ఈ బాధని తట్టుకునే శక్తి ఏ దేవుడు ఇస్తాడు…

జర్నలిస్ట్ ప్రభు భార్య ఆత్మహత్య ఎందుకు ? అసలు కథేంటి…

ఎవరికి రాకుడని కష్టం ఒక మామూలు మనిషికి వస్తే ఎలా ఉంటుంది?

అదే కష్టం ఒక జర్నలిస్ట్‌కి వస్తే ఎలా ఉంటుంది? అనేది ఊహకందని ఒక సమస్య.

ఒక విషయాన్ని మామూలుగా అర్థం చేసుకోమని చెప్పినా ఎవరుకూడా మంచి వైపు ఒక్క నిమిషం ఆలోచించని సమాజంలో బ్రతుకుతున్నాం.

అందుకే ప్రతి ఒక్కరికి తప్పనిసరిగా తెలియచేయాల్సిన ఈ కథనం. 2025 ఎంట్రీ అయిన రెండో రోజే జరిగిన దారుణం. పచ్చినిజం.

ఆ దారుణం జర్నలిస్ట్‌ ప్రభుకి తన పిల్లలకి జరిగింది. అనుకోని కారణాల వల్ల ఊహించని విధంగా జరిగిన నిజం ఇది. ఒక్కసారి చదవండి…

తాను ఎంతో ప్రేమగా చూసుకునే భార్య రోజూ భర్తని ఆఫీసుకి పంపినట్లే గుమ్మం వరకు వచ్చి సెండాఫ్‌ చెప్పింది.

ఓకే బై డార్లింగ్‌ ఈవెనింగ్‌ త్వరగా వస్తాను అంటూ తను పనిచేస్తున్న సుమన్‌ టీవికి వెళ్లారు ప్రభు.

తన పనులన్నీ చూసుకున్నాక కొన్ని ఈవెంట్స్‌లో పాల్గొన్నాక ఇంటికి వెళ్లబోతూ ఏమన్నా కావాలేమో అని భార్య ధుర్గా మాధవికి ఫోన్‌ చేశారు.

అటువైపునుండి ఆమె ఫోన్‌ ఎత్తలేదు. సరేలే అని ఇంటికి వెళ్లారాయన. ఈయన దగ్గర ఉన్న తాళంతో ఇంటి తలుపుతీసి లోపలికి వెళ్లారు.

మాధవి, మాధవి అంటూ అన్ని రూముల్లో వెతికారు. ఆమె కనిపించలేదు. భార్య ఫోన్‌కి ఫోన్‌ ట్రై చేస్తే ఫోన్‌కూడా బెడ్‌రూమ్‌లోనే రింగ్‌ అయ్యింది.

ఇదేంటి ఫోన్‌ ఇక్కడే రింగ్‌ అవుతుంది అనుకుంటూ ఫోన్‌ తీసుకుని ఎందుకైనా మంచిదని హైదరాబాద్‌లోనే ఉండే కూతురు స్పందనకి ఫోన్‌ చేశారు.

వెంటనే కూతురు స్పందన అమ్మ కనిపించలేదా? అని కంగారుపడి ఆమె ఉంటున్న కోకాపేటనుండి బయలుదేరింది.

ఆమె ఫోన్‌ అక్కడే ఉండటంతో కాల్‌డేటా, వాట్సప్, ఫోన్‌లోని గ్యాలరీ చెక్‌ చేశారు ప్రభు. ఆ గ్యాలరీలో ఉన్న ఫస్ట్‌ వీడియో చూసి షాకయ్యాడు ప్రభు.

అది సూసైడ్‌నోట్‌ లాంటి వీడియో….ఆ వీడియో చూసిన ప్రభుకి నోటమాట రాలేదు.

(ఆ వీడియోలో కంటెంట్‌ ఏంటంటే జమ్ముగాని వరలక్ష్మీ (మాధవి అమ్మ) జమ్ముగాని ధుర్గా ప్రసాద్‌ (మాధవి అన్న) జమ్ముగాని అనురాధ (మాధవి వదిన) మన్నెం.

ఆదినారాయణతో పాటు ఆయన తమ్ముళ్లు, చెల్లెలు (బంధువులు) మమ్మల్ని మోసం చేశారు. వారిని కఠినంగా శిక్షించాలి.

