Telangana Politics :
రుణమాఫీ సవాల్ పై మాటమార్చిన హరీశ్ రావు?
తెలంగాణలో రైతుల రూ.2 లక్షల రుణమాఫీ పై సీఎం రేవంత్ రెడ్డికి సవాళ్ల మీద సవాళ్లు విసిరిన బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావు మాట మార్చారు.
ఆగస్టు 15వ తేదీలోగా రుణమాఫీ చేస్తే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానన్న హరీశ్.. ఇప్పుడు రేవంత్ రెడ్డి మాట నిలబెట్టుకుంటే సన్మానం చేస్తానని ప్రకటించారు.
దీంతో ఎమ్మెల్యే పదవికి ఎక్కడ గండం వస్తుందోనని హరీశ్ భయపడ్డారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
గురువారం మెదక్ పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధుకు మద్దతుగా సిద్దిపేట నియోజకవర్గంలో నిర్వహించిన ప్రచార సభలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి..
రుణమాఫీపై మరోసారి ప్రకటన చేయడంతో హరీశ్ స్పందించారు.
ఆగస్టు 15 తరువాత హరీశ్ రావు రాజీనామాతో సిద్దిపేటకు ఉప ఎన్నిక వస్తుందని, కాంగ్రెస్ తరఫున కొత్త ఎమ్మెల్యేను గెలిపించుకుందామని ఈ సభలో రేవంత్ ప్రజలకు పిలుపునిచ్చారు.
దీంతో అప్రమత్తమైన హరీశ్ రావు.. రుణమాఫీ చేయడం ఒక్కటే కాదని, పంద్రాగస్టు లోగా కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీలనూ అమలు చేస్తే తాను రాజీనామా చేస్తానని షరతు విధించారు.
అదికూడా ఆరు గ్యారంటీల్లో 13 హామీలున్నాయని, అన్నింటినీ అమలు చేస్తేనే రేవంత్ సవాల్ కు తాను కట్టుబడి ఉంటానని చెప్పారు.
నర్సాపూర్ నియోజకవర్గం దౌల్తాబాద్లో నిర్వహించిన రోడ్ షోలో హరీశ్ రావు మాట్లాడుతూ ముఖ్యమంత్రిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
రేవంత్ రెడ్డి బాండ్ పేపర్ బౌన్స్ అయిందని, వారికి శిక్ష పడాల్సిందేనని… అందుకే లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఓడించాలని అన్నారు.
రేవంత్ రెడ్డి బీజేపీతో చేతులు కలిపారని ఆరోపించారు. రేవంత్ రెడ్డికి అహంకారం వచ్చిందని మండిపడ్డారు.
ఇవి కేవలం పదవుల కోసం, పార్టీల కోసం జరుగుతున్న ఎన్నికలు కాదని… తెలంగాణ భవిష్యత్తు కోసం జరుగుతున్న ఎన్నికలు అని పేర్కొన్నారు.
అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్ ఎన్నో హామీలు ఇచ్చిందని… కానీ ఏ ఒక్క హామీనీ నెరవేర్చలేదని విమర్శించారు.
Also Read This Article : వేర్ ఈజ్ 175 ధీమా?
