CM’s Descendants AP Elections :
అసెంబ్లీ ఎన్నికల బరిలో ఆరుగురు మాజీ సీఎంల వారసులు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి రాజకీయ నేతల వారసుల హవా ఎక్కువగా కనిపిస్తోంది. ఏకంగా ఆరుగురు మాజీ ముఖ్యమంత్రుల తనయులు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. మరో ఇద్దరు వారసులు లోక్ సభకు పోటీ చేస్తున్నారు.తెలుగు రాష్ట్రాల చరిత్రలో…అందులోనూ ఆంధ్రప్రదేశ్లో ఒకేసారి ఎనిమిది మంది వారసులు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడం ఇదే తొలిసారి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి అరుదైన సంఘటన ఎప్పుడూ జరగలేదు.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రులుగా నందమూరి తారకరామారావు మూడుసార్లు, నారా చంద్రబాబునాయుడు, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, వైఎస్ రాజశేఖర్ రెడ్డి రెండుసార్ల చొప్పున పని చేసిన విషయం తెలిసిందే.
కాగా, ఎన్టీ రామారావు వారసులు నందమూరి బాలక్రిష్ణ, దగ్గుబాటి పురందేశ్వరి ఈసారి ఎన్నికల బరిలో నిలుస్తున్నారు. బాలక్రిష్ణ ప్రస్తుతం హిందూపురం సిటింగ్ ఎమ్మెల్యేగా ఉండగా.. మరోసారి ఆయన అక్కడి నుంచే పోటీ చేస్తున్నారు. ఇప్పటికే ఆయన ఆ స్థానం నుంచి రెండుసార్లు గెలుపొందారు. ఇక ఏపీ బీజేపీ అధ్యక్షురాలు, కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి రాజమండ్రి పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. 2004, 2009 ఎన్నికల్లో లోక్ సభకు ఎన్నికైన పురందేశ్వరి…కేంద్ర మంత్రిగానూ పని చేశారు.కాగా, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేశ్ మరోసారి మంగళగిరి నియోజకవర్గం నుంచి అసెంబ్లీ బరిలో నిలుస్తున్నారు. 2019 ఎన్నికల్లో ఆళ్ల రామక్రిష్ణారెడ్డి చేతిలో ఓటమి పాలయినా…మరోసారి ఆయన అదే స్థానం నుంచి పోటీ చేస్తున్నారు.
పులివెందుల నుంచి జగన్, కడప ఎంపీగా షర్మిల
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి వారసులు…వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ షర్మిల..ఇద్దరూ ఈసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. 2019 ఎన్నికల్లో పులివెందుల నుంచి పోటీచేసి గెలుపొందిన జగన్మోహన్ రెడ్డి…విభజిత ఆంధ్రప్రదేశ్ కు రెండో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2014, 2019 ఎన్నికల్లో గెలిచిన జగన్… మరోసారి అక్కడి నుంచి పోటీ చేయనున్నారు.మరోవైపు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల.. కడప పార్లమెంట్ నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేసేందుకు మార్గం సుగమం చేసుకుంటున్నారు. షర్మిల తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారు. కాగా, మాజీ సీఎం కోట్ల విజయభాస్కర్ రెడ్డి తనయుడు, మాజీ కేంద్ర మంత్రి కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డి డోన్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరపున ఎన్నికల బరిలో నిలుస్తున్నారు.కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఆయన కేంద్రంలో రైల్వే శాఖ సహాయ మంత్రిగా పని చేశారు.
గతంలో ఎంపీగా పని చేసిన ఆయన ఈ సారి అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. 1992లో ఏపీ సీఎంగా పని చేసిన నేదురుమల్లి జనార్దన్ రెడ్డి తనయుడు నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి…నెల్లూరు జిల్లా ఆత్మకూరు అసెంబ్లీ నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు తనయుడు నాదెండ్ల మనోహర్…గుంటూరు జిల్లా తెనాలి నుంచి జనసేన తరపున బరిలోకి దిగుతున్నారు. నాదెండ్ల మనోహర్…2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు స్పీకర్ గానూ పని చేశారు. మరి వీరందరిలో గెలిచి నిలిచేదెవరో, పరాజితులు ఎవరు అవుతారన్నది చూడాలంటే జూన్ 4వ తేదీ దాకా వేచి చూడాల్సిందే.
Also Read This Article : పిఠాపురంలో అష్టదిగ్బంధనం చేస్తున్న వైసీపీ
