TG Politics :
భట్టి, రేవంత్ కు భిన్నంగా
అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువగా ఉండే కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడది శ్రుతి మించుతోందా?
ఒక్కో అంశంలో వ్యక్తిగత అభిప్రాయాలను వెల్లడించే స్థాయి నుంచి రాజకీయంగా నేతలు ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు మాట్లాడుతుండడం ఈ అభిప్రాయాన్నే కలిగిస్తోంది.
తెలంగాణలో కాంగ్రెస్ కొత్తగా అధికారంలోకి వచ్చినందున ప్రారంభంలో నేతలందరూ ఏకతాటిపై ఉన్నట్లు కనిపించారు. ప్రతిపక్ష బీఆర్ఎస్ ను ఎదుర్కొనడమే లక్ష్యంగా పని చేశారు.
ఇప్పుడు బీఆర్ఎస్ పూర్తిగా బలహీనపడినట్లు కనిపిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ లో స్వీయ కలహాలు మొదలయ్యాయి.
ప్రత్యేకించి ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మధ్య అంతరం పెరిగినట్లు కనిపిస్తోంది.
ప్రారంభంలో తాను ఎక్కడికి వెళ్లినా భట్టి విక్రమార్కను వెంటబెట్టుకొని వెళ్లినా రేవంత్ రెడ్డి.. ఇప్పుడు అన్నిచోట్లకూ ఒంటరిగానే వెళుతున్నారు.
అంతేకాదు.. భట్టి కూడా రేవంత్ కు భిన్నంగా వ్యవహరిస్తున్నారు.
వీరిద్దరే కాకుండా.. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఒక్కో నేత ఒక్కో విధంగా ప్రవర్తిస్తుండడం, ఒకే అంశం మీద ఒక్కొక్కరూ ఒక్కో వైఖరి ప్రదర్శిస్తుండడం పార్టీ వర్గాలలో గందరగోళానికి దారి తీస్తున్నది.
అసలు ఇది అధిష్టానం పన్నిన వ్యూహమా ? లేక నాయకుల అవగాహనా లోపమా ? అని పార్టీలో అంతర్గతంగా తీవ్ర చర్చలు నడుస్తున్నాయి.
రెండు రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయం కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేరళ పర్యటనకు వెళ్లాడు.
ఈ సంధర్భంగా అక్కడ ప్రచారంలో మాట్లాడుతూ.. కేరళ సీపీఎం ముఖ్యమంత్రి పినరయి విజయన్ కమ్యూనిస్ట్ రూపంలో కనిపించే కమ్యునలిస్ట్ అని, తెర వెనక ఆయనకు బీజేపీతో సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు.
రేవంత్ చేసిన ఈ వ్యాఖ్యలు సహజంగానే సీపీఎం పార్టీకి కోపం తెప్పించాయి.
సీపీఎం పార్టీకి భట్టి విక్రమార్క మద్దతు…
ఈ నెల 19న మల్లు భట్టి విక్రమార్క హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్ లో ఉన్న సీపీఎం పార్టీకి స్వయంగా వెళ్లి ఆ పార్టీ రాష్ట్ర నాయకులులను కలిసి ఎన్నికలలో మద్దతు అభ్యర్థించడం చర్చకు దారి తీసింది.
ఈ సంధర్భంగా కేరళలో రేవంత్ వ్యాఖ్యలను సీపీఎం నేతలు భట్టి విక్రమార్క వద్ద ప్రస్తావించినట్లు తెలిసింది.
కేరళలో బీజేపీ వందలాది మంది కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలను హత్యలు చేస్తుందని, అక్కడ బీజేపీని నిలువరించేందుకు శాయశక్తులా సీపీఎం పనిచేస్తుంది.
అలాంటిది అక్కడికి వెళ్లి రేవంత్ అలా మాట్లాడడం సరైనది కాదని వారు అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు సమాచారం. వాస్తవానికి సీపీఎం, సీపీఐ, కాంగ్రెస్ పార్టీలు ఇండియా కూటమిలో భాగస్వాములుగా ఉన్నాయి.
అలాంటి పరిస్థితులలో ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న రేవంత్ ఇలాంటి వ్యాఖ్యలు చేయగా, ఉప ముఖ్యమంత్రి మాత్రం ఎన్నికలలో మద్దతు కోరుతూ తమ కార్యాలయానికి రావడం పట్ల సీపీఎం కార్యకర్తలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం అధికారంలో ఉన్న నేపథ్యంలో ప్రతి విషయం ప్రజల్లోకి వెళ్లే ముందు నాయకులు అంతా ఒకే మాట మీద ఉంటే బాగుంటుందని, లేకుంటే కార్యకర్తలతో పాటు ప్రజలు కూడా గందరగోళానికి గురవుతారన్న వాదన వినిపిస్తున్నది.
Also Read This Article : మహువా మొయిత్రా ఎనర్జీకి సీక్రెట్.. సెక్స్?