దానికి సంబంధించిన పేపర్స్‌ అన్ని మా దగ్గర ఉన్నాయి. మా వారికి మా పిల్లలకి ఆ విషయం తెలుసు.

అలాగే ఆమె వీడియోలో ఇంకా మాట్లాడుతూ ఏవండి నన్ను క్షమించండి ఈ వయస్సులో మిమ్మల్ని, పిల్లల్ని ఒంటరి చేసి వెళ్లిపోతున్నాను అంటూ ఆమె వీడియో పెట్టింది.

ఆ వీడియో చూసిన ప్రభు షాక్‌కి గురయ్యారు. మధ్యాహ్నం 12గంటల 1 నిమిషం సమయంలో చేసిన వీడియో అది.)

అంటే ప్రభు ఆఫీస్‌కి వెళ్లగానే ఆ వీడియో చేసి మాధవి తన ప్లాట్‌నుండి బయటకు వచ్చి

శ్రీనగర్‌ కాలనీ మెయిన్‌రోడ్‌ వైపు నడుచుకుంటూ వెళ్లి ఆటో ఎక్కి దుర్గంచెరువుకి వెళ్లి ఆత్మహత్య చేసుకుంది.

ప్రభు ఫోన్‌ చేయగానే కోకపేట నుండి బయలుదేరి హుటాహుటిన ఎల్లారెడ్డి గూడాకి చేరుకుంది కూతురు స్పందన.

ఈ లోగా ఆయన తన ఇంటికి దగ్గరగా ఉండే స్నేహితుడు రాంబాబుకి విషయం చెప్పారు.

దగ్గరగా ఉండటంతో రాంబాబు తన స్నేహితులతో కలిసి రాత్రి పదకొండు గంటల ప్రాంతంలో పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఇది జనవరి 2వ తారీకున జరిగిన విషాదగాధ. తెల్లవారుజాము 3గంటలవరకు అందరూ పోలీస్‌స్టేషన్లో ఉండి వివరాలు అందించి సీసీ టీవి ఫుటేజ్‌లు చెక్‌చేశారు.

ఎక్కడా ఎటువంటి సమాచారం లేకపోవటంతో ఎక్కడో సేఫ్‌గానే ఉంటుందిలే అని అందరు భావించారు.

మరుసటిరోజు ఉదయం నుండి అందరూ పాల్గొని పోలీసులతో పాటు ఆ ఏరియాలో ఉన్న సీసీ టీవి ఫుటేజ్‌లు వెతికారు.

3వ తారీకు మధ్యాహ్నం ఆమె ఇంటినుండి 12గంటల 10 నిమిషాల ప్రాంతంలో బయటకు వెళ్లినట్లు గుర్తించారు.

ప్రభు నివాసం ఉంటున్న ఇల్లు పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌ పరిధిలోకి రావటంతో అక్కడి పోలీసులు వచ్చి కేసును పరిశీలించారు.

వారు మిగతా పోలీస్‌స్టేషన్‌లకు సమాచారం ఇచ్చామని ఎటువంటి న్యూస్‌ రాలేదని చెప్పటంతో కుటుంబసభ్యులంతా ఆమెని వెతికే పనులను ముమ్మరం చేశారు.

ఎంత వెతికినా ఎంతని వెతుకుతారు, ఏమని వెతుకుతారు. ఎక్కడకి వెళ్లిందని వెతుకుతారు. ఎక్కడకి వెళ్లినా నెగిటివ్‌ రిజల్ట్‌.

మూడో తేది నుండి నాల్గవ తేది మధ్యాహ్నం వరకు పంజాగుట్ట పోలీసులు విజేంద్ర పవార్, రంగస్వామి తదితర పోలీసులతోపాటు

యస్‌.ఐ వెంకట కిషన్ మూడు రోజుల పాటు పూర్తిగా సహకరించటంతో పాటు ఇప్పటికి ఫార్మాలిటీస్ అన్నిటిని దగ్గరుండి చూసుకుంటూ

ఈ కేసు సంభందించి కీలక పాత్ర పోషిస్తున్నారు.

4వతేది మధ్యాహ్నం పంజాగుట్ట పోలీసు రంగస్వామి న్యూస్‌ చేస్తుంటే దుర్గంచెరువులో ఒక అన్‌ ఐడెంటిఫైడ్‌ బాడీ దొరికింది అని న్యూస్‌….

మీరు మిస్సింగ్‌ అని వెతుకుతున్న బాడీ ఈమెదేనేమో! ఒకసారి చెక్‌చేయండి అంటూ

పంజాగుట్ట పోలీస్‌ రంగస్వామి ఫోన్‌లో డెడ్‌బాడి ఫోటోను ప్రభు చిన్నల్లుడు రిషిక్‌ రెడ్డికి చూపించి బాడిని కన్‌ఫర్మ్‌ చేయటం జరిగింది.

అప్పటివరకు ఆమె ఎక్కడికో వెళ్లింటుందిలే, తిరిగి వచ్చేస్తుందిలే అని వెతుకుతున్న కళ్లకు కన్నీళ్లు తోడయ్యాయి.

గుండెలు పగిలేలా రోధించారు ప్రభు, తన పిల్లలు, బంధువులు.

ఒక్క శాతం కూడా ఇలా జరిగి ఉంటుందని ఊహించని వారందరూ షాక్‌కు గురయ్యారు.

నిస్సహాయత నిండిన కళ్లతో ఏమి చేయాలో అర్థంకానీ స్థితిలో నిశ్చేష్ఠులుగా మిగిలిపోయారు కుటుంబమంతా.

కారణమేదైనా కుటుంబంలో జరగరాని ఘోరం జరగిపోయింది.

ముత్తయిదువుగా తనువు చాలించటంతో కర్మకాండాలను హైందవ ధర్మప్రకారం కూతుర్లు,

భర్త ఎంతో ప్రేమాభక్తులతో పదకొండురోజుల కార్యక్రమం వరకు నిర్వర్తించారందరూ.

అయితే ఆమె చనిపోయిన 15వ రోజున జర్నలిస్ట్‌ ప్రభు ఒక ప్రెస్‌మీట్‌ పెట్టి తనకు ఈ పదిహేను రోజులుగా ఎదురైన అనుభవాలన్నింటిని మీడియాకి వివరించారు.

ఆ మీడియా కార్యక్రమంలో ప్రభు, తన చిన్న కూతురు మాట్లాడారు…

– మేము ఈ ప్రెస్‌మీట్‌ పెట్టటానికి అనేక కారణాలు అంటూ ఒక్కోక్కటిగా చెప్పుకొచ్చారు.

– ముఖ్యంగా పోలీస్‌వారి నిబందనల ప్రకారం ఆమె సూసైడ్‌నోట్‌లో పేర్కొన్నవాళ్లని తక్షణం అరెస్ట్‌ చేయాలి.

– ఇకపోతే మాకు జరిగిన ఈ అన్యాయానికి ఒకపక్క విపరీతమైన భాదలో మేముంటే

భార్య, భర్తలో ఏం గొడవలున్నాయో అందుకే ఆమె సూసైడ్‌ చేసుకుంది అనే మాటలు ఆ నోట ఈ నోట వినపడుతున్నాయి.

– ఎవ్వరికి ఏం జరిగిందో తెలుసుకునే సమయం లేకపోవటం వల్ల ఎవరి కథలు వారు అల్లుకుని మాట్లాడుతుంటే ఎంతో భాదేసి ఈ ప్రెస్‌మీట్‌ పెట్టటం జరిగింది.

–ఇకపోతే హైదరాబాద్‌ వంటి మహానగరంలో ఒక మనిషి తప్పిపోతే తనను వెతకటానికి సరైన సీసీటీవి ఫుటేజి ఇంతవరకు దొరకలేదంటే నిజంగా ఆశ్చర్యం కలుగుతుంది.

దుర్గంచెరువు లాంటి ఏరియా ఎంతో అభివృద్ది చెందిన ఏరియా.

అంత బాగా అబివృధ్ది చెందిన ప్రాంతం ఇప్పుడు ఆత్మహత్యలకు నెలవుగా మిగలడం ఎంతో బాధేస్తుంది.

– చిత్ర పరిశ్రమలో ఒక జర్నలిస్ట్‌గా ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించిన నాకు నా భార్య మిస్సయితే

రెండు రోజుల తర్వాత అన్‌ ఐడెంటిఫైడ్‌ బాడీగా దొరకటం వ్యక్తిగతంగా నన్ను ఎంతో కలిచివేసింది.

అందుకే నాకు జరిగిన ఈ అన్యాయం మరెవరికి జరగకుండా పోలీసువారు తగిన చర్యలు తీసుకుని అవసరమైన చోట్ల సీసీ టీవిలను అమరుస్తారని కోరుకుంటున్నా.

ఇది నా విన్నపం మాత్రమే.

– ఇకపోతే మా ఇంట్లో జరిగిన ఈ సంఘటన తెలియనివారు పెద్ద పండుగ రావటంతో

భోగి, సంక్రాంతి , కనుమ విశెష్‌ అంటూ ప్రతిరోజూ నాకు మెసేజ్‌లు రావటంతో తీవ్ర విసాదంలో ఉన్న మా కుటుంబం,

నేను వాటికి ఎలా స్పందించాలి అర్థం కాక పెట్టిన ప్రెస్‌మీట్‌ ఇది.

ప్రతి ఒక్కరికి విషయం తెలిస్తే మమ్మల్ని మామలుగా కాకుండా మనిషిని పోగొట్టుకున్న బాధ ఎలా ఉంటుందో ఎలా చెప్పినా అర్థంకాదు కాబట్టి పెట్టిన ప్రెస్‌మీట్‌ ఇది.

పేపర్లలో, టీవీల్లో కనిపించి సానుభూతి పొందే ఉద్ధేశ్యం మాకు కాని మా కుటంబానికి కాని అస్సలు లేదు అన్నారు ప్రభు.

ప్రెస్‌మీట్‌ పెట్టి నా భార్య మరణవార్తను ప్రస్తావించటం నేను కలలోకూడా ఊహించని సంఘటన. దయచేసి నా బాధను అర్థం చేసుకోండి అన్నారాయన.

ప్రభు చిన్న కూతురు స్పందన మాట్లాడుతూ  :

మా జీవితంలో ఇలాంటి క్షణాలుంటాయని ఎప్పుడూ అనుకోలేదు. మా అమ్మ ఎంతోమందికి అనేక రకాలుగా సేవచేసింది.

ఎంతోమంది బంధువులను చేరదీసి హైదరాబాద్‌కి తీసుకువచ్చి వారి భవిష్యత్తుకు ఉపయోగపడింది.

అలాగే కరోనా సమయంలో వందలమందికి సాయం అందించింది. మా అమ్మ డబ్బుకోసం ఇలాంటి చావు తెచ్చుకోలేదు.

ఆమె ఆత్మభిమానం కోల్పోవటంతో ఇలా తన తనువు తానే చాలించింది అంటూ విలపించటంతో అక్కడ ఉన్నవారంతా చలించిపోయారు.

మాకు తగు న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాం అని ఎంతో ఆవేదనతో పోలీస్‌వారిని వేడుకున్నారామె….

అందుకే ఇలాంటి కష్టం వచ్చినప్పుడు మామూలూ వ్యక్తులకైతే ఒకలాంటి కథ, జర్నలిస్ట్‌ కుటుంబానికైతే మరోలాంటి కథ ఎవరి స్టైల్లో వారు కథలు రాసుకుంటారు.

ఎవరికథ ఎలా రాసుకున్నా నిజంగా జరిగినది ఏంటి?

అని పూసగుచ్చినట్లు జరిగిందంతా ఎంతో ఎమోషనల్‌గా చెప్పుకున్నారు ప్రభు మరియు అతని కుటుంబసభ్యులు.

ఇది జరిగిన వాస్తవం…ఇకనుండి ఏ కథకి ఆస్కారం ఇవ్వకుండా ఏం జరిగింది అని అడిగే ప్రతి ఒక్కరికి సమాధానమే ఈ కథనం…

ఇప్పటికే ఈ విషయాన్ని కొన్ని వందలసార్లు చెప్పి ఉండటంతో చెప్పే ఓపికలేక,

చెప్పాలనే ధ్యాసలేక రాసిన ఈ కథనాన్ని చదివి తెలుసుకుంటారని ఆశిస్తూ…. అందరికి నమస్కారం… ప్రభు మరియు కుటుంబసభ్యులు…

శివ మల్లాల

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *