ప్రభాస్ కృష్ణుడు.. నేను ఆయనకు కర్ణుడిని..

విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ జూన్ 27న విడుదల కాబోతోంది. అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ల మీద డా. ఎం. మోహన్ బాబు నిర్మాణంలో ముఖేష్ కుమార్ సింగ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. విడుదల తేదీ దగ్గర పడుతున్న క్రమంలో శనివారం నాడు ‘కన్నప్ప’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మోహన్ బాబు మాట్లాడుతూ .. ‘ఆ భగవంతుడి ఆశీస్సులతోనే ‘కన్నప్ప’ చిత్రం ప్రారంభమైంది. అంతా ఆ దేవుడి దయ వల్లే జరుగుతుంది. ఆడియెన్స్ ప్రేమ, ఆ దేవుడు ఆశీస్సులు నా బిడ్డ విష్ణుకి ఉండాలని కోరుకుంటున్నాను. ఆ పరమేశ్వరుడు ఇచ్చిన శక్తితోనే ఈ చిత్రాన్ని తీశాం. ఈ మూవీలోని ప్రతీ పాత్ర హీరోలానే ఉంటుంది. ఇందులో నటించిన ప్రతీ ఒక్కరికీ నేను ఎంతో రుణపడి ఉంటాను. నేను మహా భారతం సీరియల్‌ని ఎన్నో సార్లు చూశాను. ‘కన్నప్ప’ సినిమాను ఆయన అద్భుతంగా తెరకెక్కించారు. రథ సారథిగా ముందుకు తీసుకెళ్లారు. ముఖేష్ రిషి కెరీర్ ఆరంభం నుంచీ మా ఫ్యామిలీతో ఉంటున్నారు’’ అని అన్నారు.

విష్ణు మంచు మాట్లాడుతూ .. ‘‘కన్నప్ప’ విష్ణు సినిమా కాదు. ఇది కన్నప్ప సినిమా. ఎడిటింగ్ టేబుల్ మీద ఈ చిత్రాన్ని చూసినప్పుడు వావ్ అనిపించింది. ‘కన్నప్ప’ అనేది శివానుగ్రహంతోనే జరిగింది. ఈ ప్రయాణంలో నాకు విజయ్, వినయ్ వెన్నంటే ఉన్నారు. 2017లో స్టీఫెన్ దేవస్సీని కలిశాను. ఈ కథ కోసం పరుచూరి గోపాలకృష్ణ గారు చాలా కష్టపడ్డారు. శివ బాలాజీ చేసిన సాయాన్ని బయటకు చెప్పలేను. మోహన్‌లాల్ గారి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. మా కోసం వచ్చిన అక్షయ్ కుమార్ గారికి థాంక్స్. శరత్ కుమార్ గారితో పని చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటూ ఉన్నాను. ఈ చిత్రం ప్రారంభం కాక ముందే బ్రహ్మానందం గారు దీవెనలు అందిస్తూ ఉన్నారు. నా జీవితంలో కృష్ణుడిగా ప్రభాస్ ఉంటారు. అసలు ఈ చిత్రాన్ని చేయాల్సిన అవసరం ప్రభాస్‌కి లేదు. నాన్న గారి మీదున్న గౌరవంతోనే ప్రభాస్ ఈ మూవీని చేశారు. స్టార్‌గా కంటే.. ప్రభాస్ మానవత్వం ఇంకెంతో గొప్పగా ఉంటుంది. కొంత డబ్బు, పేరు వచ్చినా అంతా మారిపోతారు. కానీ ప్రభాస్ మాత్రం ఇంకా అలానే ఒదిగి ఉంటారు. నాకు ప్రభాస్ కృష్ణుడు అయితే.. నేను మాత్రం ప్రభాస్‌కి కర్ణుడిని’’ అని అన్నారు.

ముఖేష్ కుమార్ సింగ్ మాట్లాడుతూ .. ‘‘జన్మభూమిని, కర్మభూమిని మర్చిపోకూడదు. నాకు హైదరాబాద్‌ కర్మభూమిలాంటిది. మోహన్ బాబు గారు నన్ను నమ్మి ఇక్కడకు తీసుకు వచ్చారు. ‘కన్నప్ప’ను నాకు ఇచ్చినందుకు మోహన్ బాబు గారికి థాంక్స్. విష్ణు రేర్ యాక్టర్. ఒకటి, రెండు టేక్స్‌లోనే అన్ని సీన్లను చేసేశారు. విష్ణు ఓ గొప్ప హీరోనే కాదు.. గొప్ప కొడుకు. అరియానా, వివియానా, అవ్రామ్ ఈ చిత్రంలో నటించారు. ప్రభాస్ పాత్ర గురించి ఇప్పుడు నేను ఏమీ చెప్పను. ఏ పాత్ర కూడా హాయ్, బై అని చెప్పడానికి రాదు. ప్రభాస్ గారు చాలా హంబుల్, సింపుల్ పర్సన్’’ అని అన్నారు. బ్రహ్మానందం మాట్లాడుతూ .. ‘‘కన్నప్ప’ సినిమాను శివ తత్త్వం వ్యాప్తి చేయడానికి తీశారు. డబ్బు కోసం మోహన్ బాబు గారు ఈ మూవీని తీయలేదు. అందరినీ ఒకేలా చూసే ఆ శివుడి గురించి ప్రపంచానికి చెప్పేందుకు మోహన్ బాబు గారు, విష్ణు బాబు ఈ మూవీని ముందుకు తీసుకు వస్తున్నారు. ఈ మూవీని ఎవ్వరూ అడ్డుకోకండి. ఇదొక గొప్ప చిత్రం అవుతుంది. కన్నప్ప ఒక చరిత్ర అవుతుంది’’ అని అన్నారు.

శరత్ కుమార్ మాట్లాడుతూ .. ‘నేను ఎంతో మాట్లాడాలని ప్రిపేర్ అయ్యాను. కానీ బ్రహ్మానందం గారు అంతా మాట్లాడేశారు. మోహన్ బాబు నాకు పెద్దన్నయ్యలాంటి వారు. విష్ణు నాకు పుత్రసమానుడు. ‘కన్నప్ప’ గురించి నేను చెప్పడం కాదు.. జూన్ 27న ఆడియెన్స్ అందరికీ తెలుస్తుంది. ఈ మూవీని తీయమని ఆ శివుడే ఈ మోహన్ బాబు గారికి చెప్పి ఉంటారు. ఆయన అనుగ్రహం వల్లే మేం అంతా ఈ చిత్రానికి వచ్చినట్టు అనిపిస్తుంది. శివాజ్ఞతోనే ఈ చిత్రం ఇక్కడి వరకు వచ్చింది’ అని అన్నారు.

మధుబాల మాట్లాడుతూ .. ‘‘ఇంత పెద్ద ప్రపంచం, విశ్వంలో మనం చిన్న అణువులాంటి వాళ్లం. ఇంత పెద్ద కన్నప్ప ప్రపంచంలో నేను ఓ అణువులాంటిదాన్ని. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన మోహన్ బాబు గారికి, విష్ణు గారికి థాంక్స్’’ అని అన్నారు. ముఖేష్ రిషి మాట్లాడుతూ .. ‘‘కన్నప్ప’ నాకు ఎంతో ప్రత్యేకం. ఈ మూవీని తీయడం, చేయడం అంత సులభం కాదు. ఎంతో సంకల్ప బలం ఉంటే కానీ ఈ చిత్రాన్ని తీయలేరు. మోహన్ బాబు గారు, విష్ణు గారి వల్లే ఈ మూవీ ఈ స్థాయికి వచ్చింది. జూన్ 27న రాబోతోన్న ‘కన్నప్ప’ని, అందులో ప్రభాస్‌ని చూసి అందరూ ఎంజాయ్ చేస్తారు’’ అని అన్నారు.

ప్రజావాణి చీదిరాల

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *