‘కృష్ణ’ విలన్ ముకుల్ దేవ్ మృతి

బాలీవుడ్‌ నటుడు ముకుల్‌ దేవ్‌ (54) మృతి చెందారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ముకుల్ దేవ్‌ను కుటుంబ సభ్యులు ముంబైలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు, సన్నిహితులు వెల్లడించారు. ముకుల్ దేవ్ సీరియల్ నటుడిగా తన కెరీర్‌ను ప్రారంభిరంచారు. ఆ తరువాత ‘దస్తక్’ సినిమాతో వెండితెరకు పరిచయమయ్యారు. ఆపై పలు హిందీ సినిమాల్లో నటించి మంచి గుర్తింపే తెచ్చుకున్నారు.

తెలుగు, పంజాబీ, కన్నడ చిత్రాల్లోనూ ముకుల్ దేవ్ నటించారు. రవితేజ హీరోగా నటించిన ‘కృష్ణ’ సినిమాతో విలన్‌గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. ఆ తర్వాత తెలుగులో ‘కేడి’, ‘అదుర్స్‌’, ‘సిద్ధం’, ‘మనీ మనీ మోర్‌ మనీ’, ‘నిప్పు’, ‘భాయ్‌’ చిత్రాల్లో నటించారు. 2022లో విడుదలైన ‘అంత్‌ ది ఎండ్‌’ తర్వాత ఆయన సినిమాల్లో కనిపించలేదు. ఆయన సోదరుడు రాహుల్ దేవ్ కూడా నటుడే. రాహుల్ దేవ్ తెలుగులో ‘సింహాద్రి’, ‘సీతయ్య’, ‘అతడు’ వంటి చిత్రాల్లో నటించారు. ముకుల్ దేవ్ మరణం పట్ల సినీ పరిశ్రమలో విషాదం అలుముకుంది. పలువురు సినీ ప్రముఖులు ముకుల్ దేవ్ మరణం పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *