నన్ను వైఎస్ షర్మిలను ‘‘లేపేస్తాం’’ అని బెదిరింపులు
YS Sunitha Complaint: దివంగత మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యపై అలుపెరుగని పోరాటం చేస్తున్న
ఆయన కుమార్తె వైఎస్ సునీతారెడ్డి తొలిసారిగా ప్రాణభయానికి లోనవుతున్నారు. తన తండ్రిని చంపిన వారిని కఠినంగా
శిక్షించాలంటూ హైకోర్టు, సుప్రీం కోర్టుల చుట్టూ తిరుగుతూ ఎన్నో బెదిరింపులు వచ్చినా వెనక్కి తగ్గని సునీత..
ఇప్పుడు తనకు ప్రాణహాని ఉందంటూ ఆందోళనకు గురవుతున్నారు. ఇటీవల తాను తన సోదరి వైఎస్ షర్మిలను
ఇడుపులపాయలో కలిసినప్పటి నుంచి తమ ఇద్దరినీ టార్గెట్ చేసుకొని ‘‘చంపేస్తామంటూ’’ సోషల్ మీడియాలో పోస్టులు
పెడుతున్నారని సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు సునీత ఫిర్యాదు చేశారు. ఫేస్బుక్లో అసభ్యకరమైన పోస్టులతో
పాటు తనను, వైఎస్ షర్మిలను ‘‘లేపేస్తాం’’ అనే విధంగా బెదిరిస్తూ పోస్టులు పెడుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
వైఎస్ వివేకానందరెడ్డి 2019 ఎన్నికల ముందు దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ కేసును సీబీఐ
విచారిస్తోంది. దర్యాప్తులో భాగంగా పలువురిని సీబీఐ అరెస్టు చేసింది. వీరిలో వివేకా కుటుంబసభ్యులైన కడప ఎంపీ వైఎస్
అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కరరెడ్డి తదితరులు ఉన్నారు. వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ పై ఉన్నారు.
తండ్రి హత్య కేసు విషయంలోనే తన సోదరుడు జగన్ తో సునీతకు విభేదాలు వచ్చాయి. అనంతర క్రమంలో జగన్
సొంత సోదరి షర్మిల రాజకీయ ప్రవేశం, ఏపీసీసీ అధ్యక్ఱురాలు కావడం చోటుచేసుకున్నాయి. సునీత వెళ్లి షర్మిలను
కలవడం, వచ్చే ఎన్నికల్లో సునీత, షర్మిల ఇద్దరూ కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తారన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో
సోషల్ మీడియాలో వారిని వైసీపీ శ్రేణులు టార్గెట్ చేశాయి. ఈ క్రమంలోనే తమపై ఫేస్ బుక్ లో అసభ్యకరమైన పోస్టులు
పెడుతున్నారని సునీత తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

సునీత ఫిర్యాదు :YS Sunitha Complaint
సునీత పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ఇలా ఉంది.. ” నా కుటుంబ సభ్యులు రాజకీయాల్లో ఉన్నప్పటికీ నేను నా వ్యక్తిగత
జీవితాన్ని గడుపుతున్నాను. గత కొన్ని రోజులుగా వర్రా రవీంద్రారెడ్డి అనే వ్యక్తి తన ఫేస్ బుక్ పేజీలో నా పైన, నా సోదరి
షర్మిలపైన అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నాడు. తీవ్ర అభ్యంతరకరమైన, అసహ్యకరమైన రీతిలో పోస్టులు ఉంటున్నాయి.
వర్రా రవీంద్రారెడ్డి ఫేస్ బుక్ పేజీలో మొత్తం షర్మిల, నాపై అనేక అవమానకరమైన పోస్టులు ఉన్నాయి. వర్రా రవీంద్ర రెడ్డి
పరిధి దాటి పోస్టులు పెడుతున్నాడు. అతడు పెట్టే పోస్టులు మా ప్రతిష్టను దిగజార్చేలా ఉన్నాయి’ అని సునీత తన ఫిర్యాదులో
పేర్కొన్నారు.
మా ముగ్గురికి ప్రాణహాని :
‘జనవరి 29న నా సోదరి షర్మిలతో పాటు నేను ఇడుపులపాయ వెళ్లాను. అనంతరం వర్రా రవీంద్రా రెడ్డి తన పేజీలో నన్ను
చంపేయాలి అని అర్థం వచ్చేట్టు ఒక పోస్ట్ పెట్టాడు. ”అందుకే పెద్దలు అన్నారు.. శత్రు శేషం ఉండకూడదు.
లేపేయ్ అన్నాయ్ ఇద్దరినీ.. ఈ ఎన్నికలకు పనికి వస్తారు” అని ఫేస్ బుక్ లో పోస్ట్ పెట్టాడని సునీత తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
తన స్నేహితులు వర్రా రవీంద్రరెడ్డికి చెందిన ఫేస్ బుక్ లింక్ పంపారని తెలిపారు. అతడి ఫేస్బుక్ పోస్టులు తనను భయాందోళనకు
గురిచేస్తున్నాయన్నారు. తన తండ్రి వివేకానంద రెడ్డి హత్య జరిగినప్పటి నుంచి పోరాటం చేస్తున్నానని, తనకు ప్రాణహాని
ఉందని పోలీసులకు, సీబీఐకి కూడా ఇప్పటికే ఫిర్యాదు చేశానని సునీత గుర్తు చేశారు.
ఫేస్ బుక్ పేజీలో మొత్తం తనను, షర్మిలను, వైఎస్ విజయమ్మను కించపరుస్తూ పోస్టులు ఉన్నాయని, చంపేస్తామంటూ
బెదిరింపులకు గురిచేసేలా పోస్టులు పెడుతున్న రవీంద్రారెడ్డితోపాటు తదితరులపైన తగిన చర్యలు తీసుకోవాలని సునీత
తన ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా వైఎస్ సునీత సైబర్ క్రై మ్లో ఫిర్యాదు చేసిన విషయాన్ని సైబర్ క్రై మ్ డీసీపీ శిల్పవల్లి ధ్రువీకరించారు.