పాకిస్థాన్ దుస్సాహసం, రెచ్చగొట్టే ధోరణికి భారత్ భద్రతా దళాలు గట్టిగా బుద్ధి చెప్పాయి. గురువారం రాత్రి క్షిపణులు, ఆత్మాహుతి డ్రోన్లు, యుద్ధ విమానాలను సరిహద్దు రాష్ట్రాలైన జమ్మూ కశ్మీర్, రాజస్థాన్, పంజాబ్ల పైకి పాక్ ప్రయోగించింది. కేవలం 35 నిమిషాల్లో పాక్ ఆటలను భారత్ సమర్థంగా తిప్పికొప్పింది. పాక్ క్షిపణులు, డ్రోన్లతో దాడి చేయడానికి 15 లక్ష్యాలను ఎంచుకుని దాడులను ప్రారంభించింది. దీనిని ముందుగానే పసిగట్టిన భారత్ తక్షణమే అలర్ట్ అయిపోయింది.
భారత్ సైన్యం 8 డ్రోన్లను, 3 ఫైటర్ జెట్లను కూల్చేయడమే కాకుండా ఫైసలాబాద్, సర్గోదాల్లోని ఆ దేశ రక్షణ వ్యవస్థలను భారత్ ధ్వంసం చేసింది. దీనికోసం భారత్ ఇంటిగ్రేటెడ్ కౌంటర్ మానవ రహిత ఎయిర్క్రాఫ్ట్ వ్యవస్థను వినియోగించింది. దాడి సమయంలో ఆయా ప్రాంతాల్లోని ప్రజలంతా ఇళ్లలోకి వెళ్లిపోయారు. జమ్మూ సిటీ అంతటా విద్యుత్ సరఫరాను నిలిపివేయడంతో పాటు కమ్యూనికేషన్ వ్యవస్థను సైతం నిలిపివేశారు. జమ్మూ జిల్లా వ్యాప్తంగా సైరన్లు మోగించి ప్రజలకు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు హిమాచల్ప్రదేశ్లోని ధర్మశాలలో జరగాల్సిన ఐపీఎల్ మ్యాచ్ను సైతం రద్దు చేశారు. విద్యాసంస్థలకు సెలవులిచ్చారు. అలాగే ఢిల్లీలోనూ ముఖ్య ప్రాంతాల్లో తిరగడాన్ని అధికారులు నిషేధించారు.