Telangana Politics :
తెలంగాణలో రాజకీయం రంగులు మారుతోంది… పార్టీల నాయకులు కండువాలు మారుస్తున్నారు.. అసెంబ్లీ ఎన్నికలు కావడంతో అంతా తలకిందులు అవుతోంది.. లోక్ సభ ఎన్నికలకు ముందు మరిన్ని జంపింగ్ లు ఉంటాయని కచ్చితంగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బలవుతున్నది ఒక్కటే పార్టీ. లబ్ధి పొందుతున్నది మిగతా రెండు పార్టీలు కావడం గమనార్హం.
మొత్తం 9లో.. ఐదుగురు జంప్?
గత లోక సభ ఎనికల్లో తెలంగాణలో కాంగ్రెస్ 3, బీజేపీ 4, బీఆర్ఎస్ (అప్పటి టీఆర్ఎస్) 9 సీట్లు గెలుచుకున్నాయి. సారు, కారు, పదహారు అంటూ బీఆర్ఎస్ హడావుడి చేసినా సింగిల్ డిజిట్ తోనే సరిపెట్టుకుంది. అయితే, అప్పటికి అధికారంలో ఉంది కాబట్టి ఇదేమంత పెద్ద సమస్య కాలేదు. ఇప్పుడు మాత్రం తెలంగాణలో అధికారం చేజారడంతో బీఆర్ఎస్ కారు ఒడిదొడుకులను ఎదుర్కొంటోంది.
పార్టీల్లో ఎమ్మెల్యేలు మారడం ఓ స్థాయి సంచలనం అయితే.. ఎంపీలు మారడం పెద్ద సంచలనం. ఈ లెక్కన ఇద్దరు ఎంపీలు బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరారు. మరో ముగ్గురు అదే లైన్ లో ఉన్నారని చెబుతున్నారు. అంటే గత ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున నెగ్గిన 9 మంది ఎంపీల్లో ఐదుగురు జంప్ అన్నమాట.
ఎమ్మెల్యేలూ గోడ దూకుతారా?
బీఆర్ఎస్ కు చెందిన పలువురు ఎమ్మెల్యేలు తమ పార్టీలోకి వస్తామని అంటున్నారని.. తాము కనుసైగ చేస్తే బీఆర్ఎస్ నుంచి 15 మంది ఎమ్మెల్యేలు వచ్చేస్తారని కాంగ్రెస్ నేతలు, రాష్ట్ర మంత్రులు ఇప్పటికే ప్రకటించారు. ఈ క్రమంలో కేసీఆర్ సొంత జిల్లా అయిన ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు నెల కిందట సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు.
తాజాగా భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కూడా రేవంత్ ను కలిశారు. వాస్తవానికి టికెట్ రాదని తెలిసి ఎన్నికల ముందు వెంకట్రావు బీఆర్ఎస్ లో చేరారు. ఆయన గెలిచినా రాష్ట్రంలో పార్టీ ఓడింది.వెంకట్రావు ఫలితాలు వెలువడిన మొదట్లోనే పార్టీ మారతారనే ప్రచారం జరిగింది. కాగా, బీఆర్ఎస్ నుంచి ఇంకెంతమంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వైపు వెళ్తారో చూడాలి.
ఇక్కడ గమనార్హం ఏమంటే.. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 64 సీట్లతో అధికారంలో వచ్చింది. కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో కేసీఆర్ ను తట్టుకోవాలంటే ఆ పార్టీ ఎమ్మెల్యేల సంఖ్య పరంగా బలంగా ఉండాలి. దీంతోనే బీఆర్ఎస్ నుంచి శాసన సభ్యులను చేర్చుకోవడం తప్పదని హస్తం పార్టీ భావించవచ్చు.
Also Read This : సొంతంగానే అధికారంలోకి.. ఏపీలో టీడీపీ ప్లాన్ సూపర్