Pithapuram Pawan kalyan :
రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేయకుండా వ్యూహం
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను వైసీపీ అధ్యక్షుడు, ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి టార్గెట్ చేశారు. వైసీపీని గద్దె దించుతానని, ప్రతిపక్ష ఓట్లు చీలనివ్వనని టీడీపీ, బీజేపీతో కలిసి పొత్తు కుదిరేలా చేసిన పవన్ ను రాజకీయంగా కోలుకోలేని దెబ్బ కొట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
2019 ఎన్నికల్లో పోటీ చేసిన రెండు చోట్లా ఓడిన పవన్ కల్యాణ్ ను ఈసారి పోటీ చేస్తున్న పిఠాపురంలో మరోసారి ఓడించి ఆయన రాజకీయ జీవితానికి ముగింపు పలికేలా చేయాలన్న వ్యూహంతో ముందుకెళ్తున్నారు. ఇందుకోసం జగన్ పక్కా స్కెచ్ వేశారు.
గత ఎన్నికల్లో గాజువాక, భీవవరం నియోజకవర్గాల్లో పోటీ చేసి ఓడిపోయిన పవన్ కల్యాణ్ ఈసారి పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ఆయన ప్రకటన చేసిన క్షణం నుంచే ఆయనను ఓడించేందుకు వైసీపీ వ్యూహాలు రచిస్తోంది. నిజానికి చూస్తే ఇప్పటికి ఏడు నెలల క్రితమే పవన్ పిఠాపురంలో యాత్ర చేస్తూ కీలక ప్రసంగం చేశారు.
ఈ సందర్భంగా ఆయన ఆనాడు చూపించిన ఫోకస్ ని అంచనా వేసిన వైసీపీ నేతలు పవన్ అక్కడే పోటీ చేస్తారని భావించారు. ఆనాటి నుంచే ఆ నియోజకవర్గంపై ద్రుష్టి పెట్టారు.జనసేన అధినేతగా ఉన్న పవన్ కల్యాణ్.. తన పార్టీ అభ్యర్థుల తరఫునే కాకుండా.. కూటమిలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ, బీజేపీ అభ్యర్థుల తరఫున కూడా ప్రచారం చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం ఆయన రాష్ట్ర వ్యాప్తంగా తిరగాల్సి ఉంటుంది.
కానీ, ఆయనను పిఠాపురం లోనే కట్టడి చేయాలని వైసీపీ స్కెచ్ వేసింది. దీని వల్ల పవన్ పూర్తిగా పిఠాపురానికే పరిమితం అవుతారని లెక్కలు వేస్తోంది. కాకినాడ ఎంపీగా ఉన్న వంగా గీతను పిఠాపురంలో పోటీ చేయించడం వెనక వ్యూహం కూడా ఇదేనని అంటున్నారు.
ఎక్కడికక్కడ ఇన్ చార్జుల నియామకం..
పవన్ ను కట్టడి చేయడంలో భాగంగా పిఠాపురం నియోజకవర్గం మొత్తం ఎక్కడికక్కడ ఇన్ చార్జులను వైసీపీ నియమిస్తోంది. ప్రస్తుతం ఈ నియోజకవర్గం మొత్తం బాధ్యతలు ఎంపీ మిథున్ రెడ్డి చూసుకుంటున్నారు. ఆయన గోదావరి జిల్లాల వైసీపీ రీజనల్ కో ఆర్డినేటర్ గా ఉన్నారు.
అయితే ఆయన వాటితో పాటుగా స్పెషల్ ఫోకస్ కేవలం పిఠాపురం మీదనే పెట్టబోతున్నారని అంటున్నారు. ఆయనతో పాటు పవన్ తో గతంలో కయ్యానికి కాలుదువ్విన కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. రూరల్ ఎమ్మెల్యే మాజీ మంత్రి కురసాల కన్నబాబు, కాపు నేత ముద్రగడ పద్మనాభం వంటి వారిని పిఠాపురానికే వినియోగిస్తున్నారు. వీరంతా కలసి పిఠాపురంలో విస్తృతంగాపర్యటించనున్నారు.
మరోవైపు సీఎం జగన్ బస్సు యాత్రను కూడా పిఠాపురంలో ప్లాన్ చేశారు. ఏప్రిల్ మూడవ వారంలో జగన్ పిఠాపురంలో బస్సు యాత్ర చేస్తారు. ఒక రోజు మొత్తం ఆయన అక్కడే బస చేయనున్నారు. ఎన్నికల వ్యూహాలతో పాటు పార్టీని మొత్తం జనసేన-టీడీపీ కూటమికి వ్యతిరేకంగా సిద్ధం చేస్తారు. వీటితోపాటు పిఠాపురంలో సామాజిక వర్గాల వారీగా కూడా వైసీపీ వ్యూహరచన చేస్తోంది.
కాపులలో ఓట్లు 60-40– శాతంగా లెక్క వేసుకుంటోంది. అంటే 60 శాతం ఓట్లు జనసేనకు వెళ్తే, 40 శాతం ఓట్లు వైసీపీకి పడతాయని భావిస్తోంది. అందువల్ల బీసీలు, ఎస్సీల ఓట్ల మీద ఆధారపడుతోంది.
ఈ రెండు వర్గాలు కలిపి లక్షా నలభై వేల పైచిలుకు ఓట్లు ఉన్నాయి. పిఠాపురంలో అభ్యర్థి గెలవాలటే లక్ష పైన ఓట్లు రావాలి. 95 వేల ఓట్లు ఉన్న కాపులలో 35 వేల దాకా ఓట్లు తమకు వచ్చినా.. ఆ మిగిలిన 70 వేల ఓట్లను బీసీలు, ఎస్సీల నుంచి సమకూర్చుకుంటే.. తమ అభ్యర్థి సునాయాసంగా గెలవవచ్చు అన్నది వైసీపీ ఎత్తుగడగా ఉంది.
మరి పవన్ కల్యాణ్ ఈ వ్యూహాలన్నింటినీ దాటుకొని, వైసీపీ చక్రబంధంలో చిక్కకుండా బయటపడి గెలిచేందుకు ఎలా ముందుకెళతారో, రాష్ట్రంలో తన పార్టీ అభ్యర్థులను, కూటమి అభ్యర్థులను ఎలా గెలిపించుకుంటారో చూడాల్సిందే.
Also Read This Article : కేంద్ర మంత్రి పదవే లక్ష్యంగా తమిళిసై రాజీనామా?