...

Dil Raju: ‘వీరమల్లు’ను అడ్డుకునే దమ్మూధైర్యం ఎవరికీ లేదు

ఇండస్ట్రీలో థియేటర్ల సమస్యేంటి? రోజుకో బడా ప్రొడ్యూసర్ మీడియా ముందుకు రావడమేంటి? అసలు ఇండస్ట్రీలో ఏం జరుగుతోంది. ఆ నలుగురు అనే పదం చాలా కాలంగా వినిపిస్తోంది కానీ థియేటర్ల సమస్య మొదలైనప్పటి నుంచి మరింత ఎక్కువగా వినిపిస్తోంది. ఇండస్ట్రీలో ఆ నలుగురంటే.. ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, అల్లు అరవింద్, దగ్గుబాటి సురేష్ బాబు, ఏషియన్ సునీల్. ఇండస్ట్రీలో ఏం జరిగినా వీరి కనుసన్నల్లోనే జరుగుతుందనే భావన. అందుకే ఏం జరిగినా ఈ నలుగురినే అంతా వేలెత్తి చూపిస్తూ ఉంటారు. నిన్నటికి నిన్న అల్లు అరవింద్ మీడియా ముందుకు వచ్చి ఆ నలుగురిలో తాను లేనని.. కోవిడ్ సమయంలోనే బయటకు వచ్చేశానని.. తనకు కేవలం తెలంగాణలో ఒకే ఒక్క థియేటర్ ఉందని.. ఏపీలో కొన్ని ఉన్నాయని చెప్పుకొచ్చారు. థియేటర్ల బంద్‌కూ, తనకూ ఎలాంటి సంబంధమూ లేదని తేల్చి చెప్పారు.

చర్చ నడుస్తోంది కానీ కొలిక్కి రాలేదు..

ఇవాళ దిల్ రాజు వంతు. ఆయన కూడా మీడియా సమావేశం ఏర్పాటు చేసి తనకూ.. థియేటర్ల బంద్‌కూ ఎలాంటి సంబంధమూ లేదని స్పష్టం చేశారు. ఆ నలుగురంటూ మీడియా ఇష్టం వచ్చినట్టు రాస్తోందని.. వ్యక్తిగత దాడికి పాల్పడుతోందన్నారు. అసలు ప్రెస్‌మీట్ ఎందుకు పెట్టాల్సి వచ్చిందో ముందుగా చెప్పారు. ‘‘కొన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సి ఉంది కాబట్టే ఈ ప్రెస్‌మీట్. ఎగ్జిబిటర్లకు పర్సంటేజీల విషయంలో ఇబ్బందులు ఉన్నాయి. ఏప్రిల్‌లోనే తూర్పు గోదావరి జిల్లాకు చెందిన కొందరు ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు ఈ విషయాన్ని మా దృష్టికి తెచ్చారు. వారు పర్సంటేజీ విధానం ఉంటే బాగుంటుందన్నారు. ఇండస్ట్రీలో రెంట్, పర్సంటేజీ విధానం నడుస్తోంది. ఈ విషయమై చర్చ నడుస్తోంది కానీ ఒక కొలిక్కి అయితే రాలేదు. సరిగ్గా అదే సమయంలో ‘హరి హర వీరమల్లు’ రిలీజ్ డేట్ ప్రకటించడం.. ఆ తర్వాత తిరిగి అది వాయిదా పడటం జరిగింది. తర్వాత డేట్‌ను లాక్ చేయలేదు. ఈలోగా తూర్పు గోదావరి నుంచి సమస్య నైజాంకు కూడా పాకింది.

అక్కడి సమస్యను తెలంగాణకు..

నైజాంలో 370 సింగిల్‌ స్క్రీన్‌ థియేటర్లు ఉంటే, వాటిలో మావి 30 థియేటర్లు మాత్రమే. ఏషియన్ సునీల్, సురేష్ కంపెనీలో 90 ఉన్నాయి. 250 థియేటర్లను వాళ్లకు సంబంధించిన వాళ్లు మాత్రమే నడుపుతున్నారు. మే 18న ఏపీ, తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశం జరిగింది. వాళ్ల సమస్యలు, డిమాండ్లను నిర్మాతల దృష్టికి తీసుకెళ్లమని చెప్పాను. అప్పుడే కొందరు సమస్యకు పరిష్కారం దొరక్కుంటే జూన్ 1 నుంచి తియేటర్లు బంద్ చేస్తామని తెలిపారు. వెంటనే వద్దని వారిని వారించా. అసలు ఆ మీటింగ్‌లో ఏం జరిగిందో కూడా తెలుసుకోకుండానే వార్తలను ప్రచురించారు. అసలు మీటింగే జరుగలేదు కానీ జూన్ 1 నుంచి థియేటర్ల బంద్ అని ఎలా వార్తలు రాశారు? నిన్న అరవింద్ గారు.. ఇవాళ నేను ప్రెస్‌మీట్ పెట్టాం. వాస్తవానికి అంతా కలిసి మీడియాతో మాట్లాడాల్సింది కానీ ఎందుకో మాకు భయం. పవన్ కల్యాణ్ గారి ‘హరి హర వీరమల్లు’ విషయంలో తప్పుగా వెళ్లింది. ఆయన సినిమాలను ఆపే దమ్ము, ధైర్యం ఎవరికీ లేదు. జూన్, జులై నెలల్లో పెద్ద సినిమాలున్నాయి. ఈస్ట్ గోదావరిలో మొదలైన సమస్యను తెలంగాణకు ఆపాదించారు. కల్యాణ్ గారి సహకారాన్ని మరచిపోలేం. అందరం కలిసి ఉండాలనే ఆలోచన మా ఇండస్ట్రీలో ఉండదు. ఎవరి సినిమా వస్తే వాళ్లు టికెట్ ధరలు పెంచుకునేందుకు పరిగెత్తుతారు. ఈ ఎపిసోడ్‌తో ఇప్పటికైనా తెరదించుదాం’’ అని దిల్ రాజు అన్నారు.

ప్రజావాణి చీదిరాల

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.