మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటించిన ‘కన్నప్ప’ మూవీ ఈ నెల 27న విడుదలకు సిద్ధమవుతోంది. ఈక్రమంలోనే చిత్ర యూనిట్ బీభత్సంగా ప్రమోషన్స్ నిర్వహిస్తోంది. దీనిలో భాగంగా నేడు (మంగళవారం) చిత్ర దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ మీడియాతో ముచ్చటించారు. సినిమాకు సంబంధించిన ఆసక్తికర విషయాలను తెలిపారు. కన్నప్ప మైథాలజీ చిత్రం కదా.. మరి ఇప్పటి జనరేషన్కు ఈ కథను ఆసక్తికరంగా ఎలా చెప్పబోతున్నారని మీడియా ప్రతినిధి ముఖేష్ను ప్రశ్నించారు. దీనికి సమాదానంగా ఆయన.. ‘కన్నప్ప’ అనేది మైథలాజీ కాదని మన హిస్టరీ అని పేర్కొన్నారు. ఓ ఘటన జరిగితే.. ఒక్కొక్కరు ఒక్కోలా చెబుతుంటారు. ఈ క్రమంలోనే కన్నప్ప అనే వ్యక్తి గురించి పూర్తిగా ఎవ్వరికీ తెలియదు. కన్నప్ప తన కంటిని శివుడికి ఇచ్చాడు. ఇదంతా మన చరిత్ర. దాన్నే చిత్రంలో చూపించామని ముఖేష్ తెలిపారు.
‘‘ఇప్పటి వరకూ నేను బుల్లితెరపై చేసినవన్నీ హై బడ్జెట్ ప్రాజెక్టులే. ‘మహా భారతం’ సీరియల్ను రూ.200 కోట్లతో తీశాం. నాకు సినిమాలేమీ కొత్త కాదు. ఇప్పటికే రెండు చిత్రాలను నిర్మించాను. బుల్లితెరైనా.. వెండితెరైనా ఒకే మైండ్సెట్తో చేశాను. విష్ణు టీం నుంచి నాకు ఒకసారి కాల్ వచ్చింది. కన్నప్ప గురించి చెప్పారు. ఆ తరువాత చాలా రోజుల పాటు కాల్ రాలేదు. అనూప్ సింగ్ ఠాకూర్ ఆచారి అమెరికా యాత్ర సినిమా చేస్తున్న సమయంలో నా గురించి అనూప్, విష్ణుకి చర్చ జరిగింది. అలా నన్ను మళ్లీ అప్రోచ్ అయ్యారు. విష్ణు నన్ను హైదరాబాద్కు రమ్మనడంతో వచ్చాను. మా ఇద్దరి మధ్య దాదాపు నాలుగు గంటల పాటు చర్చ జరిగింది. అప్పటికి నాకు కన్నప్ప గురించి అంత పెద్దగా తెలీదు. విష్ణు ఈ కథ గురించి చెప్పిన తరువాత చాలా రీసెర్చ్ చేశాను. పలు సినిమాలు చూశాను. ఆర్టికల్స్ చదివాను. ఎన్నో రిఫరెన్స్లు తీసుకున్నా. మళ్లీ మోహన్ బాబు గారు మరోసారి పిలిచారు. అప్పుడు ఈ ప్రాజెక్ట్ గురించి కూడా చర్చించుకున్నాం. అలా నన్ను ఈ చిత్రానికి ఫైనల్ చేశారు.
‘కన్నప్ప’ కోసం ప్రతీ ఒక్కరూ అద్భుతంగా పని చేశారు. అందరూ ఎంతో అంకిత భావంతో సెట్స్ మీద వర్క్ చేశారు. వారి వల్లే నా పని చాలా ఈజీగా మారిపోయింది. అక్షయ్ సర్, మోహన్లాల్ సర్, ప్రభాస్ సర్, మోహన్ బాబు గారు, విష్ణు గారు, బ్రహ్మానందం గారు ఇలా అందరితో పని చేయడం మరిచిపోలేని అనుభూతి. మోహన్ బాబు గారు ఈ వయసులోనూ ఎంతో ప్యాషనేట్గా పని చేశారు. నిర్మాతగా ఒకలా ఉండేవారు.. నటించేటప్పుడు ఇంకోలా అనిపించేవారు. మా ఆర్ట్ డైరెక్టర్ చాలా రీసెర్చ్ చేశారు. ఎన్నో మ్యూజియంలను సందర్శించారు. వెపన్స్, క్యాస్టూమ్స్ మీద చాలా పరిశోధనలు చేశాం. రెండో శతాబ్దం వాతావరణం తెరపైకి తీసుకు రావడానికి చాలా ప్రయత్నించాం. అందుకే న్యూజిలాండ్కు వెళ్లి మూవీని షూటింగ్ చేశాం.
ప్రభాస్ పాత్ర ఎంతో పవర్ ఫుల్గా ఉంటుంది. ఇందులో ఎవరి క్యారెక్టర్ కూడా అలా వచ్చి ఇలా వెళ్లేలా ఉండదు. అన్ని పాత్రలు ప్రేక్షకులపై కచ్చితంగా ప్రభావాన్ని చూపిస్తాయి. ఎవ్వరి ఫ్యాన్స్ కూడా ఈ మూవీని చూసి నిరాశచెందరు. ఇప్పటి వరకు చాలా మందికి ఈ మూవీని చూపించాం. అందరూ అద్భుతంగా ఉందని ప్రశంసలు కురిపించారు. కన్నప్పపై ఇది వరకు వచ్చిన చిత్రాల్లో కూడా లిబర్టీ తీసుకున్నారు. ఇందులో కూడా కొంత వరకు ఫిక్షనల్ పార్ట్ ఉంటుంది. ఫస్ట్ సీన్ నుంచి లాస్ట్ సీన్ వరకు ఇంటర్ లింకింగ్గా చూపించాం. శ్రీకాళహస్తి అర్చకులకు ఈ మూవీని చూపించాం. ఈ చిత్రం పూర్తయిన తరువాత అద్భుతంగా ఉందని అర్చకులు మెచ్చుకున్నారు. సెకండ్ పార్ట్ ఎప్పుడు వస్తుందని అడిగారు’’ అని ముఖేష్ కుమార్ సింగ్ వెల్లడించారు.
ప్రజావాణి చీదిరాల