HMDA Siva Balakrishnan:శివబాలకృష్ణ.. అక్రమాస్తుల కేసులో అరెస్టయిన హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్. బహుశా.. ఈ మధ్య కాలంలో తెలంగాణలో ఇంతలా అక్రమాస్తులు బయటపడ్డ అధికారి మరెవరూ లేరేమో! హెచ్ఎండీఏ డైరెక్టర్ గా, రెరా మాజీ కార్యదర్శిగా అతని అక్రమ సంపాదన చూసి ఏసీబీ అధికారులే విస్తుపోతున్నారు. శివబాలకృష్ణపై కేసు నమోదు చేసి ఏసీబీ చేస్తున్న విచారణలో ఆయన లీలలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. వందల కోట్ల ఆస్తులు కూడగట్టుకోవడంలో తనకు సహకరించిన కొందరు అధికారుల పేర్లను విచారణలో అతడు చెప్పినట్లు తెలుస్తోంది. శనివారం నాటి విచారణలో శివబాలకృష్ణను బినామీల బ్యాంకు ఖాతాలు, లాకర్లపై ఏసీబీ అధికారులు ప్రశ్నించినట్లు సమాచారం.
రెరా కార్యాలయం బీరువాలో శుక్రవారం బయటపడ్డ భూముల పత్రాలు, బినామీ పేరుతో ఉన్న బ్యాంకు లాకర్లలో బంగారం గుర్తించారు. వీటి గురించి ప్రస్తావిస్తూ భూముల కొనుగోలుకు డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? వారికి ఎలాంటి లబ్ది చేకూర్చారు? అని వివరాలను రాబట్టే ప్రయత్నం చేసినట్లు సమాచారం.
ఆయన పేరు మీద పెద్ద ఎత్తున ఆస్తులు ఉన్నట్లు గుర్తించారు
బాలకృష్ణ సోదరుడు శివ సునీల్ కుమార్ను కూడా ఏసీబీ కార్యాలయానికి పిలిపించి.. అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ విచారణలో సమాధానాలు చెప్పలేక మౌనంగా ఉండిపోయారని తెలియవచ్చింది. మొత్తంగా బాలకృష్ణ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసినట్లు అధికారులు తేల్చారు. ఆయన పేరు మీద పెద్ద ఎత్తున ఆస్తులు ఉన్నట్లు గుర్తించారు. బాలకృష్ణకు ఉన్న కాసుల కక్కుర్తిపై అధికారులు విచారణలో కొత్త విషయాలు బయట పడుతుండడంతో షాక్కు గురవుతున్నారు. రెరా ఆఫీస్ నాలుగో అంతస్తులోని బాలకృష్ణ ఛాంబర్లో లాకర్ను అధికారులు బ్రేక్ చేశారు. రూ.12 లక్షలు విలువ చేసే చందనపు చీరలు, రూ.20 లక్షలకు పైగా నగదు లభ్యమైంది. వాటితోపాటు బాలకృష్ణ వైవాహిక జీవితానికి సంబంధించిన పలు ఫొటో ఆల్బమ్లను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కీలకమైన భూముల పాసు పుస్తకాలను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
సునీల్, అతడి భార్య పేరుతో భారీగా ఆస్తులను గుర్తించారు. కొడకండ్ల, మోత్కూరు, గజ్వేల్, పాలకుర్తి, జనగామ,రిమ్మనగూడెం, బీబీనగర్లో సునీల్ భార్య పేరుతో భూములున్నట్టు గుర్తించారు. మరో ఇద్దరు బినామీలను కూడా గుర్తించిన అధికారులు.. వారికి నోటీసులు జారీచేశారు. ఇప్పుడు ఈకేసు ఒక్క శివబాలకృష్ణతో పోవడం లేదు. ఆయన దగ్గర పని చేసే అధికారుల మెడకి కూడా చుట్టుకుంటోంది. ఆయనతో పని చేసే అధికారులను కూడా ఏసీబీ అధికారులు విచారించనున్నారు. దీనిపై ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. మొదటి నుంచి ఆయనతో కలిసి పని చేసే ఉద్యోగులందరికీ నోటీసులు ఇచ్చారు. వారిని విచారించి ఇంకా పూర్తి వివరాలు రాబట్టనున్నారు. వారిని విచారిస్తే ఇంకా ఎన్ని సంచలనాలు బయటకు వస్తాయో అన్న ఆసక్తి నెలకొంది. భారీగా అక్రమాలకు పాల్పడిన శివబాలకృష్ణపై ఇప్పటికే సస్పెన్షన్ వేటు పడిన విషయం తెలిసిందే.
అయితే ఆయన్ని సర్వీస్ నుంచే తొలగించే అంశాన్నిప్రభుత్వం పరిశీలిస్తోందట. దీనికి సంబంధించిన న్యాయ పరమైన సలహాలు తీసుకుంటున్నట్టు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
ణీ ఎన్నాళ్లకు గుర్తొచ్చాడు మోదీ..?