Article 370 :
ఆర్టికల్ 370 రద్దు అయింది. జమ్ము కశ్మీర్ భారత్ లో సంపూర్ణంగా అంతర్భాగమైంది. అయోధ్యలో రామాలయ నిర్మాణం పూర్తైంది.
బీజేపీ ప్రధాన హామీ నెరవేరింది. బీజేపీ ఎజెండాలోని మూడు ప్రధాన అంశాల్లో రెండు పూర్తయ్యాయి.
ఇక ఉమ్మడి పౌరస్మ్రుతి(యూసీసీ)మిగిలిపోయింది. రామాలయమే ప్రధాన ప్రచారాస్ర్తంగా బీజేపీ ఈ లోక్సభ ఎన్నికలకు వెళ్లవచ్చు.
రాజకీయ విశ్లేషకులు కూడా ఇదే భావిస్తున్నారు. అయితే, బీజేపీ తన మూడో ఎజెండా అయిన యూసీసీ లోక్ సభ ఎన్నికల్లోనే తెరపైకి తీసుకురావడానికి ప్రయత్నాలు మొదలుపెట్టింది.
ఇందులో భాగంగానే ఉత్తరాఖండ్లో ఉన్న బీజేపీ ప్రభుత్వం వచ్చే నెల ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశం నిర్వహించి యూసీసీ ముసాయిదాను ఆమోదించనుంది.
ఈ ముసాయిదా ఆధారంగా గుజరాత్, అసోం కూడా యూసీసీని తీసుకురానున్నాయి. తద్వారా బీజేపీ.. ఇక యూసీసీ వంతు వచ్చింది అని ప్రజలకు చెప్పాలని అనుకుంటోంది.
2014 సార్వత్రిక ఎన్నికల్లోనే బీజేపీ యూసీసీ తెస్తామని ప్రకటించింది. 2019 ఎన్నికల్లో కూడా యూసీసీకి కట్టుబడి ఉన్నామని తెలిపింది.
అయితే, రామాలయం, ఆర్టికల్ 370, ట్రిపుల్ తలాక్, సర్జికల్ స్ట్రైక్స్ లాంటి అంశాలతో యూసీసీపై పెద్దగా ద్రుష్టి పెట్టలేదు.
అయితే, 2022లో ఉత్తరాఖండ్లో బీజేపీ అధికారంలోకి వచ్చాక అక్కడ.. యూసీసీపై సుప్రీం మాజీ జడ్జి రంజనా ప్రకాశ్ దేశాయ్ ఆధ్వర్యంలో ఐదుగురు సభ్యుల కమిటీని వేశారు.
తొలుత ఆరు నెలల్లో నివేదిక ఇవ్వాలని కోరినప్పటికీ పలుమార్లు గడువును పొడిగించారు.
ఎట్టకేలకు ఈ లోక్ సభ ఎన్నికలకు ముందు కమిటీ ఉత్తరాఖండ్ ప్రభుత్వానికి నివేదిక సమర్పించినట్లు తెలుస్తోంది.
ముసాయిదా రూపకల్పనలో కమిటీకి 2.5 లక్షలకు పైగా సూచనలు, సలహాలు వచ్చాయి. కమిటీ రాష్ట్రవ్యాప్తంగా 35 సమావేశాలను నిర్వహించింది.
ఉమ్మడి పౌర చట్టం అంటే అన్ని మతాలకు ఒకే రకమైన చట్టం వర్తించడం.
ప్రస్తుతం దేశంలో వేర్వేరు మతాలకు వేర్వేరు ప్రత్యేక చట్టాలు.. హిందూ వివాహ చట్టం, వారసత్వం చట్టం, ముస్లిం పర్సనల్ లా, విడాకులు ఇలా వేర్వేరు చట్టాలు ఉన్నాయి.
ఒక్కో మతానికి ఒక్కో రకమైన నిబంధనలు కాకుండా.. వివాహాలు, విడాకులు, వారసత్వం లాంటి అంశాల్లో అందరికీ ఒకే రకమైన నిబంధనలు తీసుకురావడమే యూసీసీ.
రాజ్యాంగంలోని 44వ ఆర్టికల్ ‘‘ఉమ్మడి పౌర చట్టాన్ని తీసుకురావడానికి ప్రభుత్వం ప్రయత్నం చేయాలి’’ అని చెబుతున్నది.
Also Read:UCC bill:ఆ రాష్ట్రంలో అత్యంత వివాదాస్పద బిల్లు