సురేష్ ప్రొడక్షన్స్‌కు బిగ్ షాక్.. అసలేం జరిగిందంటే..

సురేష్ ప్రొడక్షన్స్‌కు సుప్రీంకోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. అసలు ఏం జరిగింది? ఎందుకు సురేష్ ప్రొడక్షన్స్ సుప్రీంకోర్టు మెట్లు ఎక్కాల్సి వచ్చిందో తెలుసుకుందాం. విశాఖ బీచ్ రోడ్‌లో రామానాయుడు స్టూడియోస్ కోసం గత ప్రభుత్వం 34.44 ఎకరాల భూమిని కేటాయించింది. అయితే ఈ భూమిలో కొంత భాగాన్ని అంటే 15.17 ఎకరాలలో నివాస స్థ‌లాల‌ లేఅవుట్ కోసం రియల్ వెంచర్లు వేశారంటూ పెద్ద ఎత్తున వివాదం నడిచింది. వాస్తవానికి గత ప్రభుత్వం ఫిలిం సిటీ కోసం కేటాయించిన భూములను ఇతర అవసరాలకు వాడుకునేందుకు అనుమతించింది.

సినీ పరిశ్రమ అభివృద్ధే ధ్యేయంగా కేటాయించిన భూమితో వ్యాపారం చేయాలనుకోవడంపై వుడా (విశాఖ అర్బ‌న్ అథారిటీ-క‌లెక్ట‌రేట్) షోకాజ్ నోటీసులు జారీ చేసింది. అలాగే గత ప్రభుత్వ నిర్ణయాన్ని రద్దు చేయాలంటూ ఏపీ ప్రభుత్వం సైతం షోకాజ్ నోటీస్ జారీ చేసింది. దీనిపై సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. శుక్రవారం దీనిపై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. జ‌స్టిస్ అభ‌య్ ఎస్.ఓకా ధ‌ర్మాస‌నం పిటిష‌న్‌లో జోక్యం చేసుకునేందుకు నిరాక‌రించింది. అలాగే మ‌ధ్యంత‌ర ఉప‌శ‌మ‌నం కుద‌ర‌ద‌ని.. అవ‌స‌ర‌మైతే ప్ర‌భుత్వ‌ షోకాజ్ నోటీస్‌పై స్థానిక కోర్టును ఆశ్ర‌యించాల‌ని సుప్రీం తీర్పు ఇచ్చింది. దీంతో తమ పిటిషన్‌ను ఉపసంహరించుకుంటామని సురేష్ ప్రొడక్షన్స్ తెలియజేయడంతో సుప్రీం అనుమతించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *