ప్రముఖ నటి సమంత ‘ట్రా లా లా’ పేరిట మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ను స్థాపించి నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆమె ‘శుభం’ అనే చిత్రాన్ని నిర్మించారు. దీనికి ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహించారు. ఈ సినిమా మే 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే తాజాగా విశాఖపట్నంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సమంత మాట్లాడుతూ .. ‘‘నిర్మాతగా నేను ఓ కొత్త ఆలోచనతో ఈ ‘శుభం’ సినిమాను స్టార్ట్ చేశాను. అలాగే కొత్త వారితో.. కొత్త కథల్ని చేసి అందరినీ అలరించాలనే లక్ష్యంతో ట్రా లా లా ప్రొడక్షన్ బ్యానర్ను స్టార్ట్ చేశాను’’ అని తెలిపారు. దర్శకుడు ప్రవీణ్ కండ్రేగుల మాట్లాడుతూ .. ‘‘ఇంత వరకు తెలుగులో ఇలాంటి కంటెంట్ రాలేదు. ఇలాంటి కంటెంట్ రావడం చాలా అరుదు. సమంత వంటి వారు లేకుంటే ఈ సినిమా ఇక్కడి వరకూ వచ్చేది కాదు. ఈ చిత్రాన్ని మార్నింగ్ షో చూసే వారు చాలా లక్కీ. శనివారం సినిమా గురించి ప్రతి ఒక్కరూ మాట్లాడుకుంటారు’’ అని ప్రవీణ్ తెలిపారు.