బెయిల్ పిటిషన్ ను తిరస్కరించిన రౌస్ అవెన్యూ కోర్టు
ఏప్రిల్ 9 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధింపు
మధ్యంతర బెయిల్ పిటిషన్ పై ఏప్రిల్ 1న విచారణ
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు భారీ షాక్ తగిలింది. కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ను రౌస్ అవెన్యూ కోర్టు తిరస్కరించింది. మంగళవారం నాటి విచారణ సందర్భంగా ఆమె పిటిషన్ పై తీర్పును కాసేపు రిజర్వ్ లో ఉంచిన కోర్టు.. చివరికి ఆమెకు నిరాశ కలిగించే తీర్పును వెలువరించింది. కవితకు 14 రోజుల పాటు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. ఏప్రిల్ 9వ తేదీ వరకు రిమాండ్ విధిస్తూ తీర్పును వెలువరించింది. ఆమెను తిహార్ జైలుకు తరలించాలని పోలీసులను ఆదేశించింది. ఈ తీర్పుతో బీఆర్ఎస్ శ్రేణులు షాక్ కు గురయ్యాయి. మరోవైంపు కవిత దాఖలు చేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్ పై ఏప్రిల్ 1న పూర్తి విచారణ జరుపుతామని కోర్టు తెలిపింది. తన కుమారుడికి పరీక్షలు ఉన్నాయని, తనకు మధ్యంత బెయిల్ మంజూరు చేయాలని కోర్టును కవిత కోరారు. అయితే, ఆమె విన్నపాన్ని కోర్టు పరిగణనలోకి తీసుకోలేదు.
ఇంకోవైపు, కవితను మరో 15 రోజుల పాటు తమ కస్టడీకి ఇవ్వాలని ఈడీ కోరినప్పటికీ… ఆమెకు కోర్టు రిమాండ్ విధించడం గమనార్హం.రిమాండ్ లో ఉన్న కవితను ఈడీ తమ కస్టడీకి కోరే అవకాశం ఉందని తెలుస్తోంది. కాగా, కోర్టు హాల్లోకి వెళ్లేముందు కవిత మీడియాతో మాట్లాడుతూ.. రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే తనను కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.ఇది మనీలాండరింగ్ కేసు కాదని, పొలిటికల్ లాండరింగ్ కేసు అని వ్యాఖ్యానించారు.తాను అప్రూవర్ గా మారబోనని, కడిగిన ముత్యంలా బయటికి వస్తానని అన్నారు. నాలుగు రోజులు తాత్కాలికంగా తనను జైల్లో పెట్టవచ్చేమో గానీ.. తన ఆత్మస్థయిర్యాన్ని మాత్రం దెబ్బతీయలేరని వ్యాఖ్యానించారు.కాగా, కోర్టు తీర్పు అనంతరం కవిత కుటుంబసభ్యులు కోర్టు హాల్లో ఆమెను కలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు భావోద్వేగానికి గురయ్యారు.
Alo Read This Article : దేశంలోనే అతి పెద్ద డ్రగ్స్ లింకు ను ఛేదించిన పంజాగుట్ట పోలిసులు..