MS Raju : మహేశ్, ప్రభాస్‌లను స్టార్‌లుగా మలచిన ఎంఎస్ రాజు

MS Raju :

‘మనసంతా నువ్వే’ (సినిమాయే) అనుకుని.. ‘ఒక్కడు’గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి.. ఎందరో ‘నీ స్నేహం’ కావాలంటూ తన చెంతకు వచ్చేలా చేసుకున్నారు. ‘శత్రువు’ సినిమా తీసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ఆయనో అజాత శత్రువు. ‘వర్షం’ అంటే ఇండస్ట్రీ హిట్.. ‘వాన’ అంటే హిట్.. ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ అని ఏ ముహూర్తాన అన్నారో కానీ ఆయనను వరించిన హిట్స్ అన్నీ ఇన్నీ కావు. బాక్సాఫీస్‌కు‘మస్కా’కొట్టి.. వసూళ్ల సునామీని తన ఖాతాలో వేసుకున్న ‘దేవి పుత్రుడు’ ఆయన. ఇంతకూ ఆయనెవరో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదుగా.. ది గ్రేట్ ప్రొడ్యూసర్ ఎంఎస్ రాజు. ఇవాళ ఎంఎస్ రాజు పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు చెబుతూ.. ‘ట్యాగ్ తెలుగు’ పంచుకుంటున్న కొన్ని ఆసక్తికర విషయాలు..

ఎంఎస్ రాజును ఇండస్ట్రీలో సంక్రాంతి రాజు అని కూడా పిలుస్తారు. పొంగల్ వస్తే బొమ్మ పడేది. 2001 నుంచి 2009 వరకూ ఏ ఏడాది వదలకుండా సినిమాలు వదిలారు. అంతలా ఎలా నచ్చాడో ఏమో కానీ.. మూడేళ్లపాటు వరుసగా ఫిలింఫేర్ అవార్డులు ఆయన్నే వరించాయి. ఒక అద్భుతమైన కథను ఎలా పిక్ చేసుకోవాలి? దానిని అత్యద్భుతంగా ఎలా మలచాలనేది ఆయనకు తెలిసినంతగా మరెవరికీ తెలియదని చెప్పాలి. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఎంఎస్ రాజు బ్యాక్‌గ్రౌండ్ ఏమీ సాదాసీదా బ్యాక్‌గ్రౌండ్ కాదు. ఆయన తండ్రి రాయపరాజుకు వందల ఎకరాల భూమి ఉండేది. ఆ ఆస్తులన్నింటినీ అమ్మేసి మద్రాస్ వెళ్లి ఐదు సినిమాలను నిర్మించారు. అలా ఎంఎస్ రాజుకు కూడా సినిమాల పట్ల మక్కువ పెరిగింది. 1987లో అర్జున్, శోభన ప్రధాన పాత్రల్లో ‘మనవడొస్తున్నాడు’ అనే సినిమాను తీశారు. ఆ తరువాత కొడుకు పేరు మీద సుమంత్ ఆర్ట్స్ ప్రొడక్షన్స్ పెట్టి ‘స్ట్రీట్ ఫైటర్’ అనే సినిమా తీశారు. ఈ సినిమాతో ఎంఎస్ రాజు చాలా నష్టపోయారు. ఆ తరువాత ‘దేవి’ సినిమాను తీశారు. అది బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ‘దేవి’ సినిమాతోనే మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. తన సినిమాలతో ఎందరో దర్శకులను పరిచయం చేశారు. ‘ఒక్కడు’తో మహేశ్ బాబు.. ‘వర్షం’తో ప్రభాస్‌ను స్టార్‌లుగా మలచిన ఘనత కూడా ఎంఎస్ రాజుదే.

ప్రజావాణి చీదిరాల

MS.Raju
MS.Raju

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *