Rohith Vemula :
తెలంగాణ సీఎం రేవంత్ ను కలిసిన రోహిత్ తల్లి
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హెచ్సీయూ విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ అంశంపై దర్యాప్తు ముగిసిన దశలో మళ్లీ కీలక మలుపు తిరిగింది.
రోహిత్ ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదని శుక్రవారం పోలీసులు హైకోర్టుకు నివేదిక సమర్పించారు. ఈ కేసు తెలంగాణ హైకోర్టులో విచారణకు రాగా.. ఆధారాలు లేవని కేసు క్లోజ్ చేశారు.
అంతేకాకుండా రోహిత్ దళితుడు కాదని పేర్కొన్నారు. రోహిత్ ఆత్మహత్యకు అప్పటి హెచ్సీయూ వీసీ అప్పారావుకు ఎలాంటి సంబంధం లేదని తేల్చారు.
యూనివర్సిటీ నిబంధనలకు లోబడే వైస్ ఛాన్సలర్ చర్యలు తీసుకున్నారని పోలీసులు తమ నివేదికలో పేర్కొన్నారు.
అంతేగాక, రోహిత్ ఎస్సీ సామాజిక వర్గానికి చెందినవాడని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవని వెల్లడించారు.
తన కులానికి సంబంధించిన విషయంలోనే రోహిత్ ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని పేర్కొన్నారు.
అయితే, రోహిత్ వేముల ఆత్మహత్య కేసును క్లోజ్ చేయడంతో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
శుక్రవారం సాయంత్రం యూనివర్సిటీలో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. దీంతో కేసును మరోసారి దర్యాప్తు చేయాలని పోలీసులు నిర్ణయం తీసుకున్నారు.
కేసును రీఓపెన్ చేయాలని తెలంగాణ డీజీపీ రవిగుప్తా నిర్ణయించారు. ఈ క్రమంలోనే కేసు పునర్విచారణకు అనుమతి ఇవ్వాలని తెలంగాణ హైకోర్టులో రాష్ట్ర పోలీసు శాఖ పిటిషన్ దాఖలు చేసింది.
మరోవైపు రోహిత్ వేముల తల్లి రాధిక తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని హైదరాబాద్లోని ఆయన నివాసంలో కలిశారు.
రోహిత్ కేసును పునర్విచారణ చేస్తామని సీఎం హామీ ఇచ్చారని అనంతరం ఆమె తెలిపారు.
”నా కొడుకు మృతిపై విచారణ జరిపించాలని అడిగితే, రోహిత్ దళితుడు కాదంటున్నారు. నేను దళితురాలినే నా కొడుకు దళితుడు కాడా?” అని ప్రశ్నించారు.
గతంలో చేసిన విచారణ సరిగా జరగలేదని ఆమె ఆరోపించారు. మళ్లీ న్యాయమైన విచారణ జరిపిస్తామని సీఎం హామీ ఇచ్చారని తెలిపారు.
Also Read This Article : ఆ ఇద్దరు ఇక ఇంటికే?
