Operation Sindoor: పాక్‌ ఉగ్ర స్థావరాలపై భారత్ మెరుపు దాడి.. 

పహల్గాం ఉగ్రదాడి.. భారత్‌లో పెను కల్లోలమే రేపింది. ఉగ్రవాద చర్యలను ఏమాత్రం ఉపేక్షించవద్దని సామాన్యుల నుంచి ప్రముఖుల వరకూ ప్రతి ఒక్కరూ కేంద్రానికి విన్నవించారు. పాక్ దుశ్చర్యలకు అడ్డుకట్ట వేయాలని మోదీ ప్రభుత్వం కూడా గట్టిగానే ఫిక్స్ అయ్యింది. ఈ నేపథ్యంలో గత రాత్రి కీలక పరిణామం చోటుచేసుకుంది. ఉగ్రదాడికి భారత్‌ ప్రతీకార చర్యలను ప్రారంభించింది. ఈ ప్రతీకార చర్యలకు ‘ఆపరేషన్ సింధూర్’ అని నామకరణం చేసింది. మంగళవారం అర్ధరాత్రి 1:44 గంటలకు ‘ఆపరేషన్‌ సిందూర్‌’ పేరుతో పాకిస్థాన్‌లోని ఉగ్రస్థావరాలపై భారత సైన్యం మెరుపు దాడులు చేసింది.

త్రివిధ దళాలు అంటే భారత ఆర్మీ, ఎయిర్‌ ఫోర్స్‌, నేవీ బలగాలు సంయుక్తంగా ఈ ‘ఆపరేషన్ సింధూర్’లో పాల్గొన్నాయి. మిస్సైళ్లతో లక్ష్యాలపై దాడి చేసి పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌తో పాటు పాకిస్థాన్‌లోని ఉగ్ర మౌలిక సదుపాయాలను ధ్వంసం చేశాయి. భారత్‌పై సీమాంతర ఉగ్రదాడులకు కుట్రపన్నినట్టుగా భారత సైన్యం గుర్తించింది. ఈ క్రమంలోనే మొత్తం తొమ్మిది స్థావరాలపై ఆర్మీ దాడులు చేపట్టింది. వాస్తవానికి నేడు (బుధవారం) దేశ వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం మాక్‌ డ్రిల్స్‌ నిర్వహించనుంది. ఈ సమయంలో ఈ దాడులను అసలు ఎవరూ ఊహించలేదు. ‘ఆపరేషన్ సింధూర్’పై దేశ వ్యాప్తంగా ప్రశంసల జల్లు కురుస్తోంది. రాజకీయ ప్రముఖులు మాత్రమే కాకుండా సామాన్యులు సైతం సోషల్ మీడియాను ‘భారత్ మాతా కీ జై’ నినాదంతో హోరెత్తిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *