ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా థియేటర్ల సమస్య నడుస్తోంది. ఈ సమస్యకు ముఖ్య కారణంగా అందరి వేళ్లు ఓ నలుగురి వైపే చూపిస్తున్నాయి. వారిలో అల్లు అరవింద్, దిల్ రాజు మీడియా ముందుకు వచ్చి సమస్యకు కారణం తాము కాదని.. సామరస్యంగా పరిష్కరించుకోవాలంటూ సూచన చేశామని తెలిపారు. కానీ తాజాగా ప్రముఖ నిర్మాత ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ఈ సమస్యకు ముఖ్య కారణం.. నిర్మాతలే కాకుండా.. పెద్ద హీరోలు కూడా కారణమని తేల్చి చెప్పారు. విపరీతంగా రెమ్యూనరేషన్స్ పెద్ద హీరోలు పెంచేయడం.. సినిమాకు అనవసర బడ్జెట్ పెరిగిపోవడం.. డబ్బు అంతా ఒక చోటే కేంద్రీకృతమవడమే దీనికి కారణమని కేఎస్ రామారావు స్పష్టం చేశారు.
‘‘ఆంధ్రప్రదేశ్ ఎగ్జిబిటర్స్ మిత్రులందరికీ.. ఛాంబర్ సభ్యులందరికీ నమస్కారం. జూన్ 1నుంచి మీరు చేయబోయే కార్యక్రమాలకు మద్దతు తెలుపుతూ.. ఆ కార్యక్రమాన్ని ఎలా ముందుకు తీసుకెళితే బాగుంటుందనే ఆలోచనతో మీ ముందుకు రావడం జరిగింది. నేను చెప్పేది రైట్ అనో.. లేదంటే ఫాలో అవ్వాలనో ఉద్దేశించింది కాదు. ఎక్కడైనా ఫిలిం ఇండస్ట్రీ బాగుండటానికి కారకులు ఎగ్జిబిటర్స్. వారి పరిస్థితి ఇబ్బందికరంగా మారడానికి కారణం.. ఓటీటీ, పైరసీ వంటివి. వాటి వలన ప్రొడ్యూసర్, ఎగ్జిబిటర్స్ నష్టపోతున్నారు. వీక్లీ రెంటల్స్ పేరిట ఎగ్జిబిటర్స్కి రావల్సిన షేర్ రాకపోవడం.. అనేక కారణాలతో ఎగ్జిబిటర్ స్ట్రైక్ ఆలోచన చేస్తున్నారు. న్యాయంగా ఇది నిర్మాతలు, హీరోలు ఆలోచించారు. ఎక్కువ శాతం మనీ కొంతమంది హీరోలకే చేరుతోంది. మనీ షేర్ అవడం లేదు. ఒక్క చోటికే వెళ్లిపోతోంది. దీనికి కారణం.. అనవసరమైన బడ్జెట్స్.. విపరీతమైన రెమ్యూనరేషన్స్.. ఈ డబ్బంతా ఒకచోటికే వెళ్లడం.. ఒకచోటే పోగుపడటం. ఈ విషయం ఇండస్ట్రీలో పెద్ద హీరోలకు తెలుసు, పెద్ద నిర్మాతలకు తెలుసు.. అలాగే ఇండస్ట్రీలో అతి ముఖ్యమైన వ్యక్తులు దిల్ రాజు, అల్లు అరవింద్, సురేష్ బాబుకి కూడా తెలుసు. ఓటీటీకి అమ్మితే బాగా డబ్బు వస్తుంది కదా అనే భావనకు రావడం. కాబట్టి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గారు, చిరంజీవి గారు, బాలకృష్ణ గారు అంతా కూర్చొని ఏం చేయాలో మాట్లాడుకుంటే.. ప్రొడక్షన్ పెరుగుతుంది.. నంబర్ ఆఫ్ సినిమాలు పెరుగుతాయి.. ఓటీటీతో సంబంధం లేకుండా సినిమాలు తీయడం చేయాలంటే హీరోల వల్లే జరుగుతుంది. డిస్ట్రిబ్యూటర్స్ కూడా విపరీతమైన రేట్లు పెట్టి ప్రొడ్యూసర్స్కి ఇచ్చి.. వారు ఆర్టిస్టులకు ఇవ్వడం.. రెమ్యూనరేషన్స్ విపరీతంగా పెంచడంతో ఇండస్ట్రీ మోనోపోలి వైపు వెళ్లిపోవడం వలన ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఎగ్జిబిటర్స్ ఈ స్థితికి వచ్చారు. ఒకప్పుడు ఇదే ఎగ్జిబిటర్స్ సినిమాను ఎంత బాగా ప్రదర్శించారు? ఎన్ని రోజులు సినిమాలు వంద రోజుల ఫంక్షన్స్ చేశారు? వీటన్నింటికీ ఎగ్జిబిటర్సే కారణం. అలాంటి ఎగ్జిబిటర్స్ నేడు సినిమాలు చేయలేమంటున్నారు. థియేటర్స్ మూసివేస్తామంటున్నారు. దీనికి ఇండస్ట్రీలోని ప్రతి ఒక్కరూ కారణమే’’ అని ప్రొడ్యూసర్ కేఎస్ రామారావు తెలిపారు.
ప్రజావాణి చీదిరాల