Electoral Bonds :
సుప్రీంకోర్టు చర్యతో బయటపడుతున్న బాగోతం
ఎలక్టోరల్ బాండ్ల గుట్టు అంతా బయటకు వచ్చింది. కానీ, తరువాత ఏం జరుగుతుందన్నది మాత్రం ఇప్పుడు ఎవరికీ తెలియదు. రాజకీయ పార్టీలకు వచ్చిన విరాళాలు చూస్తే అత్యధిక క్విడ్ ప్రో కో (బాండ్లు కొనుక్కో.. దందా పుచ్చుకో) అని స్పష్టమవుతోంది.
అధికారంలో ఉన్న పార్టీలు ఆయా సంస్థలకు మేలు చేసి అందుబదులుగా ఎలక్టోరల్ బాండ్ల పేరుతో విరాళాలు తీసుకున్నాయన్నది స్పష్టమైన నిజం.
ఈ విషయంలో బీజేపీ అతి పెద్ద అనుమానిత పార్టీ. ఎందుకంటే ఆ పార్టీకే అత్యధిక విరాళాలు రావడం.. కాంట్రాక్టులు, కొన్ని సంస్థలపై దర్యాప్తు సంస్థల దాడుల తర్వాత విరాళాలు రావడం, ఆ కేసులు మళ్లీ బయటకు రాకపోవడం వంటివి ఉన్నాయి. ఇక తృణమూల్, డీఎంకే కూడా అంతే.
వైసీపీ ఆర్థిక వ్యవహారాలు ఇంకా ఘోరంగా ఉన్నాయి. గేమింగ్ సంస్థ అత్యధికంగా వైసీపీకి విరాళం ఇచ్చింది ?. సగానికిపైగా .. ఈ ఐదేళ్లలో రెన్యూవబుల్ ఎనర్జీ పేరుతో చేసుకున్న ఒప్పందాలకు తగ్గట్లుగా పెద్ద ఎత్తున భూములు ఇచ్చి తమ ఖాతాలో డబ్బులు వేయించుకున్నారు.
టీడీపీకి షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ కూడా రూ. 40 కోట్లు ఇచ్చింది. సీఐడీ చెప్పినట్లుగా… స్కిల్ కేసులో ఉన్న ఒక్క కంపెనీ కూడా టీడీపీకి రూపాయి ఇవ్వలేదు.
ఆ పార్టీ, ఈ పార్టీ అని లేదు . అన్ని పార్టీలు ఎలక్టోరల్ బాండ్లను దుర్వినియోగం చేశాయి. తమ అవినీతికి రాచబాట వేసుకున్నాయి. ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం చేస్తుందన్నది కీలకం. వివరాలన్నీ బహిర్గతమయ్యాయి కాబట్టి.. ప్రజలదే నిర్ణయమంటారా లేకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుందా అనేది ఆసక్తికరం.
ఎవరైనా బాండ్లను కొనుక్కోవచ్చు..
దేశంలోని రాజకీయ పార్టీలకు విరాళాలు అందించేందుకు ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఓ విధంగా ఈ బాండ్లను ప్రామిసరీ నోట్లుగా కూడా భావించొచ్చు. దేశంలోని పౌరులు లేదా సంస్థలు వీటిని అధీకృత బ్యాంకు నుంచి కొనుగోలు చేసి, వారికి నచ్చిన రాజకీయ పార్టీకి విరాళంగా అందజేస్తారు..
ఈ ఎలక్టోరల్ బాండ్ పథకాన్ని భారత ప్రభుత్వం 2017లో ప్రవేశపెట్టింది. 2018లో అమలులోకి వచ్చింది.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ ఎలక్టోరల్ బాండ్లను జారీ చేస్తుంది. వీటిని జారీ చేయడం ద్వారా వచ్చిన నగదును సంబంధిత రాజకీయ పార్టీలకు అందజేస్తుంది.
కేవైసీ వివరాలు నమోదు చేసుకుని, బ్యాంకు అకౌంట్ కలిగి ఉన్నవారు ఈ బాండ్లను కొనుగోలు చేయవచ్చు. దాతల వివరాలు ఈ బాండ్లపై ఉండవు.
రూ.1000 నుంచి మొదలుకొని రూ.10 వేలు, రూ.1 లక్ష, రూ. 10 లక్షలు, రూ.1 కోటి వరకు స్టేట్ బ్యాంకుకు సంబంధించిన నిర్ణీత బ్రాంచుల నుంచి కొనుగోలు చేయొచ్చు. ఈ బాండ్ల కాలపరిమితి 15 రోజులు మాత్రమే.
రిప్రజెంటేటివ్ ఆఫ్ పీపుల్ యాక్ట్ (ఆర్పీఏ) ప్రకారం నమోదైన రాజకీయ పార్టీలకు మాత్రమే ఈ బాండ్ల నుంచి నిధులు పొందే అర్హత ఉంటుంది.
సాధారణ లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల్లో కనీసం 1% ఓటు బ్యాంకు పొందిన రాజకీయ పార్టీలకు మాత్రమే ఇలా ఎలక్టోరల్ బాండ్ల ద్వారా విరాళాలు అందించేందుకు అవకాశం ఉంటుంది.
ఈ బాండ్లను ఏడాదిలో జనవరి, ఏప్రిల్, జులై, అక్టోబర్ నెలల్లో అందుబాటులో ఉంచుతారు. దీనితోపాటు లోక్సభ ఎన్నికల సమయంలో మరో 30 రోజులు అదనపు గడువును ఇస్తారు.
ఈ పథకాన్ని ప్రవేశపెడుతున్న సమయంలో ఎన్నికల బాండ్ల పథకంతో రాజకీయ పార్టీలకు నిధులు అందే ప్రక్రియ పారదర్శకంగా మారుతుందని భారత ప్రభుత్వం పేర్కొంది.
కానీ, ఆ బాండ్లను కొని, విరాళాలుగా అందించే వారి వివరాలు గోప్యంగా ఉంచడం పట్ల అభ్యంతరాలు మొదలయ్యాయి.
పథకం ప్రవేశ పెట్టిన నాటి నుంచే విమర్శలు మొదలయ్యాయి. విరాళాలు అందించే వారి వివరాలు గోప్యంగా ఉండడం వలన నల్లధనానికి ఆస్కారం ఉందని, కార్పొరేట్ సంస్థలు పెద్ద మొత్తంలో డబ్బును గోప్యంగా విరాళంగా అందజేయడానికే ఈ పథకాన్ని ప్రవేశపెట్టారని విమర్శలు ఉన్నాయి.
ఈ పథకాన్ని సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో రెండు పిటీషన్లు దాఖలయ్యాయి.
మొదటి పిటిషన్ను 2017లో రాజ్యాంగ సంస్కరణల రంగంలో ఉన్న ప్రభుత్వేతర సంస్థ అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రీఫార్మ్స్(ఏడీఆర్), కామన్ కాజ్ స్వచ్ఛంద సంస్థలు సంయుక్తంగా దాఖలు చేస్తే, రెండో పిటీషన్ను 2018లో సీపీఐ(ఎం) దాఖలు చేసింది.
ఈ పథకం రాజకీయ పార్టీలకు అపరిమిత విరాళాలు, దేశీయ, విదేశీ సంస్థల నుంచి గోప్యతతో, భారీగా నిధుల ప్రవాహానికి గేట్లు తెరిచేలా ఉందని, దీని వలన భారీ స్థాయిలో ఎన్నికల అవినీతిని చట్టబద్ధం చేసినట్లు అవుతుందని పిటీషన్లలో పేర్కొన్నారు.
ఎన్నికల బాండ్లలో దాత వివరాలను గోప్యంగా ఉంచడం అనేది రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(a) కల్పించిన పౌరుల హక్కును ఉల్లంఘిస్తుందని, ఈ హక్కు పరిధుల విషయమై గతంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పులను ఉటంకిస్తూ పిటీషన్ వేశారు.
భారతదేశంలో సబ్సిడరీలు కలిగిన విదేశీ సంస్థలు కూడా విరాళాలు అందించేందుకు వీలుగా FCRA లో కూడా సవరణలు చేయడం పట్ల కూడా అభ్యంతరాలు ఉన్నాయి.
దీని వలన విదేశీ లాబీయిస్టులు తమ సొంత అజెండాతో, భారత రాజకీయాలు, ప్రజాస్వామ్యంలో జోక్యం చేసుకుంటాయరది వారి వాదన.
మరోవైపు కంపెనీలు తమ రాజకీయ విరాళాల వివరాలను బ్యాలెన్స్ షీట్లో పేర్కొనాల్సిన అవసరం లేకుండా కంపెనీల చట్టం 2013లో కూడా సవరణలు తీసుకురావడం పట్ల అభ్యంతరాలను తెలిపారు పిటిషనర్లు.
ఈ సవరణ వలన రాజకీయ నిధుల్లో అపారదర్శకత పెరగడంతోపాటు ఆ సంస్థలకు ప్రయోజనాలను చేకూర్చేలా సదరు రాజకీయ పార్టీలను ప్రభావితం చేసే అవకాశం ఉందని పిటీషనర్లు అభ్యంతరాలను తెలిపారు.
ఈ ఎన్నికల బాండ్ల పథకాన్ని బడ్జెట్లో ఉంచారు. అయితే దీనిని మనీబిల్గా ప్రవేశపెట్టడం వలన, ఇందులో మార్పుల చేయడానికి రాజ్యసభకు వీలుపడదు.
దీనిపై కూడా అభ్యంతరాలు లేవనెత్తారు.
ప్రభుత్వానికి రాజ్యసభలో ఎక్కువ బలం లేనందున, మనీబిల్ కింద ప్రవేశపెడితే, సులభంగా ఆమోదం పొందవచ్చన్న ఉద్దేశంతోనే ఇలా చేశారని విమర్శలు ఉన్నాయి.
అయితే ఎన్నికల బాండ్ల పథకాన్ని మనీ బిల్ కింద అమోదించొచ్చా? అనే ప్రశ్నను సుప్రీం కోర్టు ప్రస్తుతం పరిగణలోకి తీసుకోలేదు.
Also Read This Article : మలేషియాలో టాలీవుడ్ వేడుక