Jyothi Krishna: పవన్ ఇప్పటికే మూడు సార్లు సినిమా చూశారు

పవన్‌ కల్యాణ్‌ హీరోగా రూపొందుతోన్న పీరియాడికల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘హరిహర వీరమల్లు’. సినిమా రిలీజ్ డేట్ మినహా దీనికి సంబంధించిన ఆసక్తికర విషయాలెన్నో బయటకు వస్తున్నాయి. క్రిష్‌ జాగర్లమూడి, జ్యోతికృష్ణ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్స్ శరవేగంగా సాగుతున్నాయి. ఈ సినిమాను మరింత క్వాలిటీతో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు విడుదలను వాయిదా వేస్తున్నట్టు మేకర్స్ వెల్లడించారు. తాజాగా ఈ చిత్రాన్ని ఉద్దేశించి దర్శకుడు జ్యోతికృష్ణ మచిలీపట్నంలో జరిగిన ఓ కార్యక్రమంలో కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా సినిమా బడ్జెట్‌ ఎంతనేది వెల్లడించారు. ఈ సినిమాను రూ.250 కోట్లకు పైగా బడ్జెట్‌తో తెరకెక్కించినట్టు తెలిపారు.

పవన్‌ కల్యాణ్‌తో వర్క్‌ చేసే అవకాశం తనకు ఈ సినిమాతో దక్కినందుకు అదృష్టవంతుడిగా ఫీలవుతున్నానన్నారు. పవన్ ఒకసారి నమ్మితే ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటారని.. ఇతరుల టాలెంట్‌ను ఆయన ఎంతో గౌరవిస్తారన్నారు. తనను నమ్మి తనతో సినిమా చేశారని.. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకున్నానని అనుకుంటున్నట్టు జ్యోతికృష్ణ తెలిపారు. ఇప్పటికే మూడు సార్లు సినిమా చూసి తనను దాదాపు గంటసేపు మెచ్చుకున్నారన్నారు. సినిమాలో బందరు పోర్ట్‌కు సంబంధించి ఒక భారీ సీక్వెన్స్‌ ఉందని.. కథకు తగిన విధంగా సీజీలో ఈ పోర్ట్‌ రీ క్రియేట్‌ చేయడానికి సుమారు రెండేళ్లు కష్టపడ్డామన్నారు. ముఖ్యంగా ఇక్కడ జరిగిన యాక్షన్ సన్నివేశాలను ప్రేక్షకులు ఎంతగానో ఎంజాయ్ చేస్తారని జ్యోతికృష్ణ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *