JDU chief Nitish Kumar:జేడీయూ అధినేత నితీశ్ కుమార్ మొత్తానికి మహాఘట్బంధన్ను విచ్ఛిన్నం చేశారు. సీఎం పదవికి రాజీనామా చేశారు.
త్వరలోనే బీజేపీతో కలిసి మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి మళ్లీ సీఎంగా ప్రమాణం చేయనున్నారు. బిహార్లో ఆయన ఎక్కడ ఉంటే అధికారం
అక్కడ ఉంటుంది, ఆయనో సుశాసన్ బాబు,సోషలిస్టు నేత అన్న మంచి పేరు నుంచి.. అధికారం ఎక్కడ ఉంటే అక్కడికే నితీశ్ వెళ్తారు, యూటర్న్
నేత అన్న అపప్రథను నితీశ్ కొని తెచ్చుకున్నారు. కేంద్రంలో బీజేపీని గద్దె దించాలని జాతీయ స్థాయిలో ఇండియా కూటమి ఏర్పాటులో కీలకంగా
వ్యవహరించి, తానే ప్రధాని అభ్యర్థిని కావచ్చని సంకేతాలిచ్చిన ఆయన చివరికి ఇప్పుడున్న సీఎం సీటు పోకుండా అతి జాగ్రత్తపడ్డారు. నితీశ్
బిహార్లో గతంలో బీజేపీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేశారు. తర్వాత, బీజేపీని వీడి ఆర్జేడీతో కలిశారు. మహాఘట్బంధన్ పేరుతో కాంగ్రెస్, ఆర్జేడీతో
కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. బిహార్లో ఏ రాజకీయ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చినా దశాబ్ద కాలంగా నితీశే సీంగా ఉంటూ వస్తున్నారు. ఇదీ ఆయన
విలక్షణమైన ప్రత్యేకత. నితీశ్ వయస్సు 72 ఏళ్లు. ఆయన రికార్డు స్థాయిలో 9వ సారి సీఎంగా ప్రమాణం చేయబోతున్నారు.
బిహార్ భాజపా ఎమ్మెల్యేలు నీతీశ్కు ఇప్పటికే తమ మద్దతును తెలియజేస్తూ లేఖలిచ్చారు. బిహార్లో ఎన్డీయే సర్కార్ ఏర్పాటు చేయాలని
నిర్ణయించినట్లు భాజపా శాసనసభాపక్షం ప్రకటించింది. సాయంత్రం 5గంటలకు సీఎంగా నితీశ్ మరోసారి ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది.
ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి కేంద్ర మంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డాతోపాటు పలువురు బీజేపీ పెద్దలు హాజరవుతారని సమాచారం.
నితీశ్ రంగులు మార్చడంలో ఊసరవెల్లికి గట్టి పోటీ ఇస్తున్నారని కాంగ్రెస్ ఎద్దేవా చేసింది. నితీశ్ రాజీనామా తర్వాత కాంగ్రెస్ నేతలు విమర్శలు సంధించారు. నీతీశ్ రాజీనామా చేయనున్నట్లు తమకు ముందే తెలుసని పార్టీ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. ఈ విషయాన్ని తమకు ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ ముందే చెప్పారన్నారు. ఇండియా కూటమి సమైక్యతను దృష్టిలో ఉంచుకొని తాము ముందే ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదన్నారు. నీతీశ్ లాంటి ‘ఆయా రామ్.. గయా రామ్’ మనుషులు దేశంలో చాలా మంది ఉంటారని ఎద్దేవా చేశారు. బిహార్ ప్రజల అభీష్టాన్ని నితీశ్ విస్మరిస్తున్నారని, దీన్ని వారు ఎట్టిపరిస్థితుల్లో క్షమించబోరని పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ అన్నారు. రాహుల్ గాంధీ చేపట్టిన ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’ను చూసి ప్రధానమంత్రి మోదీతో పాటు ఆయన పార్టీ భాజపా భయపడుతోందన్నారు. దాని నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే ఈ నాటకీయ పరిణామాలకు తెరతీశారని వ్యాఖ్యానించారు.
సీఎం పదవికి రాజీనామా అనంతరం నితీశ్ కుమార్ మీడియాతో మాట్లాడారు.. ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చిందనే విషయాలపై క్లారిటీ ఇచ్చారు. ఏడాదిన్నర క్రితం కొత్త కూటమి ఏర్పడిందని, కానీ, ప్రస్తుతం మహాకూటమిలో పరిస్థితి సరిగా లేదని చెప్పారు. అందుకే మహాకూటమి నుంచి వైదొలిగానని అన్నారు. పార్టీ నేతల సూచన మేరకే ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపారు. ప్రస్తుత మహాకూటమి ప్రభుత్వాన్ని రద్దు చేయాలని గవర్నర్ ను కోరినట్లు నితీశ్ చెప్పారు. ఇతర పార్టీలతో కలిపి ప్రభుత్వం ఏర్పాటుకు ఆలోచన చేస్తామని నితీశ్ కుమార్ తెలిపారు. ఇండియా కూటమి బలహీనపడిందని నితీశ్ అన్నారు.