Hyderabad camp of MLAs:
గత ఏడాది మే నెలలో కర్ణాటకలో ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. అక్కడ కాంగ్రెస్, బీజేపీ, జేడీఎస్ నడుమ త్రిముఖ పోటీ నెలకొంది. అసలే.. జేడీఎస్ వంటి పార్టీ. అందులోనూ హంగ్ వస్తుందేమోనని అంచనాలు.. దీంతో జేడీఎస్ ఎమ్మెల్యేలను క్యాంపునకు తరలించారు.
ఇటీవల జార్ఖండ్ లో రాజకీయ సంక్షోభల నెలకొంది. ఆ రాష్ట్ర సీఎంను ఈడీ అరెస్టు చేసింది. దీంతో ఆయన రాజీనామా చేశారు.
కొత్త ముఖ్యమంత్రి ప్రదవీ ప్రమాణం చేశారు. దీంతో ఈయన కూటమికి చెందిన ఎమ్మెల్యేలను క్యాంపునకు తరలించారు.
బిహార్ లో రాజకీయం మారింది. ఏకంగా ముఖ్యమంత్రే కూటమిని మార్చేశారు. ప్రతిపక్ష పార్టీతో కలిసి కొత్త కూటమి కట్టారు. దీంతో ఎందుకైనా మంచిదని అక్కడి ఓ పార్టీ ఎమ్మెల్యేలను క్యాంపునకు తరలించారు.
పై మూడు ఉదాహరణల్లోనూ ఎమ్మెల్యేలను క్యాంపులకు తరలించిన నగరం ఒక్కటే. అది హైదరాబాద్.
ఈ నేపథ్యంలో మన భాగ్యనగరం ఇతర రాష్ట్రాల ఎమ్మెల్యేల క్యాంపు రాజకీయాలకు కేంద్రంగా మారిందనే చర్చ నడుస్తోంది.
కాగా, తెలంగాణలో ఇటీవలి ఎన్నికల సందర్భంగానూ క్యాంపు రాజకీయాల అవసరం ఏర్పడుతుందని భావించారు.
అలాంటి సమయంలో బెంగళూరు తరలించాలని భావించారు. కానీ, కాంగ్రెస్ కు సంపూర్ణ ఆధిక్యం రావడంతో ఆలోచన విరమించుకున్నారు.
అయితే, ఇప్పుడు అనూహ్యంగా క్యాంప్ రాజకీయాలకు హైదరాబాద్ కేంద్రంగా మారింది.
వారు వెళ్లారు.. వీరు వచ్చారు..
జార్ఖండ్ లో జేఎంఎం కూటమి ప్రభుత్వంపై కక్షకట్టిన బీజేపీ.. ఆ కూటమికి సారథ్యం వహిస్తున్న హేమంత్ సోరెన్ ను ఈడీని అడ్డంపెట్టుకుని ఆడుకున్న సంగతి తెలిసిందే. దీంతో సోరెన్ రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆయన స్థానంలో చంపయీ సోరెన్ సీఎం అయ్యారు.
అయితే, బీజేపీ తమ కూటమిని చీల్చే ప్రమాదం ఉండడంతో జార్ఖండ్ అధికార కూటమి ఎమ్మెల్యేలను హైదరాబాద్ తరలించారు.
వారు శామీర్ పేటలోని ఓ రిసార్టులో ఉన్నారు. ఇక ఆదివారం హైదరాబాద్ నుంచి బయల్దేరి వెళ్లిపోయారు. సరిగ్గా ఇదే సమయంలోబిహార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హైదరాబాద్ రావడం విశేషం.
ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ కు 22 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కొత్తగా కొలువుదీరిన జేడీయూ-బీజేపీ సంకీర్ణ సర్కార్ 12న బలనిరూపణ చేసుకోవాల్సి ఉంది.
దీంతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు గాలం వేసే ఆలోచన చేస్తున్నట్లు సమాచారం.
దీంతో శాసన సభ్యులను ప్రత్యేక విమానంలో పట్నా నుంచి హైదరాబాద్ తీసుకొచ్చారు.నగర శివారులోని రిసార్టుకు తరలించారు. వీరు 12వ తేదీ వరకు ఇక్కడే ఉంటారు.
ఇక్కడైతేనే సేఫ్
దక్షిణాదిన తెలంగాణ, కర్ణాటకల్లో కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఉత్తరాదిన ఇటీవల రాజస్థాన్ లో అధికారం కోల్పోయింది. ఇక హిమాచల్ తప్ప మరెక్కడా పవర్ లో లేదు. బెంగాల్ లో మమతా బెనర్జీ ప్రభుత్వం ఉంది.
ఈ నేపథ్యంలో తెలంగాణలో అయితేనే కాస్త భద్రమని కాంగ్రెస్ అధినాయకత్వం భావిస్తున్నట్లుంది.దీంతోనే బిహార్, జార్ఖండ్ ఎమ్మెల్యేలను హైదరాబాద్ తరలించింది.