ప్రస్తుతం ఇండియా-పాక్ పరిస్థితి నివురు గప్పిన నిప్పులా ఉన్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియకుండా ఉంది. దీంతో భారత్ అయితే ఎలాంటి పరిస్థితిని అయినా ఎదుర్కొనేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలోనే పాకిస్థాన్తో సరిహద్దులు పంచుకొంటున్న రాష్ట్రాల్లో హై అలర్ట్ను ప్రకటించింది. అలాగే ఆయా రాష్ట్రాల్లో భద్రతా చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే రాజస్థాన్లో ఉన్న పాక్ సరిహద్దును సీల్ చేయడంతో పాటు ఎవరైనా సరిహద్దుల వద్ద అనుమానాస్పదంగా కనిపిస్తే ఉపేక్షించద్దని కాల్చివేత ఉత్తర్వులను సైతం జారీ చేశారు.
మరోవైపు భారత వాయుసేన సైతం ముందుగానే అప్రమత్తమై రేపటి (మే 9) వరకూ పలు విమానాశ్రయాలు మూసివేశారు. ఇక పంజాబ్లో సైతం సరిహద్దు ప్రాంతంలోని ఆరు జిల్లాల పాఠశాలలను మూసి వేసింది. రాష్ట్ర పోలీస్ శాఖతో పాటు ఇతర దళాల్లో సెలవులను రద్దు చేసి సిబ్బందిని తక్షణమే విధులకు హాజరుకావాలని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మరోవైపు జమ్మూకశ్మీర్లో నేడు కూడా పాకిస్థాన్ దళాలు శతఘ్ని గుండ్లను కాలుస్తుండటంతో మన సైన్యం దీటుగా బదులిస్తోంది. పౌర నివాసాలే లక్ష్యంగా పాక్ సైన్యం జరిపిన కాల్పుల్లో ఒక జవాన్ సహా 13 మంది చనిపోయారు.