Phone Tapping Case :
ఫోన్ ట్యాపింగ్ లతో మాకు సంబంధం లేదు-కేటీఆర్
తనపై ఆరోపణలు చేసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని వార్నింగ్
తెలంగాణా రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తోన్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తనపై వస్తున్న ఆరోపణలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు సీరియస్ గా స్పందించారు.
కాంగ్రెస్, బీజేపీ నేతల ఆరోపణలను తీవ్రంగా ఖండించిన కేటీఆర్.. వారిపై లీగల్ యాక్షన్ కు సిద్ధమవుతున్నట్లు ప్రకటించారు.
తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ తో.. గత ప్రభుత్వంలో కొందరు పోలీస్ అధికారులు చట్ట విరుద్ధంగా ఫోన్ ట్యాపింగ్ కి పాల్పడిన విషయం ఇటీవల వెలుగులోకి వచ్చిందే.
అప్పటి విపక్షనేతల ఫోన్లు ట్యాప్ చేసి కీలక సమాచారాలు సేకరించడంతో పాటు.. ఎందరో సినీ ప్రముఖుల మరియు వ్యాపారవేత్తల ఫోన్లు ట్యాప్ చేసి, వారి వ్యక్తిగత విషయాలు సేకరించి, బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి.
సమంత, నాగ చైతన్య విడిపోవడానికి కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారమే కారణమని ప్రచారం జరుగుతోంది.
సమంతతో పాటు ఎందరో హీరోయిన్ల ఫోన్లు అప్పుడు ట్యాప్ అయ్యాయని వార్తలొస్తున్నాయి. దీని వెనుక అప్పటి ఐటీ మంత్రి కేటీఆర్ ఉన్నారని కొందరు ఆరోపిస్తున్నారు.
ఈ క్రమంలో ఈ వివాదంపై కేటీఆర్ తాజాగా స్పందించారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు.
హీరోయిన్లను బెదిరించే దిక్కుమాలిన పనులు చేయాల్సిన కర్మ తనకు పట్టలేదన్నారు. ఇలాంటి ఆరోపణలు చేస్తే తాటతీస్తానని, ఈ వ్యవహారంపై న్యాయపోరాటం చేస్తానని తెలిపారు.
మరోవైపు మంత్రి కొండా సురేఖ, కాంగ్రెస్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, ఆ పార్టీ నేత కేకే మహేందర్ రెడ్డి ఆరోపణలకు సంబంధించి మీడియాలో వచ్చిన కథనాలను కేటీఆర్ ‘ఎక్స్’ వేదికగా ప్రస్తావించారు. తనపై నిరాధార, అసత్య ఆరోపణలు చేస్తున్న నేతలు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో మంత్రితో పాటు ఇద్దరు నేతలు న్యాయపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని పేర్కొన్నారు.
‘‘నాపై ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చేసిన ఇద్దరు కాంగ్రెస్ నేతలు, ఓ మంత్రిపై కోర్టుకు వెళ్తాను. న్యాయపరంగా నాపై చేస్తున్న అబద్ధపు ఆరోపణలు ఎదుర్కొంటా. సిగ్గులేకుండా ఇలాంటి అర్థరహిత, ఆధారాల్లేని ఆరోపణలు చేసినందుకు క్షమాపణలు అయినా తెలియజేయాలి. లేదంటే… లీగల్ గా చర్యలకు ఎదుర్కొనేందుకు సిద్ధం కావాలి. అలాగే… వాస్తవాలు తెలుసుకోకుండా ఈ వార్తను ప్రచురించిన వార్త సంస్థలకు కూడా నోటీసులు ఇస్తాం’’ అని కేటీఆర్ తెలిపారు
Also Read This Article : తెలుగు అమ్మాయి అయినప్పటికీ తమిళ్ సినిమాలో ఎంత బిజినో తెలుసా ?