యంగ్ టాలెంటెడ్ హీరో కార్తిక్ రాజు,’అనగనగా’ ఫేమ్ కాజల్ చౌదరి జంటగా సినిమా ప్రారంభమైంది. రామానాయుడు స్టూడియోలో పూజా కార్యక్రమాలు జరిగాయి. ఈ పూజా కార్యక్రమాలకు ప్రముఖ నిర్మాత సురేష్ బాబు, తమ్మారెడ్డి భరద్వాజ, భీమనేని శ్రీనివాస రావు, క్రాంతి మాధవ్, హీరో చైతన్య వంటి వారు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ‘అట్లాస్ సైకిల్ అత్తగారు పెట్లే’ అనే క్రేజీ టైటిల్లో రూపొందుతున్న ఈ సినిమాకు రాజా దుస్సా దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ రామకృష్ణ సినిమా బ్యానర్పై గాలి కృష్ణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సురేష్ బొబ్బిలి మ్యూజిక్ అందిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ స్క్రిప్ట్ అందజేయగా.. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత సురేష్ బాబు క్లాప్ కొట్టగా.. హీరో చైతన్య కెమెరా స్విచ్ ఆన్ చేయగా, తొలి షాట్ కి భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వం వహించారు.
అనంతరం హీరో కార్తిక్ రాజు మాట్లాడుతూ .. ‘80వ దశకంలో జరిగే కథతో ఈ చిత్రం రాబోతోంది. కాజల్ చౌదరి ప్రస్తుతం మంచి సక్సెస్లు అందుకుంటోంది. ఆమెతో కలిసి నటిస్తుండటం ఆనందంగా ఉంది’ అని అన్నారు. కాజల్ చౌదరి మాట్లాడుతూ .. ‘ఈ చిత్రంలో నటిస్తుండటం ఆనందంగా ఉంది. కథ చాలా బాగుంటుంది. ఇదొక యూనిక్ స్టోరీ. మంచి టీంతో పని చేస్తున్నాను. తెలుగు ప్రేక్షకులు ప్రస్తుతం నా మీద ఎంతో ప్రేమను కురిపిస్తున్నారు. ఈ చిత్రంతోనూ నన్ను ఆదరిస్తారని కోరుకుంటున్నాను’ అని అన్నారు. అనంతరం దర్శకుడు రాజా దుస్సా మాట్లాడుతూ .. ‘ఇదొక పీరియాడికల్ మూవీ. హాస్యం, ఎమోషనల్ కలబోతగా మా చిత్రం ఉంటుంది. 1980లో వరంగల్లో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిస్తున్నాము. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాం’’ అన్నారు.