దర్శకుడు ఏఎస్ రవికుమార్ చౌదరి హఠాన్మరణం పాలయ్యారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రవికుమార్ మంగళవారం రాత్రి (జూన్ 10) గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన మరణం గురించి తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. కొంతకాలంగా రవి కుమార్ ఫ్యామిలీ గొడవల కారణంగా తన కుటుంబానికి దూరంగా ఉంటున్నారని తెలుస్తోంది. దీంతో పాటు రవికుమార్కు ఈ మధ్య కాలంలో పెద్దగా సక్సెస్లు కూడా లేకపోవడంతో ఆయన ఒత్తిడిలో ఉన్నారని సమాచారం.
ఈ క్రమంలోనే ఆయన మద్యానికి కూడా బానిస అయ్యారని తెలుస్తోంది. గోపీచంద్ హీరోగా వచ్చిన ‘యజ్ఞం’ సినిమాతో దర్శకుడిగా ఏఎస్ రవికుమార్ ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. అనంతరం నందమూరి బాలకృష్ణతో ‘వీరభద్ర’ చిత్రాన్ని రూపొందించారు. ఆ తరువాత సాయి దుర్గా తేజ్, నితిన్, రాజ్ తరుణ్ వంటి యంగ్ హీరోలతో సినిమాలు రూపొందించారు. సాయి దుర్గా తేజ్తో ‘పిల్లా నువ్వు లేని జీవితం’ తర్వాత ఆయన కెరీర్లో హిట్స్ అయితే ఏమీ లేవు. వరుస ఫ్లాప్లతో రవికుమార్ మానసికంగా కుంగిపోయినట్టు తెలుస్తోంది. దీంతో ఆయన అనారోగ్యంతో కొంతకాలంగా బాధపడుతున్నారు.