Tamilisai Soundararajan :
పార్లమెంటు ఎన్నికల బరిలో తమిళిసై
తమిళిసై సౌందరరాజన్. ఈ పేరు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశంలోనూ చాలా మందికి సుపరిచితమైన పేరు. తెలంగాణ గవర్నర్గా ఐదేళ్లపాటు పని చేసిన తమిళిసై.. రాష్ట్ర ప్రభుత్వంతో వివాదాలతో పలుమార్లు వార్తల్లో నిలిచారు. ప్రత్యేకించి నాటి సీఎం కేసీఆర్ తో ఏనాడూ పొసగక.. పదే పదే వివాదాలు తలెత్తేవి. రాష్ట్రంలో ప్రభుత్వం మారి.. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఈ పరిస్థితిలో మార్పు వచ్చిందనుకుంటున్న సమయంలో ఆమె అందరికీ అనూహ్యంగా షాకిచ్చారు.తెలంగాణ గవర్నర్ పదవితోపాటు పుదుచ్చేరి లెప్టినెంట్ గవర్నర్గా కూడా రాజీనామా చేశారు. రెండు రోజుల కిందటే ఆమె తన ఈ రెండు పదవుల నుంచి వైదొలగిగారు. అంతేకాదు.. పార్లమెంటు ఎన్నికల్లో సొంత రాష్ట్రమైన తమిళనాడు నుంచి పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. ఇలా.. రాజ్ భవన్ నుంచి రాజకీయాల్లోకి పునఃప్రవేశించారు.వాస్తవానికి గతంలో ఆమె తమిళనాడు రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించారు.
భారతీయ జనతా పార్టీ తరఫున లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు కూడా. 2009 నాటి సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా చెన్నై నార్త్ లోక్సభ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2019 ఎన్నికల్లో కూడా తూత్తుకుడి నుంచి లోక్సభ బరిలో నిలిచి పరాజయం పాలయ్యారు. ఆ తరువాతే తెలంగాణ గవర్నర్గా నామినేట్ అయ్యారు. ఇప్పుడు మళ్లీ క్రియాశీలక రాజకీయాల్లోకి అడుగు పెట్టారు.గవర్నర్, లెప్టినెంట్ గవర్నర్ పదవులకు రాజీనామా చేసిన రెండో రోజే బీజేపీలో తిరిగి చేరారు తమిళిసై. చెన్నైలోని పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో తెలంగాణకే చెందిన కేంద్ర మంత్రి జీ కిషన్ రెడ్డి చేతుల మీదుగా కాషాయ కండువాను కప్పుకొన్నారు. తమిళనాడు బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు అన్నామలై చేతుల మీదుగా పార్టీ ప్రాథమిక సభ్యత్వ కార్డును అందుకున్నారు.
కణిమొళి మళ్లీ
ఈ ఎన్నికల్లో ఆమె మరోసారి తూత్తుకుడి నుంచే పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది.ఈ నియోజకవర్గంపై అధికార డీఎంకే, ప్రతిపక్ష ఏఐఏడీఎంకే ఆధిపత్యం కొనసాగుతోంది. 2009లో డీఎంకే, 2014లో ఏఐఏడీఎంకే విజయం సాధించాయి. 2019లో డీఎంకే అభ్యర్థిగా తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సోదరి కణిమొళి విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో ఇక్కడి నుంచే కణిమొళి మళ్లీ పోటీ చేస్తున్నారు. దీంతో ఆమెను ఓడించి డీఎంకేను దెబ్బకొట్టాలన్న లక్ష్యంతో బీజేపీ.. తమిళిసైని రంగంలోకి దించుతోంది. కేంద్రంలో అధికారం తిరిగి తమదేనని బీజేపీ చెప్పుకొంటున్న నేపథ్యంలో.. తమిళిసై ఎంపీగా గెలిస్తే కేంద్ర మంత్రి పదవి ఆమెను వరిస్తుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ ఓడినా.. రాజ్యసభకు పంపించి అయినా తమిళిసైని కేంద్రమంత్రిని చేస్తారని భావిస్తున్నారు. ఏ లెక్కన చూసుకున్నా.. తమిళిసై కేంద్ర మంత్రి పదవిని టార్గెట్ చేసే గవర్నర్ పదవిని వదులుకుందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
Also Read This Article : ఏ గూటివారు.. ఏ గూటికో
