CM YS Jagan :
గెలుపుపై వైఎస్ జగన్ లో ధైర్యం సడలిందా ?
‘వై నాట్ 175’? ఇది ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొద్ది నెలల క్రితం వరకు పదే పదే చెప్పిన మాట.
వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలోని మొత్తం 175 సీట్లనూ తామే గెలుస్తామని, ప్రతిపక్షాలకు ఒక్క సీటు కూడా దక్కకుండా చేసి దేశంలోనే చరిత్ర సృష్టిస్తామని చెప్పుకొచ్చారు.
ఇది అతివిశ్వాసంగా కనిపించినా, సొంత పార్టీ నేతలు కూడా అభ్యంతరం చెప్పే ప్రయత్నం చేసినా.. ఆయన వినలేదు.
గడపగడపకూ అంటూ తన ఎమ్మెల్యేలు, మంత్రులను ప్రజలలోకి పంపిన సమయంలో ప్రజా వ్యతిరేకత స్పష్టంగా కనిపించినా జగన్ మాత్రం వైనాట్ 175 అన్న మాటను వదలలేదు.
అయితే రోజులు గడిచిన కొద్దీ జగన్ లో ఆ ధీమా సన్నగిల్లుతూ వచ్చిందన్నది ఆయన ప్రసంగాలలో, అసహనంలో, ఫ్రస్ట్రేషన్ లో ప్రస్ఫుటంగా కనిపిస్తోంది.
తీరా ఎన్నికలు రోజుల వ్యవధిలోకి వచ్చేసరికి వైనాట్ 175 ధీమా పూర్తిగా పోయింది. ఆ స్థానంలో ఓటమి భయం పట్టుకుందని అంటున్నారు.
సెంటిమెంటు, దౌర్జన్యం, విపక్షాలపై దాడులు ఇవేమీ గెలుపు దారి చూపలే కపోవడంతో ఆయన తన విశ్వాసాన్ని మార్చుకుని వాస్తును శరణుజొచ్చారని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.
తాడేపల్లిలోని తన అధికారిక నివాసం, క్యాంప్ ఆఫీసులలో వాస్తు దోష నివారణ చర్యలు చేపట్టడం, జగన్ పర్యవేక్షణలోనే ఈ పనులు జరుగుతుండడాన్ని బట్టి ఆయన ఆలోచనా ధోరణిని అంచనా వేస్తున్నారు.
కూల్చివేతలతో మొదలైన జగన్ పాలన చివరకు వాస్తు దోష నివారణ అంటూ సొంత ప్యాలెస్ లోనే కూల్చివేతల పర్వానికి తెరతీసే దాకా వచ్చిందని విమర్శిస్తున్నారు.
వాస్తు పండితుల సూచనలకు అనుగుణంగా జగన్ నివాసం క్యాంపు కార్యాలయం చుట్టూ ఉన్న ఇనుప కంచెలోని కొంత భాగం కూల్చివేత పనులు ఇప్పుడు సాగుతున్నాయి.
ఈ ఇనుప కంచెలను జగన్ అధికారంలోకి రాగానే ఒక్క పురుగు కూడా ఆ కంచెను దాటి లోనికి ప్రవేశంచే అవకాశం లేనంత పటిష్టంగా నిర్మించారు.
ఇప్పడు వాస్తుదోషమంటూ ఆ ఇనుప కంచెలోని కొంత భాగాన్ని కూల్చివేస్తున్నారు. స్వతహాగా క్రైస్తవుడైన జగన్ కు ఇటువంటి నమ్మకాలు ఉండవు.
తిరుమలలో తనకు వేంకటేశ్వర స్వామిపై విశ్వాసం ఉందన్న డిక్లరేషన్ పై సంతకం పెట్టడానికే నిరాకరించిన జగన్.. ఇప్పుడు వాస్తు పేరుతో తన ప్యాలెస్ లోనే మార్పులు చేయడానికి వెనుకాడలేదు.
మొత్తం మీద ఓటమి భయం జగన్ ను ఎంతగా వెంటాడుతోందో ప్యాలెస్ లో వాస్తుదోష నివారణ పేరుతో చేపట్టిన కూల్చివేతలే చెబుతున్నాయని పరిశీలకులు అంటున్నారు.
ఈ దోష నివారణతో మరోసారి అధికారం దక్కుతుందా? అంటే జూన్ 4వ తేదీదాకా వేచి చూడాల్సిందే.
కానీ, ఎన్నికల సరళికి సంబంధించి పలు సంస్థలు నిర్వహిస్తున్న సర్వే నివేదికలు మాత్రం జగన్ కు వ్యతిరేకంగానే వస్తున్నాయి.
వైసీపీ అధికారం కోల్పోవడం ఖాయమని, టీడీపీ కూటమిదే అధికారమని అవి పేర్కొంటున్నాయి.
Also Read This Article : ముద్రగడ అలా.. కూతురు ఇలా
