ప్రభాస్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న కామెడీ ఎంటర్టైనర్ ‘రాజాసాబ్’. ఈ సినిమా డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే తాజాగా టీజర్ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్లో డైరెక్టర్ మారుతి సినిమా గురించి, ప్రభాస్ గురించి చాలా ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ‘‘ఒకరోజు యూవీ వంశీ పిలిచి ప్రభాస్తో మూవీ చేస్తావా అన్నాడు. అంతకంటే ఇంకేం కావాలి అని చెప్పాను. ముంబై వెళ్లి ప్రభాస్ ను కలువు అని పంపించాడు. ప్రభాస్ గారిని కలవడం అంటే దేవుడిని కలిసినట్లు భావించా. అలాంటి ప్రభాస్ గారు నన్ను ఎంతో ప్రేమగా రిసీవ్ చేసుకుని మాట్లాడారు. తనను డార్లింగ్ అని పిలువు అన్నారు. ‘మీ ప్రేమకథా చిత్రమ్, భలే భలే మగాడివోయ్’ మూవీస్ ఇష్టం. అలాంటి సినిమా చేద్దామని ప్రభాస్ గారు నాతో చెప్పారు. నేను ఒక లైన్ గా కథ చెప్పా.
ఆ తర్వాత నేను గోపీచంద్తో చేసిన పక్కా కమర్షియల్ మూవీ అంతగా ఆదరణ పొందలేదు. ఆ టైమ్ లో నేను ప్రభాస్ గారితో మూవీ చేయడం కరెక్టేనా, ఆయన భారీ పాన్ ఇండియా లైనప్ లో ఉన్నారు అని సందేహిస్తూ ఆ విషయాన్ని యూవీ వంశీకి చెప్పాను. ఆయన సరే ఆలోచించు అన్నారు. మనం తర్వాత సినిమా చేద్దామని ప్రభాస్ గారికి చెప్పాలని ఫిక్స్ అయ్యా. ఇంతలో ఆయనే ఫోన్ చేసి మీరు చెప్పిన స్టోరీలో ఈ పాయింట్స్ చాలా బాగున్నాయి అంటూ చెప్పడం ప్రారంభించారు. ఈయనకు ఇంత బాగా కథ ఎగ్జైట్ చేసినప్పుడు మనం వెనకడుగు వేయడం ఎందుకు అనిపించింది. “రాజా సాబ్” ను ఒక ఛాలెంజ్ గా తీసుకుని సినిమా చేయాలని నిర్ణయించుకున్నాను. పక్కా కమర్షియల్ రిజల్ట్ తర్వాత మా కాంబోలో మూవీ అనుకున్న ప్రొడ్యూసర్ ఇది వర్కవుట్ కాదేమో అని డ్రాప్ అయ్యారు. కానీ అలాంటి టైమ్ లో నాకు సపోర్ట్ గా నిలిచిన ఒకే ఒక పర్సన్ డార్లింగ్ ప్రభాస్ గారు.
“రాజా సాబ్” అనౌన్స్ చేశాక మీ ఫ్యాన్స్ తో పాటు అందరికీ చాలా సందేహాలు ఉండేవి. ప్రభాస్ కు ఒక ఇమేజ్ ఉంది. ఆయన కామెడీ ఎలా చేస్తాడు అని డౌట్స్ ఎక్స్ ప్రెస్ చేశారు. మా ఇంట్లో వాళ్లు కూడా ఏంటీ నువ్వు ప్రభాస్ తో సినిమా చేస్తున్నావా అనేవారు. ఎందుకు ఈ కథ రాయలేను అని గట్టిగా నిర్ణయించుకుని చేసిన స్క్రిప్ట్ ఇది. మారుతితో సినిమా అవసరమా ఈ టైమ్ లో అని ఎంతోమంది అన్నా ప్రభాస్ గారు గట్టిగా నిలబడ్డారు. నేను ఈ మూవీ బాగా చేయగలను అని నమ్మారు. నిన్న రాత్రి కూడా అరగంట టీజర్ గురించి మాట్లాడారు. హను రాఘవపూడికి టీజర్ చూపించా చాలా బాగుందని అన్నారు అంటూ హ్యాపీగా చెప్పారు. ఫ్యాన్స్ సోషల్ మీడియాలో రాజా సాబ్ గురించి చేసే పోస్ట్ లు ప్రభాస్ గారికి పంపిస్తుంటా. అభిమానులపై గుండెల నిండా ప్రేమ నింపుకున్నారు ప్రభాస్ గారు. మీరు ఆయనను ఎంత ప్రేమిస్తున్నారో అంతకంటే వెయ్యి రెట్లు మిమ్మల్ని ప్రభాస్ గారు ప్రేమిస్తున్నారు.
మిమ్మల్ని ఆయన నేరుగా కలవకపోవచ్చు కానీ మీకు బెస్ట్ మూవీస్ ఇచ్చేందుకు రాత్రీ పగలు ఎంత తపన పడతారో కష్టపడతారో నేను కళ్లారా చూశాను. సినిమాకు సంబంధించి ప్రతిదీ ఎలా వస్తుందో అడిగి తెలుసుకుంటారు. మన ఫ్యాన్స్ వండర్ ఫుల్ ఫ్యాన్స్ డార్లింగ్ వాళ్లకు మంచి మూవీ ఇవ్వాలని ప్రభాస్ గారు అంటుంటారు. ఈ సినిమా కోసం ప్రభాస్ గారికి ముగ్గురు హీరోయిన్స్ ను పెట్టాం. గతంలో ఆయన చేసిన కల్కి, సలార్, ఆదిపురుష్ లో హీరోయిన్స్ తో ఇంటరాక్షన్ తక్కువ. ఈసారి వింటేజ్ ప్రభాస్ గారిని, బుజ్జిగాడి స్టైల్ లో పాన్ ఇండియా మూవీకి ప్రెజెంట్ చేద్దామని ఫిక్స్ అయ్యాం. టీజర్ మిమ్మల్ని ఇంతలా ఆకట్టుకుంది. రేపు ట్రైలర్, మూవీ ఎలా ఉంటుందో మీరు ఊహించలేరు. మీరు ప్రభాస్ గారిని ఎలా చూడాలని అనుకుంటున్నారో అలా చూపించబోతున్నాం. ప్రభాస్ గారిలో ఒక స్పెషల్ కామెడీ టైమింగ్ ఉంటుంది.
టైమింగ్ ను ఈ మూవీలో ఎంజాయ్ చేస్తారు. ప్రభాస్ గారికి ముగ్గురు హీరోయిన్స్ తో ఒక కలర్ ఫుల్ సాంగ్ ఉంటుంది, అలాగే ఇంట్రడక్షన్ సాంగ్ ఉంటుంది. ఆయన డ్యాన్సులను కూడా మీరంతా ఎంజాయ్ చేయబోతున్నారు. ప్రేక్షకులు ఫ్యామిలీ అంతా కలిసి రాజా సాబ్ చిత్రాన్ని ఆస్వాదిస్తారు. ఈ ప్రాజెక్ట్ ఇంత బాగా వచ్చిందంటే ప్రభాస్ గారి తర్వాత విశ్వప్రసాద్ గారు కారణం. ఆయన ఈ మూవీని నమ్మి గ్రేట్ ప్రాడక్ట్ తీసుకొద్దాం అంటూ ఖర్చుకు వెనకాడకుండా ప్రొడ్యూస్ చేస్తున్నారు. కొంత షూటింగ్, సాంగ్స్ బ్యాలెన్స్ ఉంది’’ అన్నారు.