హీరో నిఖిల్ సినిమా షూటింగ్లో ప్రమాదం చోటుచేసుకుంది. ప్రస్తుతం నిఖిల్ ‘ది ఇండియా హౌస్’ షూటింగ్లో ఉన్నాడు. ఈ క్రమంలోనే ఈ సినిమా కోసం శంషాబాద్ సమీపంలో సెట్ వేశారు. ఇక్కడ సముద్రం సీన్స్ తీస్తున్నారు. ఈ క్రమంలోనే భారీ వాటర్ ట్యాంక్ను ఏర్పాటు చేశారు. అది కాస్త పగిలిపోవడంతో ఒక్కసారిగా సెట్లోకి వరద దూసుకొచ్చింది. కొంతమంది సిబ్బందికి స్వల్ప గాయాలవగా.. వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్సను అందించారు. ఒక్కసారిగా వరద రావడంతో సామగ్రి నీటిలో తడిచింది.
ఈ ఘటనకు సంబంధించి దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. స్టార్ హీరో రామ్ చరణ్ సమర్పణలో నిఖిల్, సయీ మంజ్రేకర్ జంటగా ‘ది ఇండియా హౌస్’ రూపొందుతోంది. రామ్ వంశీకృష్ణ రూపొందిస్తున్న ఈ చిత్రంలో అనుపమ్ ఖేర్ కీలక పాత్ర పోషిస్తున్నారు. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, వి మెగా పిక్చర్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం పిరియాడిక్ మూవీగా రూపొందుతోంది. 1905 నేపథ్యంలో ప్రేమ, విప్లవం అంశాలతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తోంది.