మదర్స్ డే కానుకగా నివేదా థామస్ నటించిన హిట్ సినిమా ఓటీటీలో విడుదల కానుంది. అమ్మ ప్రేమను ఆవిష్కరించే చిత్రంగా ‘35-చిన్న కథ కాదు’ రూపొందింది. నంద కిశోర్ ఇమాని దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో ప్రియదర్శి, నివేదా థామస్, విశ్వదేవ్, గౌతమి, భాగ్యరాజ్ ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా ఇవాళ (మే 10) ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. అయితే రెండు రోజుల పాటు ఈ సినిమాను ఉచితంగా చూసే అవకాశాన్ని ఆహా సంస్థ కల్పించింది. అంటే మే 10, 11 తేదీల్లో ఈ సినిమాను ఉచితంగా చూడవచ్చు. తొలిసారిగా ఈ చిత్రంలో నివేదా తల్లి పాత్రలో కనిపించి మెప్పించింది.
సినిమా కథేంటంటే.. బస్ కండక్టర్ అయిన తిరుపతికి చెందిన ప్రసాద్ (విశ్వదేవ్ రాచకొండ).. భార్య సరస్వతి (నివేదా), పిల్లలు అరుణ్, వరుణ్లతో కలిసి వేంకటేశ్వర స్వామి ఆలయానికి నివాసముంటాడు. పిల్లలను బాగా చదివించి ప్రయోజకులను చేయాలని తాపత్రయ పడుతూ ఉంటుంది. చిన్నోడు చదువులో పర్వాలేదు కానీ పెద్దోడికి లెక్కలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అరుణ్కి సున్నాకి విలువలేనప్పుడు దాని పక్కన ఒకటి వచ్చి నిలబడితే మాత్రం విలువ ఎలా పెరుగుతుందంటూ ప్రశ్నలు వేస్తుంటాడు. అలాంటి అరుణ్ని స్కూలు నుంచి డిమోట్ చేస్తారు. ఆ తరువాత కథ ఎలాంటి మలుపు తీసుకుంది? సరస్వతి కుమారుడిని లైన్లో పెట్టిందా? అనే ఆసక్తికర అంశాలతో రూపొందింది.