మంచు కుటుంబ కథా చిత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది. డిసెంబర్లో ప్రారంభమైన ఈ గొడవ రావణకాష్టంలా రగులుతూనే ఉంది. అంతా సైలెంట్ అనుకునేంత సేపు పట్టడం లేదు రచ్చ లేవడానికి. మంగళవారం మంచు మనోజ్ తన కారు పోయిందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనికి సంబంధించిన తన సోదరుడు విష్ణుపైనే ఆరోపణలు చేస్తున్నాడు. ఇక నేడు (బుధవారం) జల్పల్లి నివాసం వద్దకు వెళ్లిన మనోజ్ గేటు బయట బైటాయించి నిరసనకు దిగాడు.
మనోజ్ కోసం అతని భార్య మౌనిక సైతం అక్కడకు వచ్చినట్టు తెలుస్తోంది. అనంతరం మనోజ్ మీడియా ఎదుట ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తమది ఆస్తి గొడవ కాదని.. తన జుట్టు విష్ణు చేతుల్లో పెట్టేందుకు ఇదంతా చేస్తున్నారని ఆరోపించారు. అసలు తనకు ఆస్తి వద్దని తన తండ్రికి ఎప్పుడో చెప్పానని.. విద్యార్థుల భవిష్యత్ కోసం తాను ఇదంతా చేస్తున్నానని తెలిపాడు. రౌడీలు తనను కత్తులు, గన్లతో కొట్టడానికి వచ్చారని.. దానికి సంబంధించిన సాక్ష్యాలను సైతం పోలీసులకు అప్పగించినట్టు మనోజ్ వెల్లడించాడు.
తన పెట్స్తో పాటు కొన్ని వస్తువులు ఉన్నాయని వాటికోసమే తాను వచ్చినట్టు మనోజ్ తెలిపాడు. తన పాప పుట్టిన రోజు కోసం తను వేరకొ ప్రాంతానికి వెళ్లిన తర్వాత ఇక తను రానని డిసైడ్ అయిపోయి విష్ణు ప్లాన్ చేసి తెల్లవారుజామున అనుచరులను పంపి తన కార్లను తీసుకెళ్లినట్టు తెలిపాడు. తను తప్పు చేశానని కానీ.. ఆస్తి అడిగానని కానీ ఒక్క సాక్ష్యాధారం బయటపెట్టినా వాళ్లందరి కాళ్లపై పడి క్షమాపణ కోరుతానని మనోజ్ తెలిపాడు. విష్ణుని నిలబెట్టడం కోసం గొడ్డు చాకిరి చేశానని.. చివరకు లేడీ గెటప్ కూడా వేసినట్టు వెల్లడించాడు.
‘కన్నప్ప’కు పోటీగా ‘భైరవం’ విడుదల చేద్దామనుకున్నామని.. కానీ కంగారుపడి ఆ సినిమాను వాయిదా వేసుకున్నాడని మనోజ్ తెలిపాడు. ఆ కోపాన్ని ఎలా తీర్చుకోవాలో తెలియకే విష్ణు ఇదంతా చేస్తున్నాడని మనోజ్ తెలిపాడు. అయితే మనోజ్ మాటల్లో నిజమెంత అనేది ఎవరికీ తెలియకుండా ఉంది. నిజంగానే ‘భైరవం’ వస్తుందనే తన డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ను విష్ణు వాయిదా వేసుకున్నాడా? అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
ప్రజావాణి చీదిరాల
Also Read This : మార్క్ శంకర్ను చూసేందుకు సింగపూర్కు చిరు దంపతులు