...

Maldives News Telugu : భారత్ అవుట్ నుంచి.. ముయిజ్జు అవుట్ దాకా

Maldives Latest News Telugu:

అధ్యక్షుడైన 3 నెలల్లోనే ముయిజ్జు చేసిన తప్పేంటి… ప్రజల్లో అంత వ్యతిరేకత ఎందుకు

Maldives News Telugu : ‘భారత్ ఔట్’ అన్న నినాదంతో అధికార పీఠమెక్కిన ముయిజ్జును ఇప్పుడు మాల్దీవుల ప్రజలు ‘ముయిజ్జు అవుట్’ అంటున్నారు.

అధ్యక్షుడై కనీసం మూడు నెలలు కూడ నిండకముందే ఆయనపై అభిశంసనకు విపక్షాలు సిద్ధమయ్యాయి. వాస్తవానికి ఎన్నికల ముందు మాల్దీవుల ప్రజలు ముయిజ్జు ఎజెండాకు మద్దతు పలికారు.

మాల్దీవులే ఫస్ట్ అన్నారు. అందుకే విజయాన్ని కట్టబెట్టారు. అయితే, ముయిజ్జు అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత అతని మంత్రులు మన ప్రధాని మోదీపై చేసిన కామెంట్లు,

తదనంతరం భారత్‌లో పెరిగిన ‘బాయ్‌కాట్ మాల్దీవ్స్’ నినాదం.. ఫలితంగా తమ దేశానికి భారత పర్యాటకుల రాక తగ్గిపోవడంతో మాల్దీవుల ప్రజలు పునరాలోచనలో పడ్డట్లు తెలుస్తోంది.

అందుకే విపక్షాల అభిశంసన ప్రయత్నంపై కూడా అక్కడ పెద్దగా వ్యతిరేకత కనపడట్లేదు.

ముయిజ్జు అధ్యక్ష బరిలో ఉన్నప్పటి నుంచి అక్కడి ప్రజల్లో భారత్‌పై వ్యతిరేకత నూరిపోశారు. మాల్దీవుల్లో భారత సైన్యం ఉండటం దేశ సార్వభౌమత్వానికి ముప్పని వాదించారు.

తర్వాత ఆయన అధ్యక్షుడిగా ఎన్నికైనప్పటి నుంచి భారత్‌ను దూరం పెట్టసాగారు.

గతంలో మాల్దీవుల్లో అధికారంలో ఉన్న పార్టీలు ‘ఇండియా ఫస్ట్’ అనే విధానాన్ని అవలంబించాయి. ఆ దేశానికి ఎవరు అధ్యక్షుడిగా ఎన్నికైనా తొలుత భారత్ లో పర్యటించేవారు.

కానీ ముయిజ్జు దీన్ని పాటించలేదు. తొలుత తుర్కియే దేశ పర్యటనకు వెళ్లారు. ఆ తర్వాత సౌదీ అరేబియా వెళ్ళారు. ఇంతవరకు భారత్‌లో పర్యటించలేదు.

రెచ్చగొట్టేందుకా అన్నట్టుగా భారత్‌తో వివాదం నడుస్తున్న వేళ ముయిజ్జు చైనాకు వెళ్లి.. ‘భారత పర్యాటకులు తగ్గితే.. మీరు రావాలి. మీ దేశం నుంచి మాల్దీవులకు పర్యాటకులు పెరగాలి’ అని ఆహ్వానించి వచ్చారు. ముయిజ్జుకు చైనా మద్దతుదారుగా పేరుంది.

ఇదిలా ఉండగా, మార్చి 17న మాల్దీవుల పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. ముయిజ్జుకు ఇదో గడ్డు పరిస్థితి. చట్టాలు ఆమోదించాలంటే పార్లమెంటు మద్దతు అవసరం.

భారత్‌పై వ్యతిరేకత పెంచుకుంటే తమకు నష్టమేనని గుర్తించిన మాల్దీవుల ప్రజలు ముయిజ్జు పార్టీని ఆదరించే అవకాశం తక్కువని విశ్లేషకులు అభిప్రయాపడుతున్నారు.

ఇదే జరిగితే, ముయిజ్జు అధికార పీఠంపై ఉన్నా చేతులు కట్టుకుని ఉండాల్సిన పరిస్థితి రావచ్చు. ‘’మనం భౌగోళికతను మార్చలేం, చైనాను దగ్గరికి తీసుకురాలేం.

భారత్ మన పొరుగు దేశం, ఫ్రెండ్, కుటుంబం. అది ఔషధమైనా, ఆహారమైనా భారత్ లేకుండా సాధించడం కష్టం.

మనం ప్రశాంతంగా బతుకుతున్నామంటే పొరుగు దేశాలకు మొదటి ప్రాధాన్యం ఇచ్చే భారత విధానమే కారణం” అని విపక్ష మాల్దీవ్స్ డెమోక్రటిక్ పార్టీ'(ఎండీపీ) పార్లమెంటరీ డిప్యూటీ లీడర్ హుస్సేన్ అన్నారంటే వాళ్లు భారతదేశానికి ఇచ్చే ప్రాధ్యానం అర్థం చేసుకోవచ్చు.

భారత్ డే తొలి స్థానం

మాల్దీవుల దేశంలో పర్యటించే భారతీయుల సంఖ్య గణనీయంగా తగ్గింది. గతేడాది మాల్దీవులను అత్యధిక పర్యాటకులు సందర్శించిన దేశాల జాబితాలో భారత్‌ తొలి స్థానంలో నిలువగా, ఈ ఏడాది జనవరి 28వ తేదీ నాటికి భారత్‌ 5వ స్థానానికి పరిమితమైంది. మాల్దీవుల పర్యాటక మంత్రిత్వ శాఖ తాజాగా విడుదల చేసిన గణాంకాల ప్రకారం ఈ ఏడాది జనవరి 28 నాటికి మాలీవులను అత్యధికంగా సందర్శించిన పర్యాటకుల సంఖ్య పరంగా రష్యా(18,561 మంది) తొలి స్థానానికి చేరింది. తర్వాతి స్థానాల్లో ఇటలీ, చైనా, బ్రిటన్‌, భారత్‌(13,989) నిలిచాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.