AP Elections:
ఏపీ అసెంబ్లీ ఎన్నికలు (AP Assembly Elections) అత్యంత హోరాహోరీగా సాగడం ఖాయం. ఓవైపు సంక్షేమాన్నే నమ్ముకున్న సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (Ys Jagan Mohan Reddy).. మరోవైపు ఆయన పాలనా విధానాలనను తీవ్రంగా వ్యతిరేకిస్తూ టీడీపీ, జనసేన అధినేతలు చంద్రాబు (Chandra Babu), పవన్ కల్యాణ్ (Pawan Kalyan). ఇప్పటికే టీడీపీ-జనసేన కూటమి కట్టాయి. 99 మంది అభ్యర్థులను ప్రకటించాయి. ఇక బీజేపీ కలిసొచ్చే సంగతి పక్కనపెట్టండి. అధికార వైసీపీ ( YCP) వరుసగా కన్వీనర్ల జాబితాలు విడుదల చేస్తోంది. మరొక్క 10 రోజుల్లో షెడ్యూల్ రావడమే తరువాయి సమర భేరి మోగడం ఖాయం.
అమరావతి కలిపింది..
టీడీపీ తిరువూరు అభ్యర్థిగా అమరావతి ఉద్యమకారుడు కొలికపూడి శ్రీనివాస్ ను ప్రకటించారు. తెలంగాణలోని ఖమ్మం జిల్లాకు అత్యంత సమీపంలో ఉండే ఈ నియోజకవర్గం గతంలో టీడీపీ పలుసార్లు గెలిచింది. 2004 నుంచి ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ అక్కడ పార్టీ ఇప్పటికీ అత్యంత బలంగా ఉంది. గతంలో నల్లగట్ల స్వామిదాసు టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా 1994, 1999లో గెలిచారు. 2014 నుంచి రక్షణనిధి (వైసీపీ) ఎమ్మెల్యే. మరోవైపు వచ్చే ఎన్నికల్లో వైసీసీని ఢీకొట్టనున్న కొలికపూడి గతంలో టీడీపీ, ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడును తీవ్రంగా వ్యతిరేకించారు. అయితే, అమరావతి రాజధాని ఉద్యమ నేపథ్యంతో కొలికపూడి టీడీపీకి దగ్గరయ్యారు. తలకు ఆకుపచ్చ వస్త్రంతో టీవీ డిబేట్లలో వాగ్ధాటి చూపిన కొలికపూడి ఇప్పుడు టీడీపీ తొల జాబితాలోనే టికెట్ దక్కిన 94 మందిలో ఒకరు కావడం గమనార్హం.
మహా సేన.. నాడు మహా దూరం
గత ఎన్నికల సమయంలో వైసీపీ సానుభూతిపరుడిగా ఉన్నారు మహా సేన రాజేష్. సహజంగానే టీడీపీని వ్యతిరేకించారు. వైసీపీకి ప్రచారం కూడా చేశారు. ఎన్నికల తర్వాత రాజేష్ జన సేన విధానాలకు దగ్గరయ్యారు. ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ను అభిమానించారు. అంబేడ్కర్, వంగవీటి రంగా ఫొటోలతో బీసీ, దళిత వర్గాల వాయిస్ ను వినిపిస్తూ.. వచ్చిన మహా సేన రాజేష్ అనూహ్యంగా టీడీపీలో చేరారు. ఇటీవలి జాబితాలో పి.గన్నవరం టికెట్ దక్కించుకున్నారు.
పాణ్యంలో ఎవరిదో పుణ్యం
టీడీపీ పాణ్యం అభ్యర్థిగా ప్రకటించిన గౌరు చరితారెడ్డి కూడా ఒకప్పుడు తీవ్రమైన టీడీపీ వ్యతిరేకి. ఈమె భర్త గౌరు వెంకటరెడ్డి ఉమ్మడి ఏపీలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఓ కేసులో జైలుపాలయ్యారు. 2002లో ఉమ్మడి ఏపీలో ప్రతిపక్ష నేతగా ఉన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి.. జైలుకు వెళ్లి మరీ వెంకటరెడ్డిని పరామర్శించారు. ఆ తర్వాత 2004 ఎన్నికల్లో గౌరు చరితకు నందికొట్కూరు టికెట్ ఇవ్వడం ఆమె ఎమ్మెల్యే కావడం జరిగిపోయింది. అయితే, జగన్ వైసీపీని స్థాపించిన తొలినాళ్లలోనూ చరిత, ఆమె భర్త ఆ పార్టీలోనే ఉన్నారు. 2019 సమయానికి ఆ పార్టీతో విభేదించి టీడీపీలో చేరారు.
రంగా అనుచరుడు.. బాబుకు ప్రియి శిష్యుడు..
విజయవాడ కేంద్రంగా ఉమ్మడి ఏపీ రాజకీయాలను తీవ్రంగా ప్రభావితం చేసిన వ్యక్తి వంగవీటి రంగా. ఆయన చనిపోయేముందు వరకు అత్యంత సన్నిహితంగా మెలిగారు విజయవాడ సెంట్రల్ మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా. రంగా ఉద్యమాల్లో ఓ యువకుడిగా బోండా ఉమా కీలక పాత్ర పోషించారు. రంగా చేసిన నిరాహార దీక్షల ఫోటోల్లోనూ ఈయన ఉంటారు. ఇక రంగా మరణం అనంతరం పరిస్థితులు మారిపోవడంతో.. బోండా ఉమా టీడీపీలోకి వచ్చారు. గత ఎన్నికల్లో అత్యంత తక్కువ ఓట్లతో ఓడిపోయిన ఆయన.. వచ్చే ఎన్నికలకు మళ్లీ టికెట్ పొందారు. కాగా, ఇలాంటి ఒకనాటి టీడీపీ విరోధులు ఇంకా పలువురు వచ్చే ఎన్నికలకు టికెట్ పొందడం గమనార్హం. అయితే, రాజకీయంగా ఒక పార్టీని విభేదించడం సహజం. కానీ, పైన చెప్పుకొన్న వారంతా తీవ్రంగా టీడీపీని తూర్పూరపట్టినవారు. కాలం మారడంతో అదే పార్టీలోకి వచ్చారు.
ALSO READ:AP POLITICS NEWS:వంగవీటి వారసుడికి సీటు లేద