KL Rahul :
హైదరాబాద్: ఫార్మాట్లతో సంబంధం లేకుండా.. భారత జట్టులో కీలక ఆటగాడిగా కొనసాగుతున్న లోకేశ్ రాహుల్పై జట్టు హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ ప్రశంసలు కురిపించాడు.
వన్డే, టెస్టు, టీ20 ఇలా.. మ్యాచ్ ఏదైనా.. అతడు భారత జట్టుకు కీలకమని.. మిడిలార్డర్, టాపార్డర్, వికెట్ కీపర్ ఇలా ఏ బాధ్యత అప్పగించినా.. దాన్ని సక్రమంగా నిర్వర్తిస్తున్నాడని ద్రవిడ్ చెప్పుకొచ్చాడు.
గతంలో జట్టు అవసరాల కోసం రాహుల్ ద్రవిడ్ కూడా వికెట్ కీపింగ్ బాధ్యతలు మోసిన విషయం తెలిసిందే.
కర్ణాటకకే చెందిన కేఎల్ రాహుల్ కూడా.. అచ్చం ద్రవిడ్ అడుగు జాడల్లోనే నడుస్తూ.. టీమ్ మేనేజ్మెంట్కు ఏ అవసరం ఉన్నా.. నేనున్నానంటూ ముందు వరుసలో నిలుస్తున్నాడు.
వన్డేల్లో మంచి వికెట్ కీపర్గా గుర్తింపు తెచ్చుకున్న కేఎల్ రాహుల్.. ఇటీవల దక్షిణాఫ్రికా పర్యటనలో టెస్టుల్లోనూ కొత్త అవతారంలో దర్శనమిచ్చాడు.
సఫారీ టూర్లో ఎర్ర బంతిని కూడా వికెట్ల వెనుక కాచుకున్న కేఎల్ రాహుల్.. ప్రస్తుతం ఇంగ్లండ్తో టెస్టు సిరీస్లో మాత్రం స్పెషలిస్ట్ బ్యాటర్గా బరిలోకి దిగుతాడని ద్రవిడ్ పేర్కొన్నాడు.
విదేశాలతో పోల్చుకుంటే.. భారత్లో వికెట్ కీపింగ్ కాస్త కష్టమైన పని కాగా.. అశ్విన్, జడేజా, కుల్దీప్, అక్షర్ వంటి స్పిన్నర్ల బంతులను ఎదుర్కోవడం సవాలుతో కూడుకున్న పనే.
స్పిన్కు సహకరించే భారత పిచ్లపై 90 ఓవర్ల పాటు వికెట్లను కాచుకోవడం కష్టమైన పని కావడంతో.. ఇప్పటికే విరాట్ కోహ్లీ గైర్హాజరీలో మిడిలార్డర్లో రాహుల్పై అదనపు భారం పడనుండగా..
దానికి తోడు ఇప్పుడు వికెట్ కీపింగ్ బాధ్యతలు అప్పగించబోమని రాహుల్ ద్రవిడ్ పేర్కొన్నాడు.
భారత్, ఇంగ్లండ్ మధ్య గురువారం నుంచి హైదరాబాద్లోని ఉప్పల్ వేదికగా తొలి టెస్టు ప్రారంభం కానున్న విషయం తెలిసిందే.
ఈ సిరీస్ కోసం సెలెక్షన్ కమిటీ మొత్తం ముగ్గురు వికెట్ కీపర్లను ఎంపిక చేసింది. ఇప్పుడు ద్రవిడ్ మాటలతో కేఎల్ రాహుల్ను ఆ జాబితాలో నుంచి తొలగిస్తే..
ఇక తెలుగు ఆటగాడు కోన శ్రీకర్ భరత్, యంగ్ ప్లేయర్ ధ్రువ్ జురేల్ మధ్య పోటీ నెలకొంది. ఈ ఇద్దరిలో మరి తుది జట్టులో చోటు ఎవరికి దక్కుతుందో చూడాలి.
మంగళవారం హైదరాబాద్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ద్రవిడ్ మాట్లాడుతూ.. ‘కేఎల్ రాహుల్ వికెట్ కీపర్గా బరిలోకి దిగడం లేదు.
దక్షిణాఫ్రికా పర్యటనలో అతడు ఆ బాధ్యతలు చక్కగా నిర్వర్తించాడు.
సుదీర్ఘ సిరీస్లో ఇప్పుడు ఆ అవసరం లేదు. మరో ఇద్దరు స్పెషలిస్ట్ స్పిన్నర్లు జట్టులో ఉన్నారు’ అని పేర్కొన్నాడు.
Also Read:UCC bill:ఆ రాష్ట్రంలో అత్యంత వివాదాస్పద బిల్లు