Telangana :
బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ యూటర్న్?
తెలంగాణ లోక్ సభ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ రాజకీయాలు మరింత ఉత్కంఠగా మారుతున్నాయి.
అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్ లో ప్రభావం చూపలేకపోయిన కాంగ్రెస్ పార్టీ.. బీఆర్ఎస్ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలను తమ పార్టీలో చేర్చుకోవడం ద్వారా నగరంపై పట్టు బిగించాలని చూస్తోంది.
కానీ, పరిస్థితులు కాంగ్రెస్ కు అంతగా అనుకూలించడంలేదని తెలుస్తోంది.
బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి నేతలు పెద్దసంఖ్యలోనే చేరుతున్నా.. ఎమ్మెల్యేలు మాత్రం పార్టీ మారేందుకు అంత సుముఖంగా లేనట్లు సమాచారం.
తాము గేట్లు ఎత్తితే బీఆర్ఎస్ లో ఎవరూ ఉండరంటూ సీఎం రేవంత్ రెడ్డి పదే పదే చెబుతున్నా.. ఆచరణలో మాత్రం అది సాధ్యమవుతున్న దాఖలాలు కనిపించడం లేదు.
గ్రేటర్ పరిధిలో మొత్తం 24 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. బీఆర్ఎస్ 16 స్థానాల్లో, ఎంఐఎం 7 చోట్ల, బీజేపీ ఒక చోట గెలిచిన విషయం తెలిసిందే.
కాంగ్రెస్ కు నగరంలో ఒక్క స్థానం కూడా రాకపోవడంతో ఎలాగైనా తమ ప్రాతినిధ్యం ఉండేలా చూసుకోవాలని భావిస్తోంది.
అందుకు అనుగుణంగానే.. బీఆర్ఎస్ తరఫున గెలిచిన 16 మంది ఎమ్మెల్యేల్లో అత్యధికులు కాంగ్రెస్ లో చేరతారన్న ప్రచారం మొదటినుంచీ జరుగుతోంది.
కానీ, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఒక్కరే కాంగ్రెస్ కండువా కప్పుకొన్నారు.
ఆయన కాంగ్రెస్ తరఫున సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేయనున్నారు. ఆయన తప్ప.. గ్రేటర్ లో మరెవరూ జెండా మార్చేందుకు ముందుకు రావడంలేదు.
తాజాగా రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్.. సీఎం రేవంత్ రెడ్డిని కలిసి చర్చలు జరపడంతో ఆయన కాంగ్రెస్ లో చేరతారన్న ప్రచారం జరిగింది.
కానీ, ఇప్పుడు ఆయన కూడా యూ టర్న్ తీసుకున్నట్లు చెబుతున్నారు.
ముగ్గురిపై అనర్హత వేటు
సీఎం రేవంత్ తో సమావేశం తరువాత ప్రకాశ్ గౌడ్ తన నియోజక వర్గంలోని ముఖ్య కార్యకర్తలతో సమావేశ మయ్యారు.
ఈ సమావేశంలో.. పార్టీ మారితే ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందని ఆయనకు కొంత మంది చెప్పినట్లు తెలుస్తోంది.
దీంతో తాను కాంగ్రెస్ లోకి చేరడంలేదని, బీఆర్ఎస్ లోనే కొనసాగుతానని వారితో చెప్పినట్లు సమాచారం. ఈ పరిణామం ఒకరకంగా రేవంత్ రెడ్డిని షాక్ కు గురిచేసేదేనని అంటున్నారు.
ఇప్పటికి దానం నాగేందర్ తోపాటు, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాత్రమే కాంగ్రెస్ లో చేరారు.
అయితే వీరిపై న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ కోర్టుకు వెళ్లింది. ఈ ముగ్గురిపై అనర్హత వేటు ఖాయమని అంటోంది.
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ లో చేరే ఎమ్మెల్యేలు అనర్హతకు గురి కాకుండా ఉండాలంటే.. బీఆర్ఎస్ నుంచి మూడింట రెండొంతుల మంది ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకోవాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు.
కానీ, బీఆర్ఎస్ కు ప్రధానంగా గ్రేటర్ పరిధిలోనే ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉండడం, వారంతా కాంగ్రెస్ పట్ల విముఖత చూపుతుండడంతో రేవంత్ అండ్ కో సందిగ్ధంలో పడినట్లు తెలుస్తోంది.
Also Read This Article : వివాదంలో మాధవీలత