పహల్గాం ఉగ్రదాడి.. భారత్లో పెను కల్లోలమే రేపింది. ఉగ్రవాద చర్యలను ఏమాత్రం ఉపేక్షించవద్దని సామాన్యుల నుంచి ప్రముఖుల వరకూ ప్రతి ఒక్కరూ కేంద్రానికి విన్నవించారు. పాక్ దుశ్చర్యలకు అడ్డుకట్ట వేయాలని మోదీ ప్రభుత్వం కూడా గట్టిగానే ఫిక్స్ అయ్యింది. ఈ నేపథ్యంలో గత రాత్రి కీలక పరిణామం చోటుచేసుకుంది. ఉగ్రదాడికి భారత్ ప్రతీకార చర్యలను ప్రారంభించింది. ఈ ప్రతీకార చర్యలకు ‘ఆపరేషన్ సింధూర్’ అని నామకరణం చేసింది. మంగళవారం అర్ధరాత్రి 1:44 గంటలకు ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో పాకిస్థాన్లోని ఉగ్రస్థావరాలపై భారత సైన్యం మెరుపు దాడులు చేసింది.
త్రివిధ దళాలు అంటే భారత ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ బలగాలు సంయుక్తంగా ఈ ‘ఆపరేషన్ సింధూర్’లో పాల్గొన్నాయి. మిస్సైళ్లతో లక్ష్యాలపై దాడి చేసి పాక్ ఆక్రమిత కశ్మీర్తో పాటు పాకిస్థాన్లోని ఉగ్ర మౌలిక సదుపాయాలను ధ్వంసం చేశాయి. భారత్పై సీమాంతర ఉగ్రదాడులకు కుట్రపన్నినట్టుగా భారత సైన్యం గుర్తించింది. ఈ క్రమంలోనే మొత్తం తొమ్మిది స్థావరాలపై ఆర్మీ దాడులు చేపట్టింది. వాస్తవానికి నేడు (బుధవారం) దేశ వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం మాక్ డ్రిల్స్ నిర్వహించనుంది. ఈ సమయంలో ఈ దాడులను అసలు ఎవరూ ఊహించలేదు. ‘ఆపరేషన్ సింధూర్’పై దేశ వ్యాప్తంగా ప్రశంసల జల్లు కురుస్తోంది. రాజకీయ ప్రముఖులు మాత్రమే కాకుండా సామాన్యులు సైతం సోషల్ మీడియాను ‘భారత్ మాతా కీ జై’ నినాదంతో హోరెత్తిస్తున్నారు.