సీనియర్ నిర్మాత, ఏఏ ఆర్ట్స్ అధినేత మహేంద్ర (79) ఇక లేరు. కొంతకాలంగా ఆయన గుండె సంబంధమైన సమస్యలతో బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే ఆయన గుంటూరులోని రమేష్ హాస్పిటల్స్లో చికిత్స పొందుతూ గత రాత్రి (జూన్ 11) 9.30 గంటలకు తుది శ్వాస విడిచారు. వీరికి భార్య, కుమార్తె ఉన్నారు ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ గా పని చేసిన మహేంద్ర… ఏఏ ఆర్ట్స్ – గీతా ఆర్ట్ పిక్చర్స్ పతాకాలపై 36 చిత్రాలు నిర్మించారు. ‘పోలీస్’ చిత్రంతో శ్రీహరిని హీరో చేసిందీ.. హీరోయిన్ కాజల్ అగర్వాల్ను ‘లక్ష్మీ కల్యాణం’తో ఇండస్ట్రీకి పరిచయం చేసింది ఈయనే.
‘ప్రేమించి పెళ్లి చేసుకో’ చిత్రంతో నిర్మాతగా మారిన మహేంద్ర ‘పోలీస్, దేవా, కూలీ, ఒక్కడే, అమ్మ లేని పుట్టిల్లు, లక్ష్మీ కల్యాణం’ తదితర చిత్రాలు నిర్మించారు. కన్మణి దర్శకత్వంలో రాజశేఖర్ నటించిన ‘అర్జునా’ ఆయన చివరి చిత్రం. ఈ చిత్రం విడుదలవ్వకపోవడం ఆయనను ఆర్ధికంగా, ఆరోగ్యపరంగా కుంగదీసింది. విలువలతో కూడిన సీనియర్ నిర్మాతల్లో ఒకరైన మహేంద్ర మరణం పట్ల పలువురు చిత్ర ప్రముఖులు తీవ్ర సంతాపం తెలిపారు. మహేంద్ర స్వస్థలం గుంటూరులోనే ఆయన అంత్యక్రియలు నేడు జరుగనున్నాయి.