స్ చాలా ఉన్నాయి. కానీ జీవితాంతం మాత్రం వెన్నెల, బిందాస్, దూకుడు గుర్తుండిపోతాయి. గీతా ఆర్ట్స్లో అరవింద్ అనే క్యారెక్టర్ దొరకడం చాలా అదృష్టంగా ఫీలయ్యాను.
ప్రజావాణి చీదిరాల