అంతర్జాతీయ స్థాయిలో భారత్ను గ్లోబల్ ఎంటర్టైన్మెంట్ హబ్గా మార్చాలనే లక్ష్యంతో వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్ (WAVES)ను ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇవాళ (గురువారం) ముంబైలో ఈ వేవ్స్ సమ్మిట్ జరిగింది. దీనిలో పలు ఇండస్ట్రీలకు చెందిన దిగ్గజ నటులు పాల్గొన్నారు. టాలీవుడ్ నుంచి మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) ఈ వేవ్స్ సమ్మిట్లో పాల్గొన్నారు. ఇవాళ ముంబైలో జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో ఈ సమ్మిట్ జరిగింది. ఈ కార్యక్రమంలో చిరంజీవి మాట్లాడుతూ.. ‘‘బాల్యంలో ఎక్కువగా డ్యాన్సులు చేసి ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ను ఎంటర్టైన్ చేస్తుండేవాడిని. అలా నటనపై నాకు ఆసక్తి మొదలవడంతో మద్రాసుకి వెళ్లి ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యాను. అప్పటికే ఎన్టీఆర్ (NTR) గారు, ఏఎన్నార్ (ANR) గారు, కృష్ణ గారు, శోభన్ బాబు గారు ఇలా ఎంతో మంది స్టార్ హీరోలు ఇండస్ట్రీని ఏలుతున్నారు.
అలాంటి వారి మధ్య నాకు అవకాశం దొరుకుతుందా? దొరకాలంటే ఏం చేయాలి? మొత్తానికి అందరి కంటే భిన్నంగా ఏదో ఒకటి చేయాలని ఆలోచించి ఫైట్స్, డ్యాన్స్ విషయంలో మరింత శిక్షణ తీసుకున్నాను. అవే ఇప్పుడు నన్నీ స్థాయిలో నిలబెట్టాయి. ఒక్కొక్క స్టార్ నుంచి ఒక్కో విషయం నేర్చుకున్నా. అమితాబ్ (Amitab) నుంచి స్టంట్స్, మిథున్ చక్రవర్తి నుంచి మేకప్ లేకుండా సహజంగా నటించడం.. కమల్ హాసన్ (Kamal Haasan) నుంచి డ్యాన్స్ వంటి విషయాలను నేర్చుకున్నా. అలా ఆ సమయంలో అందరినీ చూస్తూ, పరిశీలిస్తూ నన్ను నేను చెక్కుకుంటూ ఈ స్థాయికి వచ్చాను’ అని అన్నారు. ఈ ఈవెంట్లో చిరంజీవితో పాటు అక్షయ్ కుమార్, రజినీకాంత్ (Rajinikanth), మోహన్లాల్ (Mohanlal) వంటి వారు పాల్గొన్నారు. ప్రధాని మోదీ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ప్రజావాణి చీదిరాల