సొంత నిర్ణయాలు తీసుకుంటే ఉద్యోగాలు ఊడతాయ్
Revanth Reddy Warning : తెలంగాణలో అధికార పగ్గాలు చేపట్టిన నాటి నుంచి తమది ప్రజా ప్రభుత్వమని, ప్రజలకు
వ్యతిరేకంగా ఒక్క నిర్ణయం కూడా తీసుకోబోమని ప్రకటిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ఈ విషయంలో ఏ ఒక్కరు తనకు
భిన్నంగా ప్రవర్తించినా ఊరుకునేది లేదని హెచ్చరిస్తున్నారు. ప్రత్యేకించి ఉద్యోగులెవరైనా అత్యుత్సాహం ప్రదర్శించి సొంత నిర్ణయాలు
తీసుకుంటే ఉద్యోగాలు ఊడిపోతాయని గట్టిగానే చెబుతున్నారు. మహబూబ్ నగర్ జిల్లాలో విద్యుత్తు శాఖ అధికారులు
అత్యుత్సాహంతో రైతులకు సంబంధించిన వ్యవసాయ కనెక్షన్లు తనిఖీ చేయడం రేవంత్ ఆగ్రహం తెప్పించింది.
ఎన్నికలకు ముందే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఉచిత విద్యుత్తును ఎత్తివేస్తారని, వ్యవసాయ విద్యుత్తు కనెక్షన్లు తొలగిస్తారని
బీఆర్ఎస్ నేతలు ప్రచారం చేశారు. ఆ పార్టీ అధినేత, నాటి సీఎం కేసీఆర్ అయితే ప్రతి బహిరంగ సభలోనూ రేవంత్పై తీవ్ర విమర్శలు
చేశారు. వ్యవసాయానికి 24 గంటల విద్యుత్తు అవసరం లేదని, మూడు గంటలు ఇస్తే చాలునని రేవంత్ అన్నట్లు అప్పట్లో
పెద్దఎత్తున ప్రచారం చేశారు. తాజాగా అధికారులు వ్యవసాయ కనెక్షన్ల వద్దకు వెళ్లడంతో.. వాటిని తొలగించేందుకే వివరాలు
సేకరిస్తున్నారంటూ గులాబీ నేతలు మళ్లీ విమర్శలు చేశారు. దీంతో ఆనాడు తనకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ సాగించిన
ప్రచారం, దానివల్ల కాంగ్రెస్ డ్యామేజీ జరగకుండా చూసుకునేందుకు పడ్డ కష్టాలన్నీ రేవంత్ కు మళ్లీ కళ్లముందు కదలాడాయట.
అందుకే మహబూబ్ నగర్ అంశంపై ఆగ్రహోదగ్రులయ్యారట. ఎవరిని అడిగి తనిఖీలు చేశారని, రైతుల్లో భయాందోళనలు
కలిగించేలా ఎందుకు వ్యవహరించారని ఉన్నతాధికారులపై మండిపడ్డారట. దీనికి కారణమైన అధికారులపై తక్షణం చర్యలు
తీసుకోవాల్సిందిగా ఆయన ఆదేశిచండంతో.. ఏకంగా డిస్కం డైరెక్టర్కు ఉద్వాసన పలికారు. ఎస్ఈపై బదిలీపై వేటు వేశారు.
సచివాలయంలో ప్రజాప్రాలన దరఖాస్తులపై సమీక్ష జరుగుతుండగా.. ఈ అంశం ప్రస్తావనకు వచ్చింది. 200 యూనిట్ల ఉచిత
విద్యుత్కు సంబంధించి ఏం చేయాలన్న దానిపై ఈ సమీక్షలో చర్చ జరిగింది.
రైతుల కరెంట్ కనెక్షన్ల తనిఖీRevanth Reddy Warning
ఈ సందర్భంగా విద్యుత్తు శాఖ మంత్రి అయిన ఉపముఖ్యమంత్రి, భట్టి విక్రమార్క మహబూబ్నగర్లో విద్యుత్శాఖ సిబ్బంది
అత్యుత్సాహం గురించి తన దృష్టికి వచ్చిన విషయాన్ని సీఎం రేవంత్రెడ్డికి వివరించారు. రైతుల కరెంట్ కనెక్షన్ల తనిఖీ, సర్వే
చేపట్టినట్లు తెలిపారు. దీనిపై మండిపడిన సీఎం రేవంత్రెడ్డి… రైతుల వ్యవసాయ కనెక్షన్లపై సర్వే చేయాలని చెప్పిందెవరని
అక్కడే ఉన్న ట్రాన్స్ కో సీఎండీ రిజ్విని ప్రశ్నించారు. బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకున్నారా.. లేదా.. అని ఆరా తీశారు.
ప్రభుత్వ అనుమతి లేకుండా అధికారులు… ఇష్టానుసారం వ్యవహరిస్తే సహించేది లేదన్నారు. శాఖాపరమైన నిర్ణయమేదీ
లేకుండానే డిస్కం డైరెక్టర్(ఆపరేషన్స్) జె.శ్రీనివాసరెడ్డి సొంతంగా ఆదేశాలు ఇచ్చాడని, ఆయన ఆదేశాల మేరకు అక్కడున్న
ఎస్ఈ ఎన్ఎస్ఆర్ మూర్తి ఈ చర్యకు పాల్పడినట్లు ఉన్నతాధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ఉన్నతాధికారుల అనుమతి
లేకుండా సొంతంగా నిర్ణయాలు తీసుకున్న డైరెక్టర్ శ్రీనివాసరెడ్డిని విధుల నుంచి తొలిగించామని, ఎస్ఐని నుంచి బదిలీ
చేశామని అధికారులు తెలిపారు. అప్పటికీ ఆగ్రహం చల్లారని రేవంత్రెడ్డి…ఇలాంటి చర్యలను భవిష్యత్లో సహించేది లేదన్నారు.
ఎవరికి వారు తమకు తోచిన విధంగా వ్యవహరిస్తామంటే ఊరుకోబోమన్నారు. సొంత నిర్ణయాలు తీసుకుని ఉద్యోగాలు పోగొట్టుకోవద్దని
అధికారులను హెచ్చరించారు. ఇదే తరహా ఘటనలు ఏ శాఖలో జరిగినా…ఈసారి ఉన్నతాధికారులపైనా చర్యలు తీసుకుంటామన్నారు.
ఈ మెసేజ్ కిందిస్థాయిలో పనిచేస్తున్న అందరు ఉద్యోగులకు చేరాలన్నారు. ప్రజలను ఇబ్బంది పెట్టే ఎలాంటి పని చేసినా సహించేది
లేదన్నారు..