పవన్‌పై విమర్శంటే తేనె తుట్టెపై రాయి వేయడమే..

పాలిటిక్స్‌ (Politics)లో ట్రిక్స్ ప్లే చేయాలి తప్ప సెల్ఫ్ గోల్స్ ఉండకూడదు. వన్స్ బూమరాంగ్ అయ్యిందో ఇక సరిదిద్దుకోవడం కష్టమే. ప్రస్తుతం ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kavitha) పరిస్థితి ఇదే. సూటిగా సుత్తి లేకుండా తను చెప్పాలనుకున్నది చెబితే ఏ గోలా ఉండేది కాదు. ఒకరిని పొడగడం కోసం మరొకరిని కిందకు లాగితేనే దెబ్బ పడుతుంది. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి (YS Jagan)ని అందలం ఎక్కించాలనుకుంటే ఎక్కించేస్తే పోయేది. కానీ మధ్యలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ప్రస్తావన తీసుకొచ్చి అడ్డంగా బుక్కయ్యారు కవిత.

వాస్తవానికి పవన్‌తో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ (KTR)కు మంచి స్నేహమే ఉంది. అలాంటప్పుడు అసలు కవిత వెల్లి పవన్‌ను ఎందుకు టార్గెట్ చేశారనేది ప్రశ్నార్థకంగా మారింది. వైసీపీ అధినేత జగన్‌ తీరు నచ్చుతుందట. నచ్చొచ్చు అందులో తప్పేమీ లేదు. ఎవరి అభిమానం వారిది. కానీ నాకు ఫలానా వ్యక్తి నచ్చలేదు అని చెప్పడం అప్రస్తుతం. ఒకరిని డీగ్రేడ్ చేస్తేనే మరొకరు హైలైట్ అవుతారు అనుకోవడం తప్పు. ఈ చిన్న లాజిక్‌ను ఇంతకాలంగా రాజకీయాల్లో ఉండి చక్రం తిప్పుతున్న కవిత ఎలా మిస్ అయ్యారో తెలియకుండా ఉంది.

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సీరియస్ పొలిటీషియన్ కాదని, దురదృష్టవశాత్తు ఆయన ఉప ముఖ్యమంత్రి అయ్యారంటూ వ్యాఖ్యానించడం ఎంతవరకూ కరెక్ట్? ఒకరకంగా తేనె తుట్టెపై రాయి వేసినట్టే కదా. పవన్‌ను ఏమైనా అంటే.. జనసేన కేడర్ కానీ ఆయన అభిమానులు కానీ ఏమాత్రం ఉపేక్షించరు. వారి చరిత్రంతా తవ్వి తీసి మరీ ఏకిపారేస్తారు. రాజకీయాల్లో ఇలాంటి సెల్ఫ్ గోల్స్ అవసరమా? అనవసరంగా పవన్ ప్రస్తావన తీసుకొచ్చి ఇబ్బందుల్లో పడటమెందుకు? ఎందుకొచ్చిన తంటా అని వైసీపీ నేతలే పవన్ జోలికి వెళ్లడం లేదు. ఈ విషయమైనా గుర్తించి కామ్‌గా జగన్‌పై నాలుగు ప్రశంసలు కురిపించి ఉంటే సరిపోయేది. లిక్కర్ కేసులో జైలుకు వెళ్లిన కవితకు పవన్ గురించి మాట్లాడే రైట్ లేదని, నోరు అదుపులో పెట్టుకోవాలని ఇప్పటికే హెచ్చరికలు ప్రారంభమయ్యాయి. ఇక చూడాలి ఈ వ్యవహారం ఎంతవరకూ వెళుతుందో..

ప్రజావాణి చీదిరాల

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *