Rajinikanth :
‘బాషా’ శత దినోత్సవ వేడుకల్లో (1995) నటుడు రజనీకాంత్ (Rajinikanth) చేసిన వ్యాఖ్యలు అప్పట్లో పెను దుమారాన్నే రేపాయి. ఆ వ్యాఖ్యల కారణంగా ఒక నాయకుడు తన మంత్రి పదవినే కోల్పోయారు. ఈ పరిణామాల కారణంగా రజినీ ఏకంగా అప్పటి ముఖ్యమంత్రి జయలలిత (Jayalalitha)నే వ్యతిరేకించాల్సి వచ్చింది. ఈ సినిమా వచ్చి దాదాపు 30 ఏళ్లవుతోంది. ఇన్నాళ్లకు రజినీ ఈ విషయమై పెదవి విప్పారు. ప్రముఖ నిర్మాత, రాజకీయ నేత ఆర్ఎం.వీరప్పన్ (RM Veerappan) జీవితం ఆధారంగా ‘ఆర్వీఎం: ది కింగ్మేకర్’ అనే డాక్యుమెంటరీ నిర్మాణం జరిగింది. దీనిలో రజనీకాంత్ భాగమయ్యారు. ఈ సందర్భంగా నిర్మాత వీరప్పన్తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. వీరిద్దరి కాంబోలోనే ‘బాషా’ చిత్రం వచ్చింది.
‘బాషా’ సినిమా శతదినోత్సవ వేడుకల్లో అప్పట్లో అన్నాడీఎంకే(AIADMK) ప్రభుత్వంలో మంత్రిగానూ.. సినిమాకు నిర్మాతగా వ్యవహరించిన వీరప్పన్ సైతం పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రంలో పెరిగిపోయిన బాంబ్ కల్చర్ గురించి తాను మాట్లాడానని రజినీ వెల్లడించారు. తన స్పీచ్ కారణంగా ఆయన మంత్రి పదవి పోయిందని.. అది తనను చాలా బాధించిదని పేర్కొన్నారు. తాను మాట్లాడుతున్నప్పుడు వీరప్పన్ ఖండించక పోవడమే అందుకు కారణమన్నారు. ఈ విషయమై జయ.. వీరప్పన్ను ప్రశ్నించారట. విషయం తెలిసి వెంటనే ఆయనకు ఫోన్ చేశానని.. దీని గురించి జయలలితతో మాట్లాడతానని చెప్పినట్టు రజినీ వెల్లడించారు. కానీ దానికి వీరప్పన్ అంగీకరించలేదట. ‘నీ ఆత్మ గౌరవాన్ని కోల్పోవడం నాకు ఇష్టం లేదు. నాకు ఎలాంటి పదవులు వద్దు. నేను వాటికి సరిపడను’ అని ఆయన తనతో చెప్పారని రజినీ వెల్లడించారు. ఆ తరువాత జయను రాజకీయాల పరంగా వ్యతిరేకించేందుకు అది కూడా ఒక కారణమని రజినీకాంత్ తెలిపారు.
ప్రజావాణి చీదిరాల
Also Read This : విద్యార్థులకు రేవంత్ ప్రభుత్వం గుడ్ న్యూస్..