Srikar Bharat :
ఇంగ్లండ్తో టెస్టు సిరీస్లో తెలుగు ఆటగాడు కోన శ్రీకర్ భరత్ వికెట్ కీపింగ్ చేయడం దాదాపు ఖాయమే!
ఐదు టెస్టుల సిరీస్లో భాగంగా తొలి రెండు మ్యాచ్ల కోసం ప్రకటించిన జట్టులో భరత్, రాహుల్, ధ్రువ్ జురేల్ రూపంలో ముగ్గురు వికెట్ కీపర్లు ఉన్నారు.
అయితే ఈ ముగ్గురిలో వికెట్ కీపర్గా భరత్కే ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. వృద్ధిమాన్ సాహా తర్వాత స్వదేశంలో
అత్యుత్తమ టెస్టు కీపర్గా గుర్తింపు తెచ్చుకున్న భరత్.. గతేడాది ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్తో అరంగేట్రం చేశాడు.
అయితే వికెట్ల వెనుక వారెవ్వా అనిపించుకున్న భరత్.. బ్యాటర్గా ఏమాత్రం ప్రభావం చూపలేకపోయాడు.
ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (డబ్లూ్యటీసీ) ఫైనల్లోనూ చోటు దక్కించుకున్న భారత్ బ్యాట్తో మాత్రం ఆకట్టుకోలేకపోయాడు.
దీంతో భారత జట్టులో అతడి స్థానంపై అనుమానాలు పెరిగాయి. ఇటీవల దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా భరత్ జట్టులో ఉన్నా.. టీమ్ మేనేజ్మెంట్ మాత్రం కేఎల్ రాహుల్తో వికెట్ కీపింగ్ చేయించిన విషయం తెలిసిందే.
స్వదేశంలో రాహుల్తో కష్టమే!
సఫారీ టూర్లో పేసర్లకు సహకరించే వికెట్పై కీపర్గా రాణించిన కేఎల్ రాహుల్.. స్వదేశంలో ఇంగ్లండ్తో సిరీస్లో స్పెషలిస్ట్ బ్యాటర్గా బరిలోకి దిగే అవకాశాలే ఎక్కువ.
సాధారణంగా స్పిన్కు సహకరించే భారత పిచ్లపై వికెట్ కీపింగ్ చేయడం సులభమైన పని కాదు.
గతంలో వృద్ధిమాన్ సాహా ఈ పనిని విజయవంతంగా నిర్వర్తించాడు. ఆ తర్వాత రిషబ్ పంత్ రూపంలో అటు బ్యాటర్గా ఇటు కీపర్గా అదరగొట్టే ప్లేయర్ టీమ్ఇండియాకు దక్కగా..
రోడ్డు ప్రమాదంలో గాయపడి పంత్ జట్టుకు దూరమవడంతో మళ్లీ సమస్య మొదటికి వచ్చింది.
గతేడాది ఆస్ట్రేలియా పర్యటనతో జాతీయ జట్టులో చోటు దక్కించుకున్న ఆంధ్ర ఆటగాడు శ్రీకర్ భరత్ 8 ఇన్నింగ్స్ల్లో కలిపి 18.42 సగటుతో 129 పరుగులే చేశాడు.
అయితే బ్యాటింగ్లో పెద్దగా మెరుపులు మెరిపించలేకపోయినా.. వికెట్ల వెనుక ఆకట్టుకున్నాడు.
ముఖ్యంగా అశ్విన్, జడేజా, కుల్దీప్, అక్షర్ వంటి స్పిన్నర్ల బంతులను అంచనా వేయడంలో భరత్ కచ్చితత్వం కెప్టెన్ను ఆకట్టుకుంది.
ప్రస్తుతం వ్యక్తిగత కారణాల వల్ల విరాట్ కోహ్లీ తొలి రెండు టెస్టుల నుంచి తప్పుకోవడంతో కేఎల్ రాహుల్ను స్పెషలిస్ట్ బ్యాటర్గా.. భరత్ను పూర్తిస్థాయి కీపర్గా ఆడించే అవకాశాలే ఎక్కువ కనిపిస్తున్నాయి.

జురేల్కు నిరీక్షణే
తొలిసారి భారత జట్టుకు ఎంపికైన 22 ఏళ్ల ధ్రువ్ జురేల్కు మరికొంత కాలం నిరీక్షణ తప్పేలా లేదు.
మానసిక ఒత్తిడి కారణంగా యువ వికెట్ కీపర ఇషాన్ కిషన్ అందుబాటులో లేకుండా పోవడంతో..
సెలెక్టర్లు ధ్రువ్ను జట్టుకు ఎంపిక చేశారు. అయితే గత అనుభవం దృష్టిలో పెట్టుకుంటే.. కీపర్గా ధ్రువ్కన్నా మెరుగైన భరత్కే ఎక్కువ చాన్స్లు ఉన్నాయి.
దీనికి తోడు ఇంగ్లండ్తో టెస్టు సిరీస్ ప్రారంభానికి ముందు ఇంగ్లండ్ లయన్స్తో జరిగిన టూర్ మ్యాచ్లో అర్ధశతకం,
అనధికారిక టెస్టులో సెంచరీతో చెలరేగడం భరత్కు కలిసి రానుంది. తాజా ఫామ్ను దృష్టిలో పెట్టుకొని భారత్ను ఎంపిక చేస్తే..
ఈ తెలుగు ఆటగాడు ఈ సారి బ్యాట్తోనూ సత్తాచాటి జట్టులో సుస్థిర స్థానం ఏర్పాటు చేసుకోవాలని భావిస్తున్నాడు.
మరి మన వాడికీ మనం కూడా ఆల్ ది బెస్ట్ చెబుదాం!
Also Read : పిఠాపురంలో పవన్ కల్యాణ్ కు కలిసిరానున్న ఆ సెంటిమెంట్ ?